బజాజ్ ఫైనాన్స్ ఛైర్మన్ పదవి నుంచి వైదొలగిన రాహుల్ బజాజ్: ఆయన వారసుడిగా
ముంబై: దేశీయ కార్పొరేట్ రంగంలో ఒక్కటొక్కటిగా భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కారణాలేమిటో తెలియరావట్లేదు గానీ.. పారిశ్రామిక దిగ్గజాలు విశ్రాంతి తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. కొద్దిరోజుల కిందటే హెచ్సీఎల్ టెక్నాలజీస్ ఛైర్మన్ పదవి నుంచి ఆ సంస్థ వ్యవస్ధాపకుడు శివ్ నాడార్ తప్పుకొన్నారు. తన వారసురాలు రోషిణీకి ఈ బాధ్యతలను అప్పగించారు. శివ్ నాడార్ తప్పుకొన్న కొద్దిరోజుల్లోనే మరో దేశీయ కార్పొరేట్ సంస్థ ఛైర్మన్ ఖాళీ కాబోతోంది.
తాజాగా- బజాజ్ ఫైనాన్స్ ఛైర్మన్ రాహుల్ బజాజ్.. తన హోదా నుంచి తప్పుకోబోతున్నారు. ఈ నెల 31వ తేదీ వరకే ఆయన బజాజ్ ఫైనాన్స్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ హోాదాలో కొనసాగబోతున్నారు. అనంతరం ఆయన వైదొలగబోతున్నారు. ఆయన స్థానంలో సంజీవ్ బజాజ్ నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ బాధ్యతలను స్వీకరించనున్నారు. సంజీవ్ బజాజ్.. ప్రస్తుతం బజాజ్ ఫైనాన్స్ సంస్థకు వైస్ ఛైర్మన్గా పని చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలతో కూడిన ఓ అధికారిక ప్రకటనను బజాజ్ పైనాన్స్ సంస్థ రెగ్యులేటరీలో ఫైల్ చేసింది.
1987లో బజాజ్ ఫైనాన్స్ సంస్థను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచీ సంస్థ నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా రాహుల్ బజాజ్ కొనసాగుతున్నారు. తమ సంస్థను ఓ అత్యుత్తమ స్థాయికి తీసుకొచ్చారని సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు చెప్పారు. జులై 31వ తేదీ వరకు మాత్రమే రాహుల్ బజాజ్ కొనసాగుతారని తెలిపారు. ఆగస్టు 1వ తేదీ నుంచి సంస్థ ఛైర్మన్గా సంజీవ్ బజాజ్ బాధ్యతలను స్వీకరిస్తారని స్పష్టం చేశారు. సంజీవ్ బజాజ్కు ఛైర్మన్గా నియమించడానికి అవసరమైన ప్రతిపాదనలపై డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఆమోదించారు.
నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీగా గుర్తింపు పొందిన బజాజ్ హోల్డింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ అనుబంధంగా కొనసాగుతోందీ సంస్థ. బీమా, ప్రైవేటు రుణాల మంజూరు రంగంలో పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ సంస్థలో 20 వేలకు పైగా ఉద్యోగులు ఉన్నారు. దేశంలో 1400లకు పైగా ప్రాంతాల్లో ఈ సంస్థకు కార్యాలయాలు ఉన్నాయి. జీవిత బీమా, సాధారణ బీమా రంగాల్లో రాణిస్తోంది. వృద్ధాప్యం ఇతరత్రా కారణాల వల్ల రాహుల్ బజాజ్ ఛైర్మన్ పదవి నుంచి తప్పుకొంటున్నారనే అభిప్రాయాలు కార్పొరేట్ సెక్టార్లో వినిపిస్తున్నాయి.