PNBకి రూ.1,200 కోట్ల మోసం చేసిన సింటెక్స్ ఇండస్ట్రీస్
పంజాబ్ నేషనల్ బ్యాంకుకు(PNB) గతంలో నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీలు రూ.వేల కోట్లు ఎగ్గొట్టారు. తాజాగా PNBలో మరో ఫ్రాడ్ లోన్ వెలుగు చూసింది. సింటెక్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (SIL) తీసుకున్న రూ.1,203.26 కోట్ల రుణాలను ఫ్రాడ్గా ప్రకటించింది పంజాబ్ నేషనల్ బ్యాంకు. ఈ మేరకు బుధవారం వెల్లడించింది.
హౌసింగ్ ధరలు మరింత తగ్గుతాయా? హైదరాబాద్లో పెరిగిన సేల్స్: మరో 12 నెలలు కొనవచ్చు
సింటెక్స్ ఇండస్ట్రీస్ మోసపూరితంగా రూ.1,203 కోట్ల రుణాన్ని పొందిందని బ్యాంకు ప్రకటించింది. సెబి నమోదిత నిబంధనలు, వెల్లడి అంశాలు, బ్యాంకు విధానాల ప్రకారం సింటెక్స్ ఇండస్ట్రీస్ నికర నిర్థక ఆస్తుల్లో రూ.1203 కోట్ల మేర మోసంతో తీసుకున్న రుణాలు ఉన్నాయని ఎక్స్చేంజీలకు ఇచ్చిన సమాచారంలో బ్యాంకు తెలిపింది. అహ్మదాబాద్ జోనల్ కార్యాలయంలోని కార్పోరేట్ శాఖలో ఈ మోసం జరిగినట్లు తెలిపింది.
ఒక ఖాతాను మోసపూరితంగా ప్రకటిస్తే బ్యాంకింగ్ రెగ్యులేటర్ నిబంధనల ప్రకారం బ్యాంకులు 100 శాతం బకాయి రుణాలను ఒకేసారి లేదా 4 త్రైమాసికాల్లో కేటాయించాలి. రూ.1,203 కోట్ల మోసం గురించి ఆర్బీఐకి అకౌంట్స్ ఆఫ్ ది కంపెనీలో వివరించిందని, నిబంధనల ప్రకారం బ్యాంకు ఇప్పటికే రూ.215.21 కోట్లను కేటాయించిందని తెలిపింది.
సింటెక్స్ ఇండస్ట్రీస్కు రుణాలు ఇచ్చిన ఇతర బ్యాంకుల్లో బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకు, పంజాబ్ అండ్ సింద్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నాయి. సింటెక్స్ మొత్తం రుణాలు మార్చి 31, 2020 నాటికి రూ.7,157.9 కోట్లుగా ఉన్నాయి. సింటెక్స్ ఇండస్ట్రీస్.. సింటెక్స్ గ్రూప్ కంపెనీ.