విజయవాడలో రూ.100 దాటిన పెట్రోల్: ముంబైలో అంతకంటే: హైదరాబాద్లో రూ.97కు పైగా
న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ సృష్టిస్తోన్న సంక్షోభ పరిస్థితుల్లోనూ ఇంధన ధరల పెరుగుదల యథేచ్ఛగా కొనసాగుతోంది. వాటి రేట్ల పెరుగుదలకు ఏ మాత్రం బ్రేకులు పడట్లేదు. ఒకట్రెండు రోజుల గ్యాప్ ఇస్తూ.. వాహనదారుల వీపు విమానం మోత మోగిస్తోన్నాయి చమురు సంస్థలు. మధ్య మధ్యలో కొంత విరామం ఇచ్చాయే తప్ప పెరుగుదల మాత్రం పక్కాగా కొనసాగింది. శనివారం కూడా వాటి ధరల్లో పెరుగుదల కనిపించింది. తాజాగా పెంపుతో విజయవాడ, ముంబైల్లో పెట్రోల్ రేటు వంద రూపాయల మార్క్ను దాటేసింది. పలు నగరాల్లో వంద రూపాయల మార్క్కు చేరువగా చేరుకున్నాయి వాటి రేట్లు.
లీటర్ పెట్రోల్పై 25, డీజిల్పై 28 పైసల మేర
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ శనివారం చేసిన సవరణల ప్రకారం- పెట్రోల్ లీటర్ ఒక్కింటికి 25 నుంచి 26 పైసలు, డీజిల్ లీటర్ ఒక్కింటికి 28 నుంచి 30 పైసల మేర పెరిగింది. దీనితో దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ రూ.93.94, డీజిల్ 84.89 పైసలుగా రికార్డయింది. ముంబైలో పెట్రోల్ రేటు 100.19 రూపాయలు ఉంటోంది. డీజిల్ ధర 92.17 పైసలకు చేరింది. దేశ ఆర్థిక రాజధానిలో పెట్రోల్ రేటు లీటర్ ఒక్కింటికి 100 రూపాయల మార్క్ను దాటడం వాహనదారులను బెంబేలెతిస్తోంది. మిగిలిన నగరాలతో పోల్చుకుంటే బహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పరిధి, నవీ ముంబైల్లో పెట్రోల్ వినియోగం ఒకింత ఎక్కువే. అలాంటి చోటే 100 రూపాయల మార్క్ను దాటడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది.
విజయవాడలోనూ వంద
విజయవాడలోనూ పెట్రోల్ లీటర్ ఒక్కింటికి 100 రూపాయలను దాటేసింది. లీటర్ పెట్రోల్ రూ.100.04 పైసలు పలుకుతోంది. చెన్నైలో పెట్రోల్ రూ. 95.51, డీజిల్ ధర రూ. 89.65, కోల్కతలో పెట్రోల్ రూ.93.97 పైసలు, డీజిల్ ధర రూ.87.74 పైసలు పలుకుతోంది.
బెంగళూరులో పెట్రోల్-97.07, డీజిల్-89.99, పుణేలో లీటర్ పెట్రోల్-98.77, డీజిల్-88.96, పాట్నాలో పెట్రోల్-96.10, డీజిల్ 90.16, చండీగఢ్లో పెట్రోల్-90.36, డీజిల్-84.55, లక్నోలో పెట్రోల్-91.41, డీజిల్-85.28గా నమోదైంది. భోపాల్లో పెట్రోల్-102.04, డీజిల్-93.37 మార్క్ను దాటుకుంది. ఒక రాష్ట్ర రాజధానిలో పెట్రోల్ రేటు లీటర్ ఒక్కింటి 102 రూపాయలకు పైగా నమోదు కావడం ఇదే తొలిసారి. హైదరాబాద్లో పెట్రోల్-97.63, డీజిల్-92.54, నొయిడాలో పెట్రోల్-91.49, డీజిల్-85.36, రాంచీలో పెట్రోల్-90.62, డీజిల్-89.64గా నమోదైంది.
16 దఫాల పెంపులో ఎనిమిది రూపాయల బాదుడు..
ఈ నెల 4వ తేదీ నుంచి ఇప్పటిదాకా 16 సార్లు ఇంధన రేట్లు పెరిగాయి. ఒక నెలలో ఈ స్థాయిలో పెరగడం చరిత్రలో ఇదే తొలిసారి. ఈ 16 16 దఫాల పెంపులో 7.72 పైసల మేర ఫ్యూయల్ రేట్లు పెరిగాయి. ఇందులో పెట్రోల్ వాటా రూ.3.61 పైసలు కగా.. డీజిల్ది రూ.4.11 పైసలు. ఈ స్థాయిలో వరుసగా పెరుగుదల ఏ నెలలో కూడా చోటు చేసుకోలేదు. ఆ వరుస పెంపుల ఫలితంగా పెట్రోల్ ధర పీక్స్కు వెళ్లింది. స్కై హైలో దూసుకెళ్లింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో 100 రూపాయల మార్క్ను అధిగమించింది పెట్రోల్ రేటు. ఇదే జాబితాలో మన హైదరాబాద్ చేరుకోవడానికి ఎంతో సమయం పట్టకపోవచ్చు.