కరోనా దెబ్బ... మరోసారి పన్ను భారం: పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
పెట్రోల్, డీజిల్పై ట్యాక్స్ పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కరోనా మహమ్మారి పైన పోరు కోసం అదనపు నిధులను సమీకరించే ఉద్దేశ్యంలో భాగంగా ట్యాక్స్ పెంచే అవకాశాలపై సమాలోచనలు జరుపుతున్నారని తెలుస్తోంది. కరోనా కారణంగా కేంద్రానికి ఆదాయం తగ్గడమే కాకుండా, వైరస్ను ఎదుర్కొనేందుకు ఖర్చులు పెరిగాయి. ఈ నేపథ్యంలో అదనపు ఆదాయ మార్గాలపై దృష్టి సారించారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు పెట్రోల్, డీజిల్ పైన ఎక్సైజ్ సుంకాన్ని పెంచాలని ఆలోచిస్తోంది. లీటర్ పైన రూ.6 వరకు పెంచే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.
లోన్ మారటోరియం గుడ్న్యూస్: ఎవరు అర్హులు, ఎంత లబ్ధి? EMI చెల్లించిన వారికి ప్రయోజనం ఎంత?
రూ.60,000 కోట్ల అదనపు ఆదాయం
ఎక్సైజ్ సుంకాన్ని రూ.6 వరకు పెంచడం ద్వారా ఏడాదికి రూ.60,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తున్నారు. గత కొద్ది రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగలేదు. ఈ నేపథ్యంలో ఎక్సైజ్ సుంకం పెంపుకు ఇది సరైన సమయమని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి విధివిధానాలపై కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈ పెంపు నిర్ణయం అమలులోకి వస్తే, ఎప్పటి నుండి వస్తుందనేది త్వరలో వెల్లడించనున్నారు.
పెంపుకు పార్లమెంటరీ అనుమతి
కేంద్ర ప్రభుత్వం మార్చిలో పెట్రోల్ పైన రూ.18, డీజిల్ పైన రూ.12 ఎక్సైజ్ డ్యూటీని పెంచేందుకు పార్లమెంటరీ అనుమతి తీసుకుంది. అయితే అప్పుడు లెవీనీ మార్చలేదు. మే నెలలో ఎక్సైజ్ సుంకాన్ని అదనంగా పెట్రోల్ పైన రూ.12, డీజిల్ పైన రూ.9కి పెంచింది. ఈ లెక్కన పెట్రోల్ పైన మరో రూ.6, డీజిల్ పైన మరో రూ.3 పెంచేందుకు ప్రభుత్వానికి అవకాశం ఉంది. ఇప్పుడు కరోనా నేపథ్యంలో ఈ అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఇందుకు పార్లమెంటరీ అనుమతి కూడా తీసుకుంది.
పన్నులు 75 శాతం నుండి 80 శాతానికి
రూ.3 నుండి రూ.6 వరకు ఎక్సైజ్ డ్యూటీ పెంచినప్పటికీ వినియోగదారులపై ఆ మేరకు భారంపడే అవకాశాలు ప్రస్తుతానికి తక్కువ అంటున్నారు. చమురు ధరలు తక్కువగా ఉండటంతో రిటైల్ ధరల్లో స్వల్పంగా మార్పు ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇంధనంపై 70 శాతం పన్నులు ఉన్నాయి. ఇప్పుడు మళ్లీ పెంచితే 75 నుండి 80 శాతానికి చేరుకునే అవకాశాలు ఉన్నాయి. చమురు ఆదాయాన్ని రూ.1.75 లక్షల కోట్లకు పెంచాలని కేంద్రం భావిస్తోంది.