రైల్వే బోగీలు లీజుకు కావాలా నాయనా: కేంద్రం బిగ్ ప్లాన్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం.. ఏ స్థాయిలో ప్రైవేటీకరణ చేపట్టిందో ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. ప్రైవేటీకరణను పరుగులు పెట్టిస్తోంది. తన పర్యవేక్షణలో ఉన్న కొన్ని కీలక కంపెనీల్లో పెట్టుబడులను ఉపసంహరించుకుంటోంది. లాభాలను తెచ్చి పెట్టే ప్రభుత్వరంగ సంస్థలను సైతం అమ్మకానికి పెట్టింది. ఇదివరకు నష్టాల్లో ఉంటూ.. ఖాయిలా పడ్డ పరిశ్రమలను మాత్రమే విక్రయించాలంటూ తీసుకున్న విధానాల్లో సమూల మార్పులను తీసుకొచ్చింది.
ప్రైవేటీకరణ జోరుగా..
లాభాలను ఆర్జిస్తోన్న సంస్థలను కూడా ప్రైవేటీకరించనుంది. జీవిత బీమా సంస్థ, విశాఖపట్నం ఉక్కు కర్మాగారం వంటి కంపెనీలను దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎయిరిండియాతో పాటు రద్దీ మార్గాల్లో రాకపోకలు సాగించే రైళ్లను కూడా ప్రైవేటు వ్యక్తలు చేతుల్లో పెట్టడానికి సుదీర్ఘకాలం నుంచీ ప్రయత్నాలు సాగిస్తూ వస్తోంది మోడీ సర్కార్. ప్రయోగాత్మకంగా కొన్ని మార్గాల్లో తేజస్ రైళ్లను నడిపిస్తోంది కూడా. ఎయిరిండియాను కొనుగోలు చేయడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చేపట్లేదు. అలాగే- తేజస్ రైళ్లను నడిపించడానికి ప్రైవేట్ కంపెనీలు కూడా ముదుకు రావట్లేదు.
రైల్వే బోగీలు లీజుకు..
ఈ పరిణామాల మధ్య రైల్వే మంత్రిత్వ శాఖ మరో కీలక ప్రతిపాదనలను రూపొందించినట్లు తెలుస్తోంది. రైలు బోగీలను లీజుకు ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై పెద్ద ఎత్తున కసరత్తు చేస్తున్నట్లు జాతీయ మీడియా మింట్ ఓ కథనాన్ని ప్రచురించింది. దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర ప్రైవేట్ సెలబ్రేషన్స్ నిర్వహించుకోవడానికి, టూరిస్ట్ సర్కుట్ రైళ్ల కోసం వినియోగించుకోవడానికి ఈ లీజు విధానాన్ని తెరమీదికి తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
కేబినెట్ సమక్షానికి
ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఈ రైలు బోగీల లీజు సంబంధించిన ప్రతిపాదనలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం. రైలు బోగీలను లీజుకు తీసుకున్న వ్యక్తులు లేదా సంస్థలు.. వాటిని మార్కెటింగ్, హాస్పిటాలిటీ, కల్చరల్ ప్రోగ్రామ్స్, ఇతర సెలబ్రేషన్స్ నిర్వహించుకోవడానికి వీలు ఉంటుందని, ఆ కార్యక్రమాలన్నీ రైల్వే మంత్రిత్వ శాఖ రూపొందించే విధి విధానాలు, మార్గదర్శకాలకు లోబడి ఉండేలా రైల్వే మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంటుందని అంటున్నారు.
అయిదేళ్ల పాటు లీజు..
లీజు కాల పరిమితి కనీసం అయిదేళ్లుగా నిర్ధారించింది. అంటే- సంబందిత రైలు బోగీ.. అయిదేళ్ల పాటు లీజుకు తీసుకున్న వ్యక్తులు లేదా సంస్థల ఆధీనంలో కొనసాగుతుంది. రైలు బోగీ లోపల అడ్వర్టయిజ్మెంట్లు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించినట్లు తెలుస్తోంది. లీజుకు తీసుకున్న వ్యక్తి లేదా సంస్థ.. తమకు చెందిన లేదా ఇతర వాణిజ్య ప్రకటనలు, ప్రచారాన్ని రైలు బోగీ లోపల కూడా చేపట్టడానికి వీలు కల్పించేలా నిబంధనలను రూపొందించినట్లు చెబుతున్నారు.
మార్గదర్శకాలు ఎలా..
ఈ విధానం ద్వారా రైల్వేకు పెద్ద ఎత్తున ఆదాయం లభించే అవకాశాలు లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. బోగీలను లీజుకు ఇవ్వడం వల్ల కరోనా వైరస్ సంక్షోభ సమయంలో కోల్పోయిన ఆదాయాన్ని మళ్లీ ఆర్జించడానికి అవకాశం ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోెన్నాయి. లీజు అమౌంట్ ఏ స్థాయిలో ఉంటుందో.. ఇంకా నిర్ధారణ కావాల్సి ఉందని, దాన్ని ఏ ప్రాతిపదికన వసూలు చేస్తుంది? అందుకు గల మార్గదర్శకాలు, విధి విధానాలు, ఇతర గైడ్లైన్స్ ఎలా ఉంటాయనేది ఇంకా ఖరారు చేయాల్సి ఉందని అంటున్నారు. పర్యాటక రంగంలో ఉన్న వారికి/సంస్థలకు బోగీల లీజులో ప్రాధాన్యత ఇస్తారని సమాచారం.