వేతనంలో కోత, ఉద్యోగాల తొలగింపు: టెక్ మహీంద్రాకు నోటీసులు, అసలేం జరిగింది?
ఐటీ సర్వీసెస్ కంపెనీ టెక్ మహీంద్రాకు పుణే లేబర్ కమిషనర్ కార్యాలయం నోటీసులు పంపించింది. కరోనా మహమ్మారి-లాక్ డౌన్ నేపథ్యంలో లాభదాయకతను కొనసాగించేందుకు ఈ టెక్ సంస్థ ఉద్యోగుల వేతనాలను కట్ చేస్తోందని ఐటీ ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్ ఫిర్యాదు చేసింది. దీంతో లేబర్ కమిషనర్ కార్యాలయం నోటీసులు జారీ చేసింది.
ఆ ప్యాకేజీ సరిపోదు, ఆ రెండే కరోనా సంక్షోభం నుండి కాస్త గట్టెక్కిస్తాయి: ఆర్బీఐ మాజీ గవర్నర్
ఉద్యోగులకు కోత
ఐటీ ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్ నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) ఈ మేరకు ఫిర్యాదు చేసింది. టెక్ మహీంద్రా ఉద్యోగుల నుండి తమకు ఫిర్యాదులు వచ్చాయని తెలిపింది. ఈ మేరకు కంపెనీకి చెందిన ఉద్యోగులు గత వారం వేతన కోతకు సంబంధించి మెయిల్స్ అందుకున్నారని, మే 1వ తేదీ నుండి షిఫ్ట్ అలవెన్స్లు రూ.5,000 నుండి రూ.10,000 మధ్య నిలిపివేయబడుతుందని ఈ మెయిల్స్ సారాంశమని పేర్కొంది.
13,000 మంది ఉద్యోగులపై ప్రభావం
కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దాదాపు 13,000 మంది ఉద్యోగులపై ప్రభావం పడుతుందని ఐటీ ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్ తెలిపింది. ఈ కంపెనీ మానవ హక్కుల ప్రాథమిక విధానాలను పాటించడంలో విఫలమైందని, అలాగే మహారాష్ట్ర ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించిందని NITES పేర్కొంది. లాక్ డౌన్ సమయంలో ఉద్యోగాలు తొలగించవద్దన్న కేంద్ర ప్రభుత్వం నిబంధనలు కూడా ఉల్లంఘించిందన్నారు. టెక్ మహీంద్ర పుణేపై కఠిన చర్యలు తీసుకోవాలని NITES డిమాండ్ చేసింది. గత నెలలో విప్రోపై ఇలాంటి ఫిర్యాదు చేసింది ఇదే సంస్థ.
వారికి షిఫ్ట్ అలవెన్స్ చెల్లిస్తున్నాం.. టెక్ మహీంద్రా
లాక్ డౌన్ సమయంలో రాష్ట్ర, కేంద్రప్రభుత్వాల రూల్స్ను ఉల్లంఘించవద్దని, ఉద్యోగులను తొలగించవద్దని, ఉద్యోగుల వేతనాల్లో కోత విధించవద్దని అసిస్టెంట్ లేబర్ కమిషనర్.. టెక్ మహీంద్రకు సూచించారు. మరోవైపు, టెక్ మహీంద్ర అధికార ప్రతినిధి మాట్లాడుతూ... కార్యాలయానికి వస్తున్నా లేదా క్లయింట్స్ వద్దకు వెళ్తున్న వారికి షిఫ్ట్ అలవెన్స్ చెల్లిస్తున్నామని తెలిపారు. టెక్ మహీంద్రా ఇండియా ఐదో అతిపెద్ద ఐటీ సర్వీస్ సంస్థ. ఈ సంస్థలో పని చేస్తోన్న మొత్తం 1,25,000 మంది ఉద్యోగుల్లో పది శాతం కంటే ఎక్కువ పుణే హెడ్ క్వార్టర్లో పని చేస్తున్నారు.
ఎన్నో ఫిర్యాదులు వస్తున్నాయి
NITES ఫౌండర్ రఘునాథ్ కుచిక్ మాట్లాడుతూ.. చాలామంది ఐటీ ఉద్యోగుల నుండి తమకు ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పారు. కరోనా - లాక్ డౌన్ నేపత్యంలో శాలరీ కట్ లేదా ఉద్యోగాల కోత గురించి ఈ కంప్లయింట్స్ వస్తున్నాయని చెప్పారు. ఇది చట్ట విరుద్ధమన్నారు. తమ ఫిర్యాదు నేపథ్యంలో కంపెనీని అధికారులు వివరణ కోరినట్లు చెప్పారు. అంతకుముందు 300 మంది ఉద్యోగులను బెంచ్కి పరిమితం చేయడం లేదా వేతన కోత విధించినందుకు గాను విప్రోపై ఫిర్యాదు చేసింది. అయితే విప్రో ఈ ఆరోపణలను కొట్టి పారేసింది.
విప్రో ఏం చెప్పిందంటే
ప్రాజెక్టుల్లో పని చేస్తున్న వారికి, కొత్త అసైన్మెంట్స్ కోసం ఉన్నవారికి ఎలాంటి వేతన కోత లేదని విప్రో స్పష్టం చేసింది. అలాగే ఇలాంటి ఉద్యోగాల కోత లేదని తెలిపింది. ఉద్యోగుల కోసం విప్రో స్పష్టమైన విధానాలు రూపొందించుకుందని చెప్పింది. పుణేకు చెందిన ఓ టెక్ కంపెనీ 150 మంది ఉద్యోగులను తొలగిస్తామని చెప్పగా, ఈ కంపెనీపై కూడా ఫిర్యాదు అందిందట.