తెలంగాణలో మరో రూ.500 కోట్ల పెట్టుబడి, 2వేలమందికి ఉపాధి: కేటీఆర్ థ్యాంక్స్
తెలంగాణలో రూ.500 కోట్ల పెట్టుబడులు పెట్టాలని పిరమిల్ సంస్థ నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న పిరమిల్ ఫార్మాను విస్తరించనుంది. రానున్న మూడేళ్లలో ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టనుంది. దీంతో ప్రస్తుతం మరో 600 ఉద్యోగాలు పెరగనున్నాయి. వచ్చే నెల తెలంగాణలో పిరమాల్ గ్రూప్ సీనియర్ ప్రతినిధి బృందం పర్యటిస్తుంది. ఈ మేరకు దావోస్లో కేటీఆర్తో సమావేశమైన పిరమిల్ గ్రూప్ చైర్మన్ అజయ్ పిరమిల్ తన నిర్ణయాన్ని తెలిపారు. ఆయనకు కేటీఆర్ థ్యాంక్స్ చెప్పారు.
హైదరాబాద్కు తరలిస్తాం..
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాలసీలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లోని ప్లాంట్లను హైదరాబాద్కు తరలించే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపిన పిరమిల్ గ్రూప్ తెలిపింది. హైదరాబాదులోని తమ ప్లాంటును విస్తరించడంతో పాటు ఇతర రాష్ట్రాలలోని ప్లాంట్స్ను హైదరాబాద్కు తరలించే అవకాశాల్ని పరిశీలిస్తామని ప్రకటించింది. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలను పరిగణనలోకి తీసుకొని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈవోడీబీ) కోసం ఈ నిర్ణయం తీసుకొన్నామని, ఇతర కంపెనీలను కొనుగోలు చేసి తమ సామర్థ్యాన్ని పెంచుకొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది. కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా హెల్త్ కేర్, సురక్షిత తాగునీరు, డిజిటల్ విలేజ్ లాంటి కార్యకలాపాలు చేపడతామని తెలిపింది.
పెరగనున్న ఉద్యోగాలు
ప్రస్తుతం తెలంగాణలో పిరమిల్ గ్రూప్కు అన్ని రకాల అనుమతులు కలిగిన మూడు బ్లాకులు ఉన్నాయి. పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించకుండా జీరో డిశ్చార్జ్ విధానంలో తమ సంస్థ పని చేస్తోందని, తమ హెల్త్ కేర్ పరిశ్రమలో ఇప్పటికే వేలమంది ఉద్యోగులున్నారని, తాజా రూ.500 పెట్టుబడుల ద్వారా మరో 600 మంది ఉద్యోగులు పెరుగుతారని పేర్కొంది. ఈ పెట్టుబడి ద్వారా ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన మందుల తయారీ ప్లాంటును ఏర్పాటు చేస్తామని, పరిశీలన కోసం తమ ప్రతినిధులు పర్యటిస్తారని పిరమిల్ గ్రూప్ తెలిపింది.
|
మరో 2,000 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి
తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు, టీఎస్ఐపాస్, మౌలిక వసతులు, యంత్రాంగం సహకారం ఆకర్షించాయని, ప్రస్తుతం దిగ్వాల్లో తమ పరిశ్రమలో 3 బ్లాక్స్ ద్వారా ఉత్పత్తి సాగుతోందని, ఇక్కడ 2400 మందికి ఉపాది కల్పిస్తున్నామని, విస్తరణలో మరో రెండు బ్లాక్స్ ఏర్పాటు చేసి ప్రత్యక్షంగా, పరోక్షంగా మరో 2 వేల మందికి ఉపాధి కల్పిస్తామని అజయ్ పిరమిల్ చెప్పారు. అన్ని విధాలా సహకరిస్తామని మంత్రి కేటీఆర్ ఆయనకు హామీ ఇచ్చారు.