ఐటీ రంగానికి ఊహించని దెబ్బ: ఈసారి నష్టపోయినా... కంపెనీల ఆశ అదే
కరోనా మహమ్మారి కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం(2020-21)లో మొదటి త్రైమాసికంలో ఐటీ కంపెనీలపై భారీ ప్రభావం పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జూన్ త్రైమాసికంలో అమెరికా, యూరోప్ వ్యాపారాల్లో గణనీయంగా తగ్గుదల నమోదు కావొచ్చునని చెబుతున్నారు. కరోనా కారణంగా ఆయా దేశాల్లో షట్ డౌన్ కారణంగా ఈ ప్రభావం పడుతుందని చెబుతున్నారు. ఆటోమొబైల్, రియల్ ఎస్టేట్, మ్యానుఫ్యాక్చరింగ్ వంటి వాటిపై ప్రభావం పడిన విషయం తెలిసిందే.
భారీ షాక్: కాగ్నిజెంట్లో 18,000 ఉద్యోగాల కోత? లీగల్ యాక్షన్ దిశగా..
5 శాతం నుండి 10 శాతం మేర నష్టం
కరోనా-షట్ డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థలు మూతబడటం, వ్యాపారాలు లేకపోవడం వంటి వివిధ కారణాలతో ఐటీ సంస్థల ఆదాయం 5 శాతం నుండి 10 శాతం మేర పడిపోవచ్చునని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. నెలల పాటు లాక్ డౌన్ కారణంగా ట్రావెల్ అండ్ ట్రాన్సుపోర్ట్, ఆయిల్ అండ్ గ్యాస్, రిటైల్ రంగాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయని, ఆ కంపెనీలకు వ్యాపారం లేకపోవడంతో ఎక్కువ మేరకు దివాళా తీశాయని చెబుతున్నారు.
రద్దు చేసుకోవడం లేదా నిలిపివేయడం
సప్లై, డిమాండ్ లేకపోవడంతో ఈ త్రైమాసికం తుడిచిపెట్టుకుపోయిందని ఐటీ సెక్టార్ నిపుణులు అనికేత్ పాండే అన్నారు. రిటైల్, ట్రావెల్, హాస్పిటాలిటీ, ట్రాన్సుపోర్ట్, ఆయిల్ అండ్ గ్యాస్ రంగాలపై భారీ ప్రభావం పడిందని, ఈ ప్రభావం ఐటీ సెక్టార్ పైన ఉంటుందని చెబుతున్నారు. ఎందుకంటే ఈ రంగాల్లోని క్లయింట్స్ రద్దు చేసుకోవడం లేదా తాత్కాలికంగా నిలిపివేయడం వల్ల ఐటీ కంపెనీలకు ఆ మేరకు నష్టం వాటిల్లుతుందని చెబుతున్నారు.
ఏ కంపెనీకి ఎంత క్షీణిస్తుంది
భారతదేశ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్ జూలై 9వ తేదీన తన మొదటి క్వార్టర్ ఫలితాలను ప్రకటించనుంది. విప్రో జూలై 14న ప్కటించనుంది. టీసీఎస్ ఆదాయంలో 6 శాతం, ఇన్ఫోసిస్ రెవెన్యూలో 5 శాతం, హెచ్సీఎల్ టెక్నాలజీస్కు 8 శాతం, టెక్ మహీంద్రా ఆదాయం 9 శాతం, విప్రోకు 7.5 శాతం మేర క్షీణిస్తుందని బ్రోకరేజీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. కరోనా కారణంగా ఇప్పటికే ఐటీ కంపెనీలు వ్యయ నియంత్రణ చర్యలు చేపట్టాయని, అయినప్పటికీ ఈ క్వార్టర్లో మార్జిన్లపై ప్రభావం ఉంటుందని బ్రోకరేజీ సెంట్రమ్ ఐటీ అనలిస్ట్ మధుబాబు చెప్పారు.
కొన్ని వ్యాపారాలు త్వరగా కోలుకుంటాయి
కరోనా ప్రభావంతో దెబ్బతిన్న కొన్ని రంగాలు లేదా కొన్ని వ్యాపారాలు వేగంగా పుంజుకునే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (BFSI), హెల్త్ కేర్, రిటైల్ వంటివి ఇందులో ఉంటాయని అభిప్రాయపడుతున్నారు. కరోనా తర్వాత టెక్నాలజీ రంగం మరింత పుంజుకుంటుందని చెబుతున్నారు. క్లౌడ్ సేవలు, డేటా సర్వీస్, న్యూ డిజిటల్ బ్యాంక్ కేపబులిటీస్ ఇందులో ఉంటాయని చెబుతున్నారు.
ఐటీకి సానుకూల ధోరణి
గత వారం యాక్సెంచర్ రెవెన్యూ నెంబర్స్ సానుకూలంగా ఉన్నాయి. ఇది ఇండియన్ ఐటీకి సానుకూల ధోరణిని వెల్లడిస్తోందని అంటున్నారు. టెక్నాలజీపై క్లయింట్స్ మరింతగా ఖర్చు చేస్తున్నారంటున్నారు. డిజిటల్ టెక్నాలజీకి అనుగుణంగా వేగంగా మార్పు కనిపిస్తోందని టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీ అన్నారు. కరోనా కారణంగా స్వల్పకాలిక ప్రభావం ఉన్నప్పటికీ, మీడియం, లాంగ్ టర్మ్లో వద్ధి చెందుతుందనే విశ్వాసం ఏర్పడిందని ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ అన్నారు.