రాజమాత విజయరాజే పేరుతో రూ.100 నాణెం విడుదల
రాజమాత విజయరాజే సింధియా శతజయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ రూ.100 నాణేన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. స్వాతంత్ర్య ఉద్యమకాలం నాటి నుండి మన దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారన్నారు. ట్రిపుల్ తలాక్కు వ్యతిరేక చట్టాన్ని రూపొందించి, మహిళా సాధికారతపై రాజమాత ఆలోచనలను తాము ముందుకు తీసుకు వెళ్లామని చెప్పారు. ఏక్తా యాత్ర సందర్భంగా దేశానికి యువనేతగా తనను పరిచయం చేశారని గుర్తు చేసుకున్నారు.
సామాన్యురాలిగా, గ్రామాల్లో పేదవారితో రాజమాత తన జీవితాన్ని గడిపారని మోడీ చెప్పారు. వారి కోసమే ఆమె జీవితాన్ని అంకితం చేశారన్నారు. ప్రజాప్రతినిధులకు అధికారం కంటే ప్రజాసేవ ముఖ్యం అనే విషయాన్ని రాజమాత విజయరాజే సింధియా నిరూపించారని కొనియాడారు. స్వాతంత్ర ఉద్యమ సమయంలో విదేశీ వస్తువుల బహిష్కరణ మొదలు రామమందిరం వరకు ఆమె ఎన్నో అంశాల్లో పాలుపంచుకున్నారన్నారు. రామజన్మభూమి కోసం ఆమె చాలా కష్టపడ్డారని, ఆమె శతజయంతి సమయంలో ఆ కలను సాకారం చేశామని, ఇందుకు సంతోషంగా ఉందన్నారు.
రాష్ట్రాలకు నిర్మల గుడ్న్యూస్, రూ.12,000 కోట్ల వడ్డీలేని రుణం
విజయరాజే సింధియా రాజవంశానికి చెందినవారని, కానీ చాలాకాలం జైళ్లో కూడా గడిపారని గుర్తు చేశారు మోడీ. ఎమర్జెన్సీ కాలంలో ఆమె తన కూతుళ్లకు జైలు నుండి లేఖ రాశారన్నారు. తాము ప్రస్తుతం చేస్తున్న పోరాటం, త్యాగాలు భవిష్యత్తు తరాలకు ప్రేరణగా నిలవాలని ఆమె తన లేఖల్లో పేర్కొన్నారన్నారు. భవిష్యత్తు తరాల కోసం ఆమె రాజమార్గం వదిలేసి, కష్టపడ్డారన్నారు. దేశంలో స్త్రీ సాధికారత కోసం రాజమాత సింధియా కన్న కలలను ట్రిపుల్ తలాక్ రద్దు ద్వారా కొంత నెరవేర్చగలిగామన్నారు.