బ్యాంకులపై పిడుగుపాటు, కార్పోరేట్లు ఈజీగా నిధులు మంజూరు చేసుకుంటారు
న్యూఢిల్లీ: ప్రయివేటు బ్యాంకుల్లోకి కార్పోరేట్లను అనుమతించాలని ఆర్బీఐ వేసిన కమిటీ చేసిన సిఫార్సులపై దుమారం రేగుతోంది. భారీ మొత్తం రుణాల కోసం బ్యాంకులచుట్టూ తిరిగే కార్పోరేట్లకే బ్యాంకుల పగ్గాలు ఇవ్వడం సరికాదని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్, మాజీ డిప్యూటీ విరల్ ఆచార్య అన్నారు. అవసరం ఉన్నవారికి రుణాలు అందకపోవచ్చునని ఆందోళన వ్యక్తం చేశారు. గత కొన్నేళ్లుగా కార్పోరేట్ ఎగవేతలు మనముందు కనిపిస్తున్నాయని, కానీ అవేవీ పట్టకుండా వారికి వారికి ప్రమోటర్లుగా అనుమతివ్వాలనడం సరికాదని అభిప్రాయపడ్డారు.
తప్పుపడుతూ ఆర్టికల్
కార్పొరేట్లరంగ ప్రవేశం బ్యాంకింగ్ వ్యవస్థపై పిడుగుపాటు అవుతుందని వారు అన్నారు. కొన్ని కార్పొరేట్ గ్రూపులు ఆర్థికంగా మరింత బలోపేతమవడానికే ఇది దోహదపడుతుందని పేర్కొన్నారు. ఐఎల్&ఎఫ్ఎస్, యస్ బ్యాంకు వైఫల్యాల నుంచి గుణపాఠాలు నేర్చుకుంటున్న సమయంలో ఇలాంటి ప్రతిపాదనలు సరికాదన్నారు.
ప్రయివేటు బ్యాంకింగ్ వ్యవస్థలోకి పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు, పారిశ్రామిక సంస్థలను అనుమతించాలని ఆర్బీఐ అంతర్గత కార్యాచరణ బృందం సిపార్సు చేయడాన్ని తప్పుబట్టారు. కమిటీ సిఫార్సును విమర్శిస్తూ రాజన్, ఆచార్య ఓ ఆర్టికల్ పోస్ట్ చేశారు. భారత కార్పోరేట్ కంపెనీలను బ్యాంకింగ్లోకి అనుమతివ్వడంపై ప్రధాన ప్రశ్న తలెత్తుతోందని, ఆర్థిక రంగం బలహీనంగా ఉన్న ఈ సమయంలో సరికాదన్నారు.
నిధులు ఈజీగా మంజూరు చేసుకుంటారు
చెల్లింపుల బ్యాంకులను పూర్తిస్థాయి బ్యాంకులుగా మారేందుకు అయిదేళ్లుగా ఉన్న గడువును మూడేళ్లకు ఎందుకు తగ్గించాలని భావిస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. కార్పోరేట్లకు, పరిశ్రమలకు రుణాల అవసరం ఉంటుందని, బ్యాంకులు వారి చేతిలోనే ఉంటే నిధులు ఈజీగా మంజూరు చేసుకుంటారని, ఇక బ్యాంకులను నిర్వహించే వ్యాపార సంస్థలపై ఆర్థిక, రాజకీయ నాయకుల దృష్టి పడకుండా ఉంటుందా అని ప్రశ్నించారు. బ్యాంకు లైసెన్సులను పక్షపాతం లేకుండా ఇచ్చినప్పటికీ భారీ కంపెనీలకు అది ప్రయోజనకరంగా మారుతుందని, అప్పులు లేని కార్పోరేట్ సంస్థలు లైసెన్స్ దక్కించుకునే అవకాశం ఉంటుందన్నారు.
వాటికి ఓకే
ఆర్బీఐ కమిటీ సిఫార్సు చేసిన ఇతర ప్రతిపాదనలను అమలు చేయవచ్చునని రాజన్, ఆచార్య తెలిపారు. ఆర్బీఐ అధికారాలను బలోపేతం చేసేలా బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్టు 1949లో సవరణలు చేయాలని, భారత్లో బలమైన నియంత్రణ అధికారాలు ఉంటే నిరర్థక ఆస్తుల సమస్య ఉండదన్నారు. భారత బ్యాంకులు విఫలం కావడం అరుదుగా జరుగుతుందని, యస్ బ్యాంకు, లక్ష్మీ విలాస్ బ్యాంకులను బయటపడేయడం ఇందుకు ఉదాహరణ అన్నారు.