bisleri: బిస్లెరీ అమ్మకంపై రమేష్ చౌహాన్ స్పష్టత.. జయంతి చౌహాన్ పాత్ర ఏమిటంటే..
bisleri: త్రాగునీరు, సోడా వ్యాపారాలు నిర్వహిస్తున్న బిస్లెరీ కంపెనీ గురించి తెలియని వారుండరు. రమేష్ చౌహాన్ ఈ సంస్థను స్థాపించి ఇప్పటివరకు విజయవంతంగా నడిపిస్తూ వచ్చారు. అయితే ఈ బిజినెస్ నిర్వహణకు ఆయన కుమార్తె జయంతి చౌహాన్ గతంలో విముఖత చూపారు. దీంతో టాటా గ్రూపు బిస్లెరీని టేకోవర్ చేయనున్నట్లు వార్తలు వచ్చాయి.
అమ్మే ప్రసక్తి లేదు
బిస్లెరీని టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్(TCPL) కొనుగోలు చేయడంలేదని ప్రముఖ మీడియా సంస్థ తాజాగా నివేదించింది. ప్రస్తుత ఛైర్మన్ కుమార్తె జయంతి చౌహాన్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఏంజెలో జార్జ్ నేతృత్వంలోని ప్రొఫెషనల్ టీమ్ తో కలిసి ఆమె వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్లనున్నట్లు రమేష్ చౌహాన్ ఇటీవల స్పష్టం చేశారు.
ఎవరీ జయంతి చౌహాన్ ?
బిస్లెరీ వ్యవస్థాపకులు రమేష్ చౌహాన్ ఏకైక కుమార్తె జయంతి చౌహాన్. కంపెనీ వైస్ ఛైర్ పర్సన్ గా ఆమె పనిచేస్తున్నారు. HR, సేల్స్, మార్కెటింగ్ వంటి వివిధ విభాగాల్లో కొన్నేళ్లపాటు సేవలందించారు. వ్యాపారాన్ని ఆటోమేషన్ వైపు ముందుండి నడిపించారు. విలాసవంతమైన 'వేదిక' బ్రాండ్ ను ప్రమోట్ చేయడంలో కీలక పాత్ర పోషించారు.
వివిధ విభాగాల్లో సేవలు
2011లో ముంబై కార్యాలయంలో జయంతి బాధ్యతలు చేపట్టారు. విస్తృతమైన గ్లోబల్ ఎక్స్ పోజర్తో వ్యాపారంలో సరికొత్త దృక్పథాన్ని తీసుకువచ్చారు. బిస్లెరీ మినరల్ వాటర్, హిమాలయ నుంచి వెలువడిన వేదిక నేచురల్ మినరల్ వాటర్, ఫిజీ ఫ్రూట్ డ్రింక్స్, బిస్లెరీ హ్యాండ్ ప్యూరిఫైయర్ విభాగాలకు సంబంధించిన కార్యకలాపాలను క్రమబద్ధీకరించడంపై ప్రస్తుతం పనిచేస్తున్నారు.