కరోనా కాలం.. పాతదో కొత్తదో కోనేయ్ ఒక కారు! మారుతున్న వినియోగదారుల ధోరణి
ప్రపంచమంతా ఒకటే మాట. అదే కరోనా! చైనా లో మొదలైన ఈ మహమ్మారి... అన్ని దేశాలను చుట్టేసి కోట్ల కొద్దీ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రపంచానికి ఆర్థిక సంక్షోభాన్ని మోసుకొచ్చింది. అదే సమయంలో ప్రజల ఆహార అలవాట్లు సహా ఇతర జీవన శైలి పూర్తిగా మారిపోయేలా చేసింది. పని చేసే విధానం కూడా మారిపోయింది. ఎదుటి మనిషిని నమ్మలేని పరిస్థితి కల్పించింది. దీంతో ప్రజా రవాణా వ్యవస్థ రూపు రేఖలు కూడా పూర్తిగా మారిపోనున్నాయి. సిటీ ల్లో ఎన్ని రవాణా సదుపాయాలు ఉన్నా గానీ సరిపోవు. అందుకే ప్రభుత్వాలు వీలనంత వరకు మెరుగైన ప్రజా రవాణా సౌకర్యాలను కల్పించే ఏర్పాట్లు చేస్తాయి. అందుకే బస్సులు, లోకల్ ట్రైన్స్ కు తోడుగా.. మెట్రో రైళ్లు వచ్చాయి. షేరింగ్ క్యాబ్స్, ఆటోలు వంటి సదుపాయాలు ఉండనే ఉన్నాయి. కానీ, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల వల్ల జనాలు పరిచయం లేని వ్యక్తుల తో కలిసి ప్రయాణం చేసే అవకాశం కనిపించటం లేదు. అందుకే, ప్రజలు సొంత వాహనాలు ఏర్పాటు చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.
310 కోట్ల డాలర్ల అమెజాన్ షేర్లు విక్రయించిన జెఫ్ బెజోస్: 73% పెరిగినా ఎందుకు విక్రయించాడంటే?
కార్లకు పెరుగుతన్న డిమాండ్...
లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత క్రమంగా కొత్త కార్ల అమ్మకాలు పుంజుకున్నాయి. గత రెండేళ్లుగా ఇండియన్ ఆటోమొబైల్ రంగం విపరీతమైన మందగమనాన్ని చవిచూసింది. మారుతున్న ప్రభుత్వ విధానాలు, కఠినతరమవుతున్న కాలుష్య నిబంధనలు, భారమవుతున్న రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్సు వ్యయం, పట్ట పగ్గాలు లేకుండా పెరిగిపోతున్న పెట్రోలు, డీజిల్ ధరలతో చాలా మంది వినియోగదారులు సొంత కార్లు కొనే బదులు మెట్రో రైళ్లలో , బస్సుల్లో, షేర్డ్ ఆటోల్లో ప్రయాణించేందుకు మొగ్గు చూపారు. కానీ, కరోనా రాగానే పరిస్థితుల్లో పూర్తిగా మార్పు వచ్చింది. మాస్కులు, శానిటైజర్లతో పాటు సోషల్ డిస్టెన్స్ పాటించాలన్న నిబంధనతో ఇక షేర్డ్ ట్రావెల్ చేయలేమని అర్థమైంది. దీంతో సొంత వాహనాలు ఉత్తమం అని వినియోగదారులు భావిస్తున్నారు. ఇప్పటికే చాలా కాలం కొందామా లేదా అని వాయిదా వేసుకుంటూ వచ్చిన వారు కొత్త కార్లు కొనేస్తున్నారు. దీంతో జూన్ నెలతో పోల్చితే జులై లో కార్ల అమ్మకాలు 88% పెరగటం విశేషం.
పాతవి అయినా ఫరవాలేదు..
కొత్త కార్లు కొనాలంటే రూ లక్షల్లో ఖర్చవుతుంది. రుణాలు తీసుకుని కొనుగోలు చేసినా అధిక ఈఎంఐ ల భారం పడుతుంది. కాబట్టి, కాస్త తక్కువ లో వచ్చేలా పాత కార్లను కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. ఉన్నంతలో మనకో సొంత వాహనం ఉంటే చాలు. అందులోనే సిటీ లో అయినా... దూర ప్రయాణాలైనా చేయవచ్చు అన్న ధోరణితో వినియోగదారులు సెకండ్ హ్యాండ్ కార్ల ను కొంటున్నారు. రూ 50,000 నుంచి రూ 3,00,000 ధరలో లభించే పాత కార్లకు డిమాండ్ అధికంగా ఉంటోందని ఈ వ్యాపారంలో నిమగ్నమైన వ్యాపారులు వెల్లడిస్తున్నారు. ఇటీవల పాత కార్లకు కూడా బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు రుణాలు అందిస్తుండటంతో... వీటి కొనుగోలు మరింత సులువు అయిపోయింది. అందుకే ఇక ప్రయాణాలకు సొంత కార్లే బెటర్ అనే ఉద్దేశం వినియోగదారుల్లో కనిపిస్తోంది. ఈ ధోరణి మరింత కాలం కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నాయని చెబుతున్నారు.
గ్రామాల్లో కూడా...
ఒకప్పుడు సొంత వాహనాలు, ముఖ్యంగా కార్లు వంటి లగ్జరీ వస్తువులు కొనాలంటే గ్రామాల్లో ఉండే ప్రజలు కాస్త సంకోచించే వారు. ఎటూ బస్సులు, ఆటోలు వంటి ప్రయాణ సాధనాలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి, మనకు సొంతంగా ఎందుకు అనే ధోరణి కనిపిస్తుండేది. కానీ, ఇప్పుడు గ్రామాల్లో కూడా కొత్త కార్లు, పాటు కార్లకు డిమాండ్ పెరుగుతోంది. సహజంగానే గ్రామాల్లో వాతావరణం కాస్త మెరుగ్గా ఉంటుంది. పచ్చదనం తో పాటు ఇండ్లు కూడా దూరం దూరంగా ఉంటాయి. దీంతో అక్కడ వైరస్ వ్యాప్తి అంతగా లేదు. కానీ, గ్రామీణ ప్రజలు కూడా కరోనా వైరస్ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. మాస్కులు ధరిస్తున్నారు. శానిటైజ్ చేసుకుంటున్నారు. అలాగే సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్నారు. ఇప్పుడు సొంత కార్లు కొనుగోలు చేస్తూ ఇకపై సురక్షిత ప్రయాణాలకే ఓటేస్తున్నారు. ఇతరులతో ప్రయాణం వద్దు... మన కారే ముద్దు అంటూ ముందుకు వెళుతున్నారు.