వడ్డీరేట్ల పెంపు దేశద్రోహం కాదు, అప్పుడు IMF వద్దకు, ఇప్పుడా అవసరం లేదు: రాజన్
దేశంలో రోజురోజుకు పెరుగుతున్న ద్రవ్యోల్భణం, బ్యాంకింగ్ వడ్డీ రేట్ల పెంపుకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మాజీ గవర్నర్ రఘురాం రాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా, రష్యా - ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ద్రవ్యోల్భణం విపరీతంగా పెరుగుతోంది. మన దేశంలోను ద్రవ్యోల్భణం షాకిస్తోంది.
ఈ నేపథ్యంలో రాజన్ మాట్లాడుతూ... ద్రవ్యోల్భణాన్ని అదుపు చేయడానికి బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచడం సర్వ సాధారణమేనని, ప్రపంచ దేశాలు ఇలాగే చేస్తాయని, నేడు కాకపోయినా రైపు అయినా మనం పెంచక తప్పదని చెప్పారు. కొన్ని రాజకీయ పార్టీలు దీనిని పొలిటికల్ మైలేజ్ కోసం ఉపయోగించుకుంటున్నాయని, బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచడం యాంటీ-నేషనల్ ఏమీ కాదన్నారు.
వడ్డీ రేట్లు పెంచవలసి వస్తుంది
ద్రవ్యోల్భణం కట్టడికి ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచవలసి వస్తుందని, ఇదేమీ విదేశీ పెట్టుబడిదారులకు ప్రయోజనం కలిగించే జాతి విద్రోహ చర్య కాదన్నారు రాజన్. ఆర్థిక స్థిరత్వానికి ఇది పెట్టుబడి వంటిది అని తెలుసుకోవాలన్నారు. ద్రవ్యోల్భణంపై చేసే యుద్ధం ఎప్పటికీ ముగియదని, మన దేశంలో ఇది పెరుగుతోందని, నియంత్రణ కోసం మిగతా ప్రపంచం మాదిరి వడ్డీ రేట్లను ఆర్బీఐ పెంచవలసి వస్తుందన్నారు.
తాను ఉన్న సమయంలో...
తాను ఆర్బీఐ గవర్నర్గా ఉన్న సమయంలో అధిక వడ్డీ రేట్లు ఉన్నాయనే విమర్శలపై స్పందిస్తూ మూడేళ్ల సమయం తాను ఆర్బీఐ గవర్నర్గా ఉన్నానని, 2013 సెప్టెంబర్లో తాను బాధ్యతలు స్వీకరించినట్లు గుర్తు చేశారు. ఆ సమయంలో రూపాయ వ్యాల్యూ క్షీణించిందని, దీంతో కరెన్సీ సంక్షోభం కనిపించిందని, ద్రవ్యోల్భణం 9.5 శాతంగా ఉందని, దీనిని అదుపు చేయడానికి రెపో రేటును 7.25 శాతం నుండి 8 శాతానికి పెంచినట్లు తెలిపారు.
ఆ తర్వాత ద్రవ్యోల్భణం తగ్గడంతో రెపో రేటును 6.5 శాతానికి తగ్గించినట్లు గుర్తు చేశారు. ఆర్బీఐ చర్యతో ఆర్థిక వ్యవస్థ, రూపాయి స్థిరత్వాన్ని సాధించాయన్నారు. తాను ఆర్బీఐ గవర్నర్గా ఉన్న 2013 ఆగస్ట్ నుండి 2016 ఆగస్ట్ మధ్య ద్రవ్యోల్భణం 9.5 శాతం నుండి 5.3 శాతానికి దిగి వచ్చిందన్నారు. ఇందుకు ఆర్బీఐ చర్యలు కూడా దోహదపడినట్లు చెప్పారు.
విదేశీ మారకపు నిల్వలు
ప్రస్తుతం భారత్ వద్ద 600 బిలియన్ డాలర్లకు పైగా విదేశీ మారకపు నిల్వలు ఉన్నాయని, చమురు ధరలు భారీగా పెరిగినప్పటికీ ఫైనాన్షియల్ మార్కెట్లను ఆర్బీఐ స్థిమితపరచడానికి అందుకే వీలవుతోందని రాజన్ అన్నారు. 1990-91లో సంక్షోభ సమయంలో చమురు ధరలు పెరిగితే మారకపు నిల్వల కోసం ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ వద్దకు వెళ్లవలసి వచ్చిందని, ఇప్పుడు మన వద్దే నిల్వలు ఉన్నాయన్నారు. ఆర్బీఐ ఎప్పుడు ఏం చేయాలో అది చేస్తుందన్నారు.