ఔషధ పరిశ్రమలకు కేంద్రం కళ్లెం.. దిగిరానున్న 80 శాతం మందుల ధరలు!
దేశంలో ఔషధ ధరలకు కళ్లెం వేయాలంటూ ఎంతోకాలంగా వివిధ వర్గాలు కేంద్ర ప్రభుత్వానికి మొరపెట్టుకుంటుండగా, ఇన్నాళ్లకు ఇది ఎట్టకేలకు కార్యరూపం దాల్చబోతోంది. ఇప్పటికే కేన్సర్ ఔషధాల ధరలు తగ్గుముఖం పట్టగా.. ఇప్పుడు కేంద్రం చర్యలతో మరిన్ని ఔషధాల ధరలు తగ్గనున్నాయి.
గత ఆరు నెలల కృషి ఫలితంగా గత వారం ఢిల్లీలో నేషనల్ ఫార్మా ప్రైసింగ్ అథారిటీ సమక్షంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న తయారీదారులు, పంపిణీదారులు ఒక అంగీకారానికి వచ్చారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుని ఉత్తర్వులు జారీ చేసిన వెంటనే మందుల ధరలు తగ్గిపోనున్నాయి.
వ్యాధులంటే కాదు, మందులంటేనే భయం...
దేశంలోని మెజారిటీ ప్రజలు వ్యాధులకు భయపడడం లేదు. వాటికి వాడవలసిన మందుల ధరలు చూసి జడుసుకుంటున్నారంటే ఇందులో అతిశయోక్తి ఎంత మాత్రం లేదు. అందుకే మందుల ధరలకు కళ్లెం వేయాలని పలు వర్గాలు కేంద్రానికి మొరపెట్టుకోగా ఎట్టకేలకు వారి బాధను అర్థం చేసుకున్న మోడీ సర్కారు ఔషధాల ధరలు తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంది. ఫలితంగా ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న వాటిలో దాదాపు 80 శాతం ఔషధాల ధరలు తగ్గిపోయే అవకాశం కనిపిస్తోంది. ధరలు తగ్గబోయే ఔషధాల్లో.. రెటెప్లేస్, ఇమ్యూనోగ్లోబులిన్, టెనెక్టెప్లేస్, ఎరిథ్రోపొయిటిన్ ఇంజక్షన్, టెర్లిప్రెస్సిన్ ఇంజక్షన్, పిపెరాసిల్లిన్ అండ్ టాజాబ్యాక్టమ్, రిటూక్సిమాబ్, వొరికోనజోల్ ఇంజక్షన్ వంటివి ఉన్నాయి.
ఏమిటీ షెడ్యూల్డ్, నాన్-షెడ్యూల్డ్ జాబితా?
ఔషధాలకు సంబంధించి మన దేశంలో రెండు రకాల జాబితాలు ఉన్నాయి. ఒకటి షెడ్యూల్డ్ జాబితా కాగా రెండోది నాన్-షెడ్యూల్డ్ జాబితా. ప్రస్తుతం షెడ్యూల్డ్ జాబితాలో ఉన్న ఔషధాల ధరలపై నియంత్రణ ఉంది. ఈ జాబితాలో ఉన్న మందుల ధరలను నేషనల్ ఫార్మా ప్రైసింగ్ అథారిటీ(ఎన్పీపీఏ) నిర్ణయిస్తుంది. అయితే నాన్-షెడ్యూల్డ్ జాబితాలో ఉన్న మందుల ధరలపై నియంత్రణ అనేది లేదు. దీంతో నాన్-షెడ్యూల్డ్ జాబితాలో ఉన్న మందులపై ఫార్మాస్యూటికల్ కంపెనీలు, పంపిణీదారులు చాలావరకు లాభాలు ఆర్జిస్తున్నారు. ఈ రకం మందుల సంఖ్య 10,600 కంటే పైగానే ఉన్నట్లు అంచనా. పైగా విటమిన్-డి వంటి సాధరణ మందుల నుంచి మొదలుకొని ఎన్నో యాంటీ బయాటిక్ మందుల వరకు ఈ నాన్-షెడ్యూల్డ్ జాబితాలోనే ఉన్నాయి. హోల్సేల్ స్టాకిస్టులకు 10 శాతం, రిటైలర్లకు 20 శాతం కనీస మిగులు ఉండే విధంగా ఈ ఔషధాల ధరలను మందుల కంపెనీలు నిర్ణయిస్తాయని చెబుతున్నా.. వాస్తవానికి ఇంతకంటే ఎక్కువ లాభాలే ఆర్జిస్తున్నట్లు తెలుస్తోంది.
కేన్సర్ ఔషధాల మాదిరిగానే...
గుండె జబ్బులు, కేన్సర్ తదితర ప్రాణాంతక వ్యాధుల చికిత్సకు సంబంధించిన ఔషధాల నుంచి మరికొన్ని సాధారణ ఔషధాల వరకు ధరల గతంలో చాలా ఎక్కువగా ఉండేవి. ఈ ఔషధాల ధరలు తగ్గించాలంటూ కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఎంతో కాలంగా కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాయి. దీంతో కేంద్రం స్పందించి కేన్సర్ ఔషధాలపై లాభం 30 శాతానికి మించి తీసుకోకూడదంటూ ఔషధ తయారీ కంపెనీలను ఆదేశించింది. ఫలితంగా కేన్సర్ మందుల ధరలు తగ్గిపోయాయి. కొంతకాలంగా ఇది అమలు అవుతోంది. ఇప్పుడు నాన్ షెడ్యూల్డ్ జాబితాలోని ఔషధాల ధరల విషయంలోనూ ఇదే విధానాన్ని అమలు చేయాలని అన్ని వర్గాల నుంచి ఒత్తిడి వస్తోంది.
ఎన్పీపీఏ చొరవతో కుదిరిన అంగీకారం...
నాన్ షెడ్యూల్డ్ జాబితాలోని మందుల ధరలపై కూడా ప్రభుత్వ నియంత్రణ ఉండాలనే డిమాండ్ అధికం కావడంతో నేషనల్ ఫార్మా ప్రైసింగ్ అథారిటీ(ఎన్పీపీఏ) చొరవ తీసుకుని ఇండియన్ డ్రగ్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్(ఐడీఎంఏ), ఇండియయన్ ఫార్మాస్యూటికల అలయన్స్(ఐపీఏ), ఆర్గనైజేషన్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఇండియా వంటి సంస్థలతో సంప్రదింపులు జరిపింది. దీంతో నాన్ షెడ్యూల్డ్ జాబితాలోని ఔషధాలపై కూడా తమ లాభాలను 30 శాతానికి పరిమితం చేసే అంశంపై ఈ సంస్థలు ఒక అంగీకారానికి వచ్చాయి. అయితే అఖిల భారత కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ మాత్రం హోల్సేల్ స్టాకిస్టులకు 12.5 శాతం, రిటైల్ పంపిణీదారులకు 25 శాతం మిగులు లాభం ఉండాలని కోరినా.. మొత్తంమీద చివరికి 30 శాతం లాభాలు తీసుకోవడానికే అన్ని వర్గాలు అంగీకరించాయి. దీనికి సంబంధించిన ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం త్వరలోనే జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మందుల రంగులోనూ తేడా ఉండాల్సిందే...
దేశంలో రెండు రకాల ఔషధాలు ఉన్నాయి. అవి జనరిక్స్, బ్రాండెడ్ జనరిక్స్. ఈ రెండు రకాల ఔషధాలు ఒకటే అయినా ఒకదానికి బ్రాండ్ పేరు ఉంటుంది. వాటిని బ్రాండెడ్ జనరిక్స్ అని పిలుస్తున్నారు. ఇక జనరిక్స్ ఔషధాలపై బ్రాండ్ కాకుండా ఆ మందు సాంకేతిక నామం ప్రింట్ అయి ఉంటుంది. బ్రాండెడ్ జనరిక్స్ ఔషధాలపై వాటిని తయారు చేసే ఫార్మాస్యూటికల్ కంపెనీలు అధిక లాభాలు ఆర్జిస్తుంటాయి. జనరిక్ ఔషధాలపై రిటైల్ విక్రయదారులకు లాభం ఎక్కువగా ఉంటుంది. ఈ తేడాను కూడా సవరించాలనే డిమాండ్ వినిపిస్తోంది. అంతేకాకుండా బ్రాండెడ్ ఔషధాలు ఉండే ప్యాక్ రంగు, జనరిక్ ఔషధాలు ఉండే ప్యాక్ రంగు మధ్య తేడా ఉండాలని, దానివల్ల ప్రజలు రెండు రకాల ఔషధాల మధ్య తేడాను సులువుగా గుర్తించగలుగుతారని అంటున్నారు. అలాగే డాక్టర్లు కూడా రోగులు తమ వద్దకు వచ్చినప్పుడు రాసే మందుల ప్రిస్కిప్షన్లలో ఔషధాల బ్రాండ్ రాయకుండా.. జనరిక్ పేర్లు మాత్రమే రాయాలంటూ కేంద్ర ప్రభుత్వం ఆదేశించాలని, అలా చేయడం వల్ల జనరిక్ ఔషధాల వినియోగం పెరిగి ప్రజలకు మేలు జరుగుతుందనే వాదన వినిపిస్తోంది.