PMC బ్యాంకు ఫ్రాడ్: డిపాజిటర్ల కోసం రంగంలోకి ఆర్బీఐ గవర్నర్
PMC బ్యాంకు అవకతవకల నేపథ్యంలో ఆ బ్యాంకు డిపాజిటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ డబ్బులు తమ చేతుల్లోకి రావడంపై వారు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) గవర్నర్ శక్తికాంత దాస్ సోమవారం సంబంధిత ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. బ్యాంకు ఆస్తులు వేలం వేసి డిపాజిటర్లకు చెల్లించే అంశంపై చర్చించినట్లుగా తెలుస్తోంది. బ్యాంకులోని ఉన్నతాధికారులు చేసిన తప్పులకు డిపాజిటర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆర్బీఐ గవర్నర్ జోక్యం చేసుకొని, డిపాజిటర్లకు సాయం చేసే దిశగా చర్చిస్తున్నారు.
ఈ భేటీ యొక్క ప్రాథమిక అజెండా.. అటాచ్ చేసిన ఆస్తుల వేలం, డిపాజిటర్లకు తిరిగి చెల్లించేందుకు అవసరమైన చట్టపరమైన చర్యలపై చర్చించారు. అలాగే సంక్షోభంలో కూరుకుపోయిన పంజాబ్ అండ్ మహారాష్ట్ర కో ఆపరేటివ్ బ్యాంకు (PMC) పునర్నిర్మాణానికి నిధుల అంశంపై కూడా చర్చించారని తెలుస్తోంది.
PMC దెబ్బ: బ్యాంకులు హఠాత్తుగా చేతులెత్తేస్తే.. ముందుగా ఇవి తెలుసుకోండి!
ఆర్బీఐ గవర్నర్, ముంబై పోలీస్ కమిషనర్ సంజయ్ బార్వే, ఎకనమిక్ ఆఫెన్స్ వింగ్ (EOW) జాయింట్ కమిషనర్ రాజవర్ధన్ సిన్హా, EOW డీసీపీ శ్రీకాంత్ పరోపకారీ, ఈడీ డైరెక్టర్ సంజయ్ మిశ్రా, ఈడీ స్పెషల్ డైరెక్టర్ జాయింట్ డైరెక్టర్ సత్యబ్రాత కుమార్, పీఎంసీ బ్యాంక్ అడ్మినిస్ట్రేటర్ తదితరులు ఈ భేటీలో ఉన్నారని తెలుస్తోంది.
కీలక సమావేశం జరిగిందని, బ్యాంకు రికవరీకి మార్గం సుగమం చేసేందుకు, ఖాతాదారుల సమస్యలు పరిష్కరించేందుకు భేటీ అయ్యామని మాజీ ఎంపి కీరీట్ సోమయ్యా ఇండియా టుడేతో చెప్పారు. పీఎంసీ బ్యాంకు ఖాతాదారులకు సహాయం కోరేందుకు తాను గవర్నర్ను కూడా కలిసినట్లు చెప్పారు. సహకరిస్తానని గవర్నర్ చెప్పారు.
కాగా, పీఎంసీ బ్యాంక్ కేసులో ఈడీ, EOWలు రూ.4,000 కోట్ల ఆస్తులను అటాచ్ చేశాయి. మరికొన్ని ఆస్తుల అటాచ్మెంట్ కొనసాగుతోంది. కాగా, అటాచ్ చేసిన ఆస్తులను వేలం వేయడానికి అభ్యంతరం లేదని EOW కోర్టుకు తెలిపింది. ఆస్తుల వేలం కోసం ఓ ఏజెన్సీని సంప్రదించి, ఆదాయం వచ్చేలా చేస్తారు. దీంతో డిపాజిటర్ల సమస్యలు తగ్గించవచ్చునని భావిస్తున్నారు.