అంతలోనే.. భారత రెండో కుబేరుడిగా డి-మార్ట్ ధమానీ: ఆ కంపెనీలను వెనక్కి నెట్టి..
అవెన్యూ సూపర్ మార్ట్స్ (డిమార్ట్) వ్యవస్థాపకులు రాధాకిషన్ ధమానీ ఇప్పుడు భారత రెండో కుబేరుడు. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ (57.4 బిలియన్ డాలర్లు) తర్వాత 17.8 బిలియన్ డాలర్లతో ధమానీ రెండో స్థానంలో ఉన్నట్లు ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ ఇండెక్స్ వెల్లడించింది. ధమానీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు గోపికిషన్ ధమానీ, శ్రీకాంత దేవి ఆర్ ధమానీ, కిరణ్ దేవి జీ ధమానీలు కూడా అవెన్యూ సూపర్ మార్ట్స్ ప్రమోటర్లుగా ఉన్నారు. ఫిబ్రవరి 13న షేర్లు రూ.2,559కి చేరుకోవడంతో వారి ఆస్తులు 96 మిలియన్ డాలర్లు పెరిగాయి.
దిగ్గజ కంపెనీలను, అదానీ, మిట్టల్ను వెనక్కి నెట్టి.. టాప్ 10 కుబేరుల్లో డీమార్ట్ అధినేత
గత వారంలో రెండో స్థానానికి ఎగబాకిన ధమానీ
రాధాకిషన్ ధమానీ గతం వారంలోనే ఆరో స్థానానికి, ఐదో స్థానానికి, ఆ తర్వాత రెండో స్థానానికి ఎగబాకారు. ఫిబ్రవరి 5న కంపెనీ సంస్థాగత ఇన్వెస్టర్ల కోసం షేర్లు విక్రయించింది. దీంతో గతవారమంతా షేర్లు జోరుమీద క్లోజ్ అయ్యాయి.
ధమానీ 17.8 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో ఉండగా, ఆ తర్వాత శివనాడర్ (16.5 బిలియన్ డాలర్లు), ఉదయ్ కొటక్ (14.9 బిలియన్ డాలర్లు), గౌతమ్ అదానీ (14.1 బిలియన్ డాలర్లు), లక్ష్మీ మిట్టల్ (12.1 బిలియన్ డాలర్లు) ఉన్నారు.
5 శాతం నష్టపోయిన షేర్లు
అవెన్యూ సూపర్ మార్ట్స్ ఆఫర్ ఫర్ సేల్ (OFS) శుక్రవారం ఓపెన్ అయింది. 4,53,20,852 షేర్లకు సబ్స్క్రిప్షన్స్ వచ్చాయి. OFS కింద ప్రమోటర్లు 2.28 శాతం స్టేక్ను విక్రయించేందుకు సిద్ధం కావడంతో శుక్రవారం చివరలో షేర్లు 5 శాతం నష్టపోయాయి.
ప్రస్తుత మార్కెట్ వ్యాల్యూ కంటే తక్కువకు
ప్రస్తుత మార్కెట్ వ్యాల్యూ కంటే 19.4 శాతం తక్కువకు అంటే రూ.2,049కి షేర్లు విక్రయిస్తున్నారు. రాధాకిషన్ ధమానీ సహా మిగతా కుటుంబ సభ్యులు రూ.3వేల కోట్ల నుండి రూ.4వేల కోట్లు సమీకరించేందుకు వీటిని విక్రయిస్తున్నారు.
వాటి కంటే ఎక్కువ..
ఈ ఏడాదిలో అవెన్యూ సూపర్ మార్ట్స్ (డీమార్ట్) షేర్లు ఏకంగా 31 శాతం పెరిగి రూ.36,000 కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ జత కలిసింది. విప్రో, ఓఎన్జీసీ, అల్ట్రా టెక్ సిమెంట్, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సురెన్స్ కంటే ఎక్కువ మార్కెట్ క్యాపిటలైజేషన్ను కలిగి ఉంది.