GDP data: 2018-19 స్థాయికి తగ్గిన తలసరి ఆదాయం, వినియోగం
నేషనల్ అకౌంట్స్ డేటా ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత తలసరి ఆదాయం (ప్రస్తుత వ్యాల్యూలో) రూ.1,28,829గా నమోదయింది. దీనిని పర్కాపిటా నెట్ నేషనల్ ఇన్కం(NNI) అని కూడా అంటారు. అలాగే వినియోగ ఖర్చు 2018-19 స్థాయికి పడిపోయాయి. ప్రస్తుత వ్యాల్యూ ప్రకారం గత ఏడాదితో పోలిస్తే తలసరి ఆదాయం 4 శాతం క్షీణించింది. అలాగే వినియోగ డిమాండ్ 7 శాతం మేర తగ్గింది. ప్రస్తుత వ్యాల్యూలో నేషనల్ ఇన్కమ్ 3 శాతం క్షీణతతో ఉంది.2019-20 నుండి 2020-21 మధ్య దేశ జనాభా 14 మిలియన్లు పెరిగినట్లుగా అంచనా.
Q4లో జీడీపీ వృద్ధి రేటు 1.6 శాతం, FY21లో మైనస్ 7.3 శాతం
FY21 పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను (2020-21) భారత జీడీపీ వృద్ధి రేటు మైనస్ 7.3 శాతం నమోదయింది. గత ఆర్థిక సంవత్సరం 4వ త్రైమాసికంలో 1.6 శాతం సానుకూల వృద్ధి నమోదు చేసింది. కరోనా నేపథ్యంలో గత ఏడాది మార్చి 23 నుండి లాక్ డౌన్ విధించడంతో FY21లో మొదటి మూడు నెలలు ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. దీంతో మొదటి త్రైమాసికంలో వృద్ధి రేటు మైనస్ 23.9 శాతం నమోదయింది. ఆ తర్వాత క్రమంగా కోలుకుంటోంది.
కరోనా ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై భారీగానే పడింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 7.3 శాతం క్షీణత నమోదు కావడం నాలుగు దశాబ్దాల చరిత్రలో ఇదే కనిష్ఠం. ఈ మేరకు కేంద్ర గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) సోమవారం సంబంధిత గణాంకాలను వెలువరించింది. మూడో త్రైమాసికంతో పోలిస్తే నాలుగో త్రైమాసికంలో 0.5 శాతం పెరుగుదల నమోదు చేసింది. 2019-20 ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో మూడు శాతం వృద్ధి నమోదయింది.