పీఎన్ బీ స్కామ్..నీరవ్ మోడీని భారత్ కు అప్పగింత పిటీషన్ పై 5 రోజుల పాటు కొనసాగనున్న విచారణ
భారతదేశంలో ఆర్ధిక నేరాలకు పాల్పడి లండన్ లో తలదాచుకుంటున్న నేరగాడు నీరవ్ మోడీ కేసులో భారత్ కు అప్పగించే విషయంలో విచారణ మొదలైంది . పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం ప్రధాన నిందితుడు అయిన నీరవ్ మోడీ పై లండన్ కోర్టులో 5 రోజుల పాటు విచారణ కొనసాగనుంది. మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నీరవ్ మోడీని విచారణ కోసం యుకె కోర్టులో హాజరుపరచనున్న నేపధ్యంలో విచారణపై ఉత్కంఠ నెలకొంది.
భారత్ కు అప్పగింత పిటీషన్ పై 5 రోజుల పాటు విచారణ
ప్రస్తుతం నీరవ్ మోడీ సౌత్వెస్ట్ లండన్లోని వర్డ్స్వర్త్ జైల్లో ఉన్నారు. ఇక ఇవ్వాళ ఆయనను అధికారులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. మోడీని భారత్కు అప్పగించాలని దాఖలైన పిటిషన్పై 5 రోజుల పాటు విచారణ జరగనుంది. ఇప్పటికే నీరవ్ మోడీని ఇండియాకి అప్పగిస్తే ఆయనను ఏ జైల్లో ఉంచుతారో చెప్పాలంటూ న్యాయస్థానం భారత్ ను కోరిన విషయం తెలిసిందే . అయితే , భారత వర్గాలు నీరవ్ మోదీని ముంబయి ఆర్థర్ రోడ్ జైల్లో ఉంచడానికి సుముఖంగా ఉన్నట్టు వీడియో తో సహా పంపించారు.
కోర్టుకు హాజరవుతారా ? లేకా వీడియో లింక్ ద్వారా విచారణ సాగిస్తారా
ఇక పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేలకోట్ల రూపాయల మేర ఎగ్గొట్టి బ్యాంకును మోసం చేసి లండన్కు పారిపోయిన వజ్రాల వ్యాపారి మోడీని అప్పగించాలంటూ భారత్ దాఖలు చేసిన పిటిషన్పై లండన్లోని వెస్ట్మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు నేడు విచారణ చేస్తుంది . ఇక కరోనా వైరస్ వాప్తి, లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో వీడియో లింక్ ద్వారా ఆయనను విచారించే విషయాన్ని కూడా డిస్ట్రిక్ జడ్జి శామ్యూల్ గూజీ పరిశీలిస్తున్నారని సమాచారం . ''కొన్ని జైళ్లు నిందితులను వ్యక్తిగతంగా ప్రవేశపెడుతున్నందున ఈ నెల 11న నీరవ్ మోదీని కోర్టు ముందుకు తీసుకురావాలని ఆదేశిస్తాం. ఒకవేళ ఇది సాధ్యం కాని పక్షంలో లైవ్ వీడియో లింక్ ద్వారా విచారిస్తాం..'' అని న్యాయమూర్తి గూజీ పేర్కొన్నారు.
భారత్ పంజాబ్ నేషనల్ బ్యాంకును వేల కోట్లకు మోసం చేసిన నీరవ్ మోదీ
నీరవ్ మోడీని అప్పగించాలంటూ గతేడాది భారత్ దాఖలు చేసిన పిటిషన్పై చాలా కాలం తర్వాత ఇప్పుడు నేటి నుండి ఐదు రోజుల పాటు లండన్ కోర్టు విచారణ జరపనుంది. ఇండియాలో పంజాబ్ నేషన్ బ్యాంకుకు కుచ్చు టోపీ పెట్టి పారిపోయిన నీరవ్ మోడీని ఒక సంవత్సర కాలం పాటు అతని కోసం అనేక దేశాల్లో గాలింపు చేపట్టిన తర్వాత ఒక కొత్త బ్యాంకు ఖాతాను తెరవటానికి ప్రయత్నించిన క్రమంలో పట్టుకున్నారు.
లండన్లోని వాండ్స్వర్త్ జైలులో నీరవ్ మోడీ
మెట్రో స్టేషన్ హోల్బోర్న్, సెంట్రల్ లండన్ లో ఆయనను అరెస్ట్ చేయబడ్డాడు . అప్పటి నుండి మూడు సార్లు బెయిల్ కోసం ప్రయత్నించి నీరవ్ మోడీ విఫలమయ్యాడు . గత ఏడాది మార్చి 19న అరెస్టు అయినప్పటి నుండి నైరుతి లండన్లోని వాండ్స్వర్త్ జైలులో ఉన్నారు నీరవ్ మోడీ . పీఎన్బీని రూ.13,600 కోట్ల మేర మోసగించిన కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ విచారణ జరుపుతున్నాయి. ఇండియాకి అప్పగించాలని యూకే ను కోరుతున్నారు.