గుడ్న్యూస్: తక్కువ ఛార్జీతో కస్టమర్ల ఇంటివద్దకే బ్యాంకు సేవలు
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం ఇంటి వద్దకే బ్యాంకింగ్ సేవలను ప్రారంభించారు. ఇబ్బందిలేని, సౌకర్యవంత బ్యాంకింగ్ ద్వారా మరింత సులభతర చేసేందుకు ఈ వెసులుబాటును తీసుకు వచ్చారు. ప్రభుత్వరంగ బ్యాంకులలో వచ్చే నెల నుంచి స్వల్ప చార్జీలతో ఈ సేవలను కస్టమర్లు పొందవచ్చునని తెలిపారు. దేశవ్యాప్తంగా 100 కేంద్రాల్లో ఏజెంట్ల ద్వారా బ్యాంకులు ఈసేవల్ని అందిస్తాయి. 2018లో ఆర్థిక సేవల విభాగం ప్రవేశపెట్టిన ఈజ్ సంస్కరణలో భాగంగా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చారు. కస్టమర్లకు సులభంగా, సౌకర్యవంతంగా సేవల్ని అందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని ఆర్థిక సేవల కార్యదర్శి దేవాశీష్ పాండే అన్నారు.
15ఏళ్ల కనిష్టానికి హైరింగ్ సెంటిమెంట్, ఉద్యోగులను తీసుకునేది 3% కంపెనీలే!
ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకోవాలి
ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ... బ్యాంకులు తమ ప్రధాన వ్యాపారాలపై ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. జన్ ధన్ అకౌంట్, ఆధార్, మొబైల్ను వేగంగా అడాప్ట్ చేసుకోవడం ఇతర దేశాలకు ఓ పాఠం అన్నారు. బ్యాంకులు ఇంకా చేరుకోని ప్రాంతాలకు తప్పకుండా వెళ్లాలన్నారు. రుణదాతల ద్వారా అమలు చేయాల్సిన ప్రభుత్వ పథకాల గురించి ప్రతి బ్యాంకు ఉద్యోగి తెలుసుకోవాలన్నారు. ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకోవడంలో బ్యాంకులు ఉత్ప్రేరకంగా పని చేయనున్నాయన్నారు. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేందుకు వ్యాపార సంస్థలు సతమతమవుతున్నాయని, ఆ సమస్యల పరిష్కారానికి కీలక పాత్ర పోషిస్తామనే భరోసాను బ్యాంకులు కల్పించాలన్నారు.
వచ్చే నెల నుండి ఆర్థిక సేవలు
ఇక, డోర్ స్టెప్ బ్యాంకింగ్ సేవలు ఎంపిక చేయబడిన 100 కేంద్రాల్లో ఏజెంట్లను నియమించడం ద్వారా ఇంటికే సేవలు అందిస్తారు. ఈ కేంద్రాల్లో ఏజెంట్లు ఇంటింటికి వెళ్లి బ్యాంకింగ్ సేవలు అందిస్తారని ఆర్థిక శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. నామమాత్రపు ఛార్జీలతో ఈ సేవల్ని ఉపయోగించుకోవచ్చు. ఈ సేవలు వినియోగదారులందరికీ, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు ప్రయోజనం. ఈ సేవలను సులభంగా పొందవచ్చు. ఇప్పటికే చెక్కులు, డిమాండ్ డ్రాఫ్ట్ సేకరణ, కొత్త చెక్ బుక్స్ దరఖాస్తులు, 15G/15H ఫామ్స్, అకౌంట్ స్టేట్మెంట్ విజ్ఞప్తులు వంటి వాటిని ఇంటి వద్దకే బ్యాంకులు అందిస్తున్నాయి. వచ్చే నెల నుండి ఆర్థిక సేవలను కూడా ప్రారంభిస్తాయని నిర్మల సీతారామన్ తెలిపారు.
అలా కనీస ఛార్జీ చెల్లించి...
కాల్ సెంటర్, వెబ్ పోర్టల్ లేదా మొబైల్ యాప్ సహాయంతో కనీస ఛార్జీ చెల్లించడం ద్వారా ప్రభుత్వరంగ బ్యాంకుల సేవలను ఇంటి వద్దనే పొందవచ్చు. లాక్ డౌన్ అనంతరం వ్యాపార కార్యకలాపాల పునరుద్ధరణ విషయంలో అంతకుమించి అద్భుతమైన సేవలు అందించాలని నిర్మలా సీతారామన్ అన్నారు.