జన్ ధన్ ఖాతాల్లో 55 శాతం మహిళలవే..
ప్రధానమంత్రి జన్ ధన్ యోజనలో భాగంగా తెరిచిన బ్యాంకు ఖాతాల్లో 55 శాతం మహిళా లబ్ధిదారులే ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. సెప్టెంబర్ 9, 2020 నాటికి దేశవ్యాప్తంగా జన్ ధన్ యోజన కింద 40.63 కోట్ల బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. వీటిలో 22.44 కోట్ల ఖాతాలు మహిళలవి కాగా, 1819 కోట్ల ఖాతాలు పురుషులవి. సమాచార హక్కు చట్టం కింద మధ్యప్రదేశ్కు చెందిన సామాజిక కార్యకర్త వివరాలు కోరగా ఈ విషయం వెల్లడైంది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ నెలలో ఈ డిపాజిట్ల మొత్తం 8.5 శాతం పెరిగినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. జన్ ధన్ యోజన కింద ఏప్రిల్ 1, 2020 నాటికి రూ.1.19 వేల కోట్లునగదు ఉండగా, ప్రస్తుతం అవి 1.30 వేల కోట్లకు చేరుకున్నాయి. మొత్తం ఖాతాల్లో దాదాపు 3కోట్ల అకౌంట్లలో నగదు లేకుండా జీరో బ్యాలెన్స్ ఉన్నట్లు పేర్కొంది.
మొత్తం ఖాతాలలో జాతీయ బ్యాంకుల్లోనే 32.48 కోట్ల జన్ ధన్ అకౌంట్లు ఉన్నాయి. వీటిలో మొత్తం లక్ష కోట్ల రూపాయల నగదు ఉంది. రీజినల్ రూరల్ బ్యాంకుల్లో 7.24 కోట్ల ఖాతాలు ఉండగా, రూ.25వేల కోట్ల నగదు నిల్వలు ఉన్నాయి. ప్రయివేటు బ్యాంకుల్లో 1.27 కోట్ల ఖాతాలు ఉండగా, ఇందులో రూ.4వేల కోట్ల నగదు ఉంది.