అంచనాలు తలకిందులయ్యాయి, ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుంది: ఆర్బీఐ
ముంబై: కరోనా మహమ్మారి వల్ల తలెత్తిన పరిస్థితులు మళ్లీ చక్కబడితే దేశీయ డిమాండ్, వృద్ధి పుంజుకుంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆశాభావం వ్యక్తం చేసింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ, ఉద్దీపన చర్యలు ఆర్థిక వ్యవస్థకు అండగా నిలుస్తాయని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో దేశీయ వృద్ధి రేటును అంచనా వేయడం కష్టమని తెలిపింది.
ఆదాయపు పన్ను భారీ ఊరట, రూ.5 లక్షల లోపు రీఫండ్ చెల్లింపు
సంక్షోభంలోకి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ
అంతర్జాతీయ వృద్ధి రేటుపై కరోనా మహమ్మారి ప్రభావం భారీగా ఉందని ఆర్బీఐ తెలిపింది. 2020లో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి వెళ్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇది మనకూ వర్తిస్తుందని పేర్కొంది. ఇప్పటికే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కూడా ఇదే విషయం తెలిపింది. పరిస్థితులు చక్కబడితే మన ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని తెలిపింది.
కరోనా వ్యాప్తితో అంచనాలు తలకిందులు
కరోనా వైరస్ వ్యాప్తికి ముందు మన దేశంలో 2020-21 వృద్ధిరేటు కొంత గాడిలో పడవచ్చునని ఆర్బీఐ అంచనా వేసింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అభిప్రాయపడింది. అయితే 2019-20లో రబీ సీజన్ కలిసి రావడం, అధిక ఆహారం ధరలు గ్రామీణ డిమాండ్ పెంచాయని, కీలక రేట్ల కోత వల్ల బ్యాంకు రుణ రేట్లు తగ్గాయని ఆర్బీఐ వివరించింది. రబీ అధిగ దిగుబడులు గ్రామీణుల కొనుగోళ్ల శక్తిని పెంచుతుందని తెలిపింది. మౌలిక రంగ వ్యయాలు పెంచడం, పన్ను రేట్ల కోత వంటి నిర్ణయాలు మన దేశంలో డిమాండ్ పెంచుతాయని తెలిపింది. కరోనా వ్యాప్తితో మొత్తం అంచనాలు తలకిందులవుతున్నాయని వెల్లడించింది.
వృద్ధి రేటును అంచనా వేయలేం
అంతర్జాతీయ మందగమనం, దేశీయ లాక్ డౌన్ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని ఆర్బీఐ తెలిపింది. కరోనా నేపథ్యంలో ఆర్బీఐ ద్రవ్యపరమైన నిర్ణయాలకు కేంద్రం ఆర్థికపరమైన చర్యలు సత్ఫలితాలు ఇస్తాయనే విశ్వాసం వ్యక్తం చేసింది. ఈ కష్టకాలంలో దేశ వృద్ధిరేటును అంచనా వేయలేమని చెప్పింది.
ద్రవ్యోల్భణం 2.4 శాతం
2020-21 ఆర్థిక సంవత్సరం నాలుగో క్వార్టర్ నాటికి ద్రవ్యోల్భణం 2.4 శాతానికి పడిపోవచ్చునని ఆర్బీఐ అంచనా వేసింది. జనవరిలో 7.6 శాతంగా ఉన్న ద్రవ్యోల్భణం ఫిబ్రవరి నాటికి 6.6 శాతంగా ఉందని పేర్కొంది. వినియోగదారుల ధరల సూచీ (CPI) ఆధారిత ద్రవ్యోల్భణం ఈ ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్లో 2.4 శాతం ఉంటుందని తెలిపింది.
ఆర్థిక మాంద్యంలోకి..
కరోనా దెబ్బకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఆర్థిక మాంద్యంలోకి జారుకుంటోందని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (WTO) హెచ్చరిక జారీ చేసింది. గతంలో ఎన్నడూ లేని సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొక తప్పదని హెచ్చరించింది. ఈ ఏడాది అంతర్జాతీయ వాణిజ్యం 13% నుంచి 32% వరకు పడిపోవచ్చునని తెలిపింది. ఈ గడ్డు పరిస్థితుల నుంచి బయటపడాలంటే ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించాల్సిన అవసరముందని స్పష్టం చేసింది.