Rice Prices: శ్రీలంక చేసిన తప్పు రిపీట్ చేస్తున్న భారత్..! సామాన్యులకు షాకివ్వనున్న బియ్యం..
Rice Prices Hike: ఇప్పటికే అన్ని వస్తువుల రేట్లు ఆకాశానికి చేరుకోగా తాజాగా ఆ లిస్ట్ లో బియ్యం కూడా చేరిపోయింది. ఇప్పటికే దేశంలో అనేక చోట్ల కిలో బియ్యం ధర రూ.10 నుంచి రూ.15 మధ్య పెరిగింది. కేంద్రం 25 కిలోల కంటే తక్కువ బ్రాండెడ్ ప్యాకింగ్ వస్తువులపై జీఎస్టీ అమలు చేయటం కూడా ఇందుకు ఒక కారణంగా నిలుస్తోంది.
దిగుబడి తగ్గటంతో..
రానున్న కాలంలో బియ్యం ధర మరింత పెరిగే అవకాశం ఉంది. ఖరీఫ్ సీజన్లో దిగుబడి తగ్గుతుందని, దీనికి తోడు బాస్మతీయేతర బియ్యం ఎగుమతులు 11 శాతం పెరుగుతాయని అంచనాలు చెబుతున్నాయి. ఈ కారణంగా బియ్యం బంగారంలా మారనుంది. సమాన్యులకు వీటి రేట్లు భారాన్ని పెంచవచ్చని కేంద్ర ఆహార మంత్రత్వ శాఖ ఈ మేరకు సమాచారం ఇచ్చింది.
ఎగుమతి విధానంలో మార్పు..
భారతదేశం బియ్యం ఎగుమతి విధానంలో ఇటీవలి సంస్కరణల వెనుక గల కారణాలను మంత్రిత్వ శాఖ వెల్లడించింది. వీటి వల్ల ఎగుమతులపై ఎలాంటి మార్పులు లేకుండానే దేశంలో ధరలను ధరలను నియంత్రించటానికి సహాయపడతాయని అందులో వివరించారు. ఇప్పటికే నూకల ఎగుమతి నిషేధం, బాస్మతీయేతర బియ్యంపై 20 శాతం ఎగుమతి సుంకాన్ని విధించింది.
తగ్గిన వరి ఉత్పత్తి..
దేశంలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో వరి పంట విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. సుమారు 6 మిలియన్ టన్నుల వరి ఉత్పత్తి తగ్గడం, బాస్మతీయేతర బియ్యం ఎగుమతులు 11 శాతం పెరగడం వల్ల బియ్యం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం భారత్ ప్రపంచంలో రెండవ అతిపెద్ద బియ్యం ఉత్పత్తిదారుగా ఉంది. ప్రపంచ మార్కెట్లో భారత్ బియ్యం వాటా 40 శాతం. 2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత్ 21.2 మిలియన్ టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేసింది. అందులో 34.9 లక్షల టన్నుల బాస్మతి బియ్యం ఉంది.
ఆర్గానిక్ ఫార్మింగ్..
ప్రధానమంత్రి ప్రమోషన్ ఆఫ్ ఆల్టర్నేట్ న్యూట్రియెంట్స్ ఫర్ అగ్రికల్చర్ మేనేజ్మెంట్ యోజన పేరుతో కేంద్ర ప్రభుత్వ సేంద్రియ సాగు ప్రోత్సాహక పథకాన్ని తెచ్చింది. అయితే ఇది కేవలం 1.50 శాతం భూమికి పరిమితం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎరువుల సబ్సిడీ భారాన్ని తప్పించుకొనేందుకే కేంద్రం ఇలాంటి పనులు చేస్తుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. శ్రీలంక చేసిన తప్పే భారత్ చేస్తుందా అంటూ వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల ఆహార భద్రతకు ముప్పు తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.