మొదటిసారి తగ్గాయి: ఏడాదిలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత పెరిగాయంటే?
ముంబై: దేశీయ ఇంధన ధరలు బుధవారం (మార్చి 24) స్వల్పంగా తగ్గాయి. 2021 క్యాలెండర్ సంవత్సరంలో పెట్రోల్, డీజిల్ ధరలు మొదటిసారి క్షీణించాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు క్షీణించడంతో దేశీయ చమురు రంగ కంపెనీలు లీటర్ పెట్రోల్ పైన 18 పైసలు, లీటర్ డీజిల్ పైన 17 పైసలు తగ్గించాయి. చమురు మార్కెటింగ్ రంగ కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా ప్రతి రోజు ఉదయం ఆరు గంటలకు ఇంధన ధరలను సవరిస్తాయి. ఇందులో భాగంగా నేడు తగ్గించాయి.
ఏ నగరంలో ఎంత ఉందంటే
పెరిగిన అనంతరం దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర లీటర్కు 18 పైసలు తగ్గి రూ.90.99, డీజిల్ ధర లీటర్కు 17 పైసలు క్షీణించి రూ.81.30 వద్ద ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ రూ.97.40, కోల్కతాలో రూ.91.18, చెన్నైలో రూ.92.95, డీజిల్ లీటర్ ముంబైలో రూ.88.42, కోల్కతాలో రూ.84.18, చెన్నైలో రూ.86.29గా ఉంది. హైదరాబాద్లో పెట్రోల్ రూ.94.61, డీజిల్ రూ.88.67గా ఉంది. గత కొంతకాలంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతోన్న విషయం తెలిసిందే. గత ఏడాది మార్చి 16వ తేదీ తర్వాత దేశంలో పెట్రోల్ ధరలు తగ్గించడం ఇదే మొదటిసారి. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ రూ.100 క్రాస్ చేసింది.
ఏడాదిలో ఎంత పెరిగిందంటే
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల చివరిసారి గత నెల అంటే ఫిబ్రవరి 27న స్వల్పంగా పెరిగింది. ఆ రోజు పెట్రోల్ పైన 24 పైసలు, డీజిల్ పైన 15 పైసలు పెరిగాయి. ఏడాది కాలంలో ముడి చమురు ధరలు స్థిరంగా న్నాయి. దేశంలో పెట్రోల్ పైన రూ.21.40, డీజిల్ పైన రూ.19.01 పెరిగింది. గత ఏడాది మార్చి 24వ తేదీన ఢిల్లీలో రూ.69.59గా ఉన్న పెట్రోల్ నేడు రూ.91కి చేరుకుంది. గత ఏడాది ఇదే తేదీన (మార్చి 24) రూ.62.29గా ఉన్న డీజిల్ ఇప్పుడు రూ.81.30గా ఉంది.
భారీగా వసూళ్లు
పెట్రోల్, డీజిల్ పైన పన్ను వసూళ్లు గత ఆరేళ్ల కాలంలో 300 శాతం పెరిగాయి. కేంద్ర ప్రభుత్వం 2014-15లో ఎక్సైజ్ డ్యూటీ రూపంలో పెట్రోల్ పైన రూ.29,279 కోట్లు, డీజిల్ పైన రూ.42,881 కోట్లు వసూలు చేసింది. వీటికి సహజ వాయువును కలిపితే 2014-15లో వీటిపై ఎక్సైజ్ రూపంలో రూ.74,158 కోట్లు ప్రభుత్వానికి చేరాయి. ఈ వసూళ్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల్లో ఏకంగా రూ.2.95 లక్షల కోట్లకు చేరుకున్నాయి. కేవలం పెట్రోల్, డీజిల్పై పన్నుల వసూళ్లు రూ.2.94 లక్షల కోట్లకు పెరిగాయి.