కస్టమర్లు, చిన్న ఇన్వెస్టర్లకు షాక్: ధనలక్ష్మీ బ్యాంకులో సంక్షోభం, ఆర్బీఐ జోక్యం
లక్ష్మీ విలాస్ బ్యాంకు సంక్షోభం వెలుగు చూసిన రెండు రోజులకే మరో బ్యాంకు ఇబ్బందులు ఎదుర్కొంటోంది. కేరళ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తోన్న ధనలక్ష్మీ బ్యాంకు సంక్షోభంలోకి వెళ్తోందని వార్తలు వస్తున్నాయి. ఈ బ్యాంకు పరిస్థితిపై అఖిల భారత బ్యాంకింగ్ అధికారుల సమాఖ్య (AIBOC) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్ శక్తికాంత దాస్కు లేఖ రాసింది. ధనలక్ష్మీ బ్యాంకు విషయంలో జోక్యం చేసుకోవాలని కోరాయి. వెంటనే చర్యలు చేపట్టాలని కోరింది.
సంక్షోభంలో లక్ష్మీవిలాస్ బ్యాంకు, రంగంలోకి ఆర్బీఐ: ఏం జరిగిందంటే?
ఉద్యోగులు, వాటాదారులు, కస్టమర్ల ప్రయోజనాలకు దెబ్బ
వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే ఉద్యోగులు, షేర్హోల్డర్లు, కస్టమర్ల ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఆర్బీఐ దిద్దుబాటు చర్యల నుండి బ్యాంకు గత ఏడాది బయటపడిందని గుర్తు చేస్తున్నాయి. అయినప్పటికీ ఇష్టారీతిన రుణ మంజూరు, నిర్వహణ ఖర్చుల భారం కారణంగా ధనలక్ష్మి బ్యాంకు ఆర్థిక పరిస్థితి తిరిగి ప్రమాదంలో పడిందని భావిస్తున్నారు. ఈ బ్యాంకు ఆర్థిక పరిస్థితులపై ఇదివరకే AIBEO లేఖ రాసింది. ఇప్పుడు AIBOC లేఖ రాసింది. బ్యాంకును కాపాడేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరాయి.
డైరెక్టర్ను నియమించిన ఆర్బీఐ
ధనలక్ష్మీ బ్యాంకు బోర్డులో రెండేళ్ల కాలానికి నామినీ డైరెక్టర్ను నియమించింది ఆర్బీఐ. తమ నామినీ డైరెక్టర్గా డీకే కశ్యప్ను నియమించింది. నియామకానికి కారణాలు వెల్లడించలేదు. సెప్టెంబర్ 28, 2020 నుండి ఆర్బీఐ బెంగళూరు ప్రాంతీయ కార్యాలయం జనరల్ మేనేజర్ డీకే కశ్యప్ను ధనలక్ష్మీ బ్యాంకు బోర్డులో అదనపు డైరెక్టర్గా నియమించారని ఎక్స్చేంజీలకు ఇచ్చిన లేఖలో బ్యాంకు తెలిపింది. ఈ నియామకం సెప్టెంబర్ 27, 2022 వరకు ఉంటుంది. అసాధారణ పరిస్థితులు తలెత్తినప్పుడు మాత్రమే ఆర్బీఐ ఇలా తమ నామినీలను నియమిస్తుంది. ఈ బ్యాంకుని సరైన దిద్దుబాటి ప్రణాళిక (PCA-ప్రాంప్ట్ కరెక్టివ్ యాక్షన్) ఫ్రేమ్ వర్క్ కింద గతంలో ఆర్బీఐ ఉంచింది. 2015లో ఆర్బీఐ PCA కింద ఉంచింది. గత ఏడాది ధనలక్ష్మీ బ్యాంకు దీని నుండి బయటపడింది. అప్పటి నుండి లాభాలను నమోదు చేసింది.
కస్టమర్లు, చిన్న ఇన్వెస్టర్లకు ఇబ్బందికరం..
ధనలక్ష్మీ బ్యాంకు 92 సంవత్సరాల క్రితం ప్రారంభించారు. ధనలక్ష్మీ బ్యాంకు తప్పుడు దిశలో ప్రయాణిస్తున్నట్లు ఆర్బీఐ గవర్నర్కు ఉద్యోగ సంఘాలు లేఖ రాశాయి. పెద్ద ఇండివిడ్యువల్ వాటాదారుల మధ్య విబేధాలు, కొత్త వాటాదారులను ఆశ్రయించే ప్రయత్నాలు ఈ బ్యాంకు ఇబ్బందులకు కారణంగా భావిస్తున్నారు. ఈ బ్యాంకు సంక్షోభం కస్టమర్లు, చిన్న ఇన్వెస్టర్లకు ఇబ్బందికర పరిణామం. వాటాదారులు డైరెక్టర్లను తొలగించిన అనంతరం లక్ష్మీ విలాస్ బ్యాంకు రోజువారీ కార్యకలాపాల నిర్వహణ కోసం ముగ్గురు సభ్యుల కమిటీని ఆర్బీఐ నియమించిన విషయం తెలిసిందే.