Prices Drop: ఊరట.. తగ్గిన 11 నిత్యావసరాల రేట్లు.. పీయూష్ గోయల్ ట్వీట్ పై సామాన్యుల మాట..?
Prices Drop: నిత్యావసర వస్తువుల ధరలు తగ్గుముఖం పట్టాయని, దీంతో నెలవారీ వంటగది బడ్జెట్ ఉపశమనం లభించిందని ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రి పీయూష్ గోయల్ ట్వీట్ చేశారు. 11 వస్తువుల ధరల తగ్గుదల వివరాలతో కూడిన చార్ట్ను పంచుకున్నారు.
|
నూనెల ధరలు..
2022 సెప్టెంబర్ 2న లీటరుకు రూ.132గా ఉన్న పామాయిల్ ధర అక్టోబర్ 2 నాటికి 11 శాతం తగ్గి రూ.118కి చేరింది. వనస్పతి కిలో రూ.152 నుంచి 6 శాతం తగ్గి రూ.143కి చేరింది. సన్ఫ్లవర్ ఆయిల్ ధర లీటర్కు రూ.176 నుంచి 6 శాతం తగ్గి రూ.165కి చేరగా, సోయాబీన్ ఆయిల్ లీటరుకు రూ.156 నుంచి 5 శాతం తగ్గి రూ.148కి చేరుకుంది. ఇదే క్రమంలో ఆవనూనె ధర రూ.173 నుంచి 167 తగ్గగా.. వేరుశెనగ నూనె లీటరు రూ.189 నుంచి 2 శాతం తగ్గి రూ.185కి చేరింది.
ఇతర వస్తువుల ధరలు..
ఉల్లి ధర కిలో రూ.26 నుంచి 8 శాతం తగ్గి రూ.24కి, బంగాళదుంప ధర 7 శాతం తగ్గి కిలో రూ.28 నుంచి రూ.26కి చేరింది. పప్పుధాన్యాల్లో కిలో రూ.74 నుంచి రూ.71కి, మసూర్ దాల్ రూ.97 నుంచి 3 శాతం తగ్గి రూ.71కి, మినపప్పు కిలో రూ.108 నుంచి రూ.106కి చేరుకుందని గోయల్ తన ట్వీట్ ద్వారా వెల్లడించారు.
తగ్గుదలకు కారణం..?
ప్రపంచ వ్యాప్తంగా ధరల పతనం కారణంగా వంటనూనెల ధరలు భారీగా తగ్గినట్లు ఆహార మంత్రిత్వ శాఖ పేర్కొంది. దీనికి తోడు భారత ప్రభుత్వం దిగుమతు సుంకాలను తగ్గించటం గణనీయంగా ధరలు తగ్గటానికి ఎంతగానో దోహదపడింది. ఎడిబుల్ ఆయిల్స్పై రాయితీ దిగుమతి సుంకాలు మార్చి 2023 వరకు అమలులో ఉన్నాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.
లక్షల కోట్ల దిగుమతులు..
భారత వంటనూనె అవసరాల్లో 60 శాతానికి పైగా దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. అక్టోబర్తో ముగిసిన 2020-21 కాలానికి మనదేశం రికార్డు స్థాయిలో రూ.1.17 లక్షల కోట్ల విలువైన ఎడిబుల్ ఆయిల్ను దిగుమతి చేసుకుంది. ప్రస్తుతం పండుగల సీజన్ నడుస్తున్నందున కంపెనీలు ముందుగానే భారీ స్థాయిలో ఆయిల్ దిగుమతులు చేసుకున్నాయి.
ఎదురుదాడి చేస్తున్న సామాన్యులు..
పీయూష్ గోయల్ చేసిన ట్వీట్ పై సామాన్యులు ధ్వజమెత్తుతున్నారు. మోదీ ప్రభుత్వం వచ్చాక రూపాయి పతనమైందని ఒకప్పుడు డాలరుకు 62 నుంచి 81కి పడిపోయిందని ఒకరు కామెంట్ చేశారు. మరొకరైతే ఫైనాన్స్ మంత్రికి తెలివి లేదని, మిగతా మంత్రులు యథా రాజా తథా మంత్రి అన్నట్లుగానే ఉన్నారని కామెంట్ చేశాడు. ఇలా అనేక మంది కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.