రూ.10, రూ. 20 సహా: కొత్త కాయిన్లను విడుదల చేసిన మోడీ: అన్ని డినామినేషన్లు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఐకనిక్ వారోత్సవాలను ప్రారంభించారు. కేంద్ర ఆర్థికం, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖలకు చెందిన వారోత్సవాలు ఇవి. కొద్దిసేపటి కిందట దేశ రాజధానిలోని విజ్ఞాన్ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమం సందర్భంగా ప్రధాని మోడీ.. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్తో కలిసి ఈ వారోత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు.
దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలయిన సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఏడాది పాటు నిర్వహిస్తోన్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో దీన్ని ఏర్పాటు చేశారు. వర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా 75 ప్రాంతాల్లో ఇదే ఈ కార్యక్రమాన్ని మోడీ ఆరంభించారు. దీనితోపాటు- జన్ సమర్థ్ వెబ్సైట్ను ఆవిష్కరించారు. వన్-స్టాప్ డిజిటల్ పోర్టల్ ఇది.
12 శాఖలు అమలు చేస్తోన్న సంక్షేమ పథకాల వివరాలు, క్రెడిట్ లింక్స్ను ఇందులో పొందుపరిచారు. ఆయా పథకాలను ఈ పోర్టల్ ద్వారా ఒకే వేదిక మీదికి తీసుకొచ్చారు. సమ్మిళిత అభివృద్ధి, ఆర్థిక సంవత్సరాల వారీగా అన్ని రంగాలు సాధించిన పురోగతిని ఇందులో పొందుపరిచారు. వాటికి సంబంధించిన సమాచారాన్ని మరింత వివరంగా ప్రజలకు చేరవేసేలా ఈ పోర్టల్ అందుబాటులో ఉంటుంది.
అనంతరం కొత్త రూపాయి నాణేలను విడుదల చేశారు. 1, 2, 5, 10, 20 సిరీస్కు చెందిన రూపాయి నాణేలను ఆయన చలమణిలోకి తీసుకొచ్చారు. ఈ నాణేలపై ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లోగోను ముద్రించారు. అంధులు కూడా సులభంగా గుర్తించాల వాటిపై అంకెలను ప్రింట్ చేశారు.
వీటిని ఆవిష్కరించిన అనంతరం ప్రధాని మాట్లాడారు. దేశానికి స్వాతంత్ర్య్రం సిద్ధించి 100 సంవత్సరాల మైలురాయిని అందుకునే ఈ పాతికేళ్ల సమయాన్ని అమృత కాలంగా ప్రకటించామని, ఈ విషయాన్ని దేశ పౌరులకు ప్రతిక్షణం గుర్తు చేసేలా ఈ నాణేలను అందుబాటులోకి తీసుకొచ్చామని వ్యాఖ్యానించారు. ఎనిమిది సంవత్సరాల తమ ప్రభుత్వ హయాంలో ఆర్థికం, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సాధించిన ప్రగతిని తెలియజేసేలా రూపొందించిన డిజిటల్ ఎగ్జిబిషన్ను కూడా మోడీ ప్రారంభించారు.