త్వరపడండి! జనవరి నుండి పెరగనున్న టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల ధరలు
టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్ సహా వివిధ రకాల వస్తువులు కొనుగోలు చేయాలనుకుంటున్నారా? అయితే త్వరపడాల్సిందే! ఎందుకంటే జనవరి నుండి ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ముడి సరుకుల ధరలు పెరగడంతో కంపెనీలు జనవరి నుండి ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెంచుతున్నాయి. కొత్త సంవత్సరంలో గృహ వినియోగదారులకు ఇది షాక్ అని చెప్పవచ్చు. ఎల్ఈడీ టీవీలు, ఫ్రిజ్లు, వాషింగ్ మెషీన్లు, టీవీలు, మైక్రోవేవ్ ఓవెన్ల వంటి గృహోపకరణాల ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అందుకే ధరలు పెరుగుతున్నాయి
ఈ ఉత్పత్తుల తయారీలో రాగి, అల్యూమినియం, స్టీల్ వంటి లోహాల ధరలతో పాటు సముద్ర, విమాన రవాణా చార్జీలు పెరగడమే ధరల పెంపుకు కారణం అవుతోందని అంటున్నారు. అంతర్జాతీయ వెండార్లు డిమాండ్కు తగ్గట్టుగా సరఫరాలు చేయలేకపోవడం వల్ల టీవీ ప్యానెళ్ల ధరలు రెండింతలు అయ్యాయి. దీంతో పాటు క్రూడాయిల్ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో ప్లాస్టిక్ ధరలు పెరిగాయని చెబుతున్నారు. ముడిసరుకు ధరల ఒత్తిళ్ల నేపథ్యంలో గృహోపకరణాల ధరలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందని LG, పానాసోనిక్, థామ్సన్ కంపెనీలు చెబుతున్నాయి. పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు సోనీ తెలిపింది.
ఈసారి పెరుగుతున్నాయి
టీవీ ఓపెన్ సెల్ ధరలు 200 శాతం మేరకు పెరిగినట్టు థామ్సన్ బ్రాండ్ లైసెన్సీ.. సూపర్ ప్లాస్ట్రానిక్స్, కోడక్ పేర్కొన్నాయి. విమానాలలో దిగుమతి చార్జీలు ఈ ఏడాది అక్టోబర్ నెలతో పోల్చితే దాదాపు మూడు రెట్లు పెరిగిందని అంటున్నారు. గత పదేళ్లలో ఈ స్థాయిలో ధరలు పెంచలేదని అంటున్నారు. సహజంగా టీవీల ధరలు ఎప్పుడూ తగ్గుతాయని, ఈసారి మాత్రం పెరుగుతున్నాయన్నారు.
వేటి ధరలు ఎంత పెరగొచ్చు
ఏసీల ధరలు రూ.2000 నుండి రూ.5000కు పైన, రిఫ్రిజరేటర్లు రూ.1500 నుండి రూ.8000, వాషింగ్ మిషన్లు రూ.1200 నుండి రూ.3500 వరకు పెరగనున్నాయి. టీవీల ధరలు పది శాతం వరకు పెరగనున్నాయి. మైక్రోవేవ్ ఓవెన్ల ధరలు నాలుగు శాతం వరకు పెరిగే అవకాశముంది.