కరోనా కంటే ఆర్థిక సంక్షోభం గురించే ప్రజల భయాలు, ఆ రంగంలోనే 2 కోట్ల ఉద్యోగాలు ఫట్!
ప్రస్తుతం దేశంలో మెజార్టీ ప్రజలు, సంస్థలు కరోనా హెల్త్ ఇష్యూ కంటే ఆర్థిక సంక్షోభం గురించే ఎక్కువగా ఆందోళన చెందుతున్నారని లక్నో ఐఐఎం (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్) సెంటర్ ఫర్ మార్కెటింగ్ ఇన్ ఎమర్జింగ్ ఎకానమీస్ (CMEE) ఆన్లైన్ ద్వారా నిర్వహించిన అధ్యయనంలో తేలింది. 23 రాష్ట్రాల్లోని 104 నగరాల్లో వివిధ వర్గాలకు చెందిన వారి ద్వారా సర్వే నిర్వహించారు. కరోనా వ్యాప్తిపై 79%మంది ఆందోళన చెందుతున్నారని, 40% మందిలో భయం, 22% మందిలో విచారం నెలకొందని ఈ అధ్యయనంలో తేలింది.
కరోనాతో ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాల్ ఇదే: దువ్వూరి సుబ్బారావు
ఆర్థిక నష్టంపై ఆందోళన
లాక్ డౌన్ వల్ల ఆర్థికంగా జరుగుతోన్న నష్టంపై ఈ అధ్యయనంలో 32% మంది ఆందోళన వ్యక్తం చేశారు. లాక్ డౌన్ను ఎత్తేస్తే జనం ఇష్టారీతిన వ్యవహరిస్తారని, దీంతో కరోనా మరింత విజృంభిస్తుందని 15% మంది అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం కొనసాగుతున్న అనిశ్చిత పరిస్థితుల గురించి 16% మందిలో, కరోనా బారిన పడతామని 14% మందిలో భయం నెలకొన్నట్లు అధ్యయనంలో తేలిందని వెల్లడించింది.
ప్రభుత్వం చర్యలపై విశ్వాసం
ప్రతి 5గురిలో ముగ్గురు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై విశ్వాసం వ్యక్తం చేశారు. మొదటి దశ లాక్ డౌన్ సమయంలో 57 శాతం మంది విశ్వాసం వ్యక్తం చేయగా రెండో దశ లాక్ డౌన్ సమయానికి అది 63 శాతానికి పెరిగింది. అలాగే, మాస్కులు, పీపీఈ కిట్స్ వంటి హెల్త్ ఇన్ప్రాస్ట్రక్చర్ పెరగడంపై ఎక్కువ మంది సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల కోఆపరేషన్ బాగుందని 29 శాతం మంది, కేసులు, మరణాల శాతం తక్కువగా ఉండటంపై 26 శాతం, ప్రభుత్వం చర్యలపై 19 శాతం సంతృప్తి వ్యక్తం చేశారు.
సర్వే పాల్గొన్నవారిలో...
ఈ సర్వేలో పాల్గొన్నవారిలో 62 శాతం మంది పురుషులు, 38 శాతం మంది మహిళలు, 63 శాతం మంది పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంతకంటే ఎక్కువ, 40 శాతం మంది రూ.10 లక్షల కంటే ఎక్కువ ఆదాయం కలిగిన వారు ఉన్నారు.
ఆతిథ్య రంగంపై పెను ప్రభావం
కరోనా-లాక్ డౌన్ కారణంగా ఆతిథ్య రంగంపై ఎక్కువ ప్రభావం పడింది. ఈ రంగానికి అపారనష్టం కలిగింది. కరోనా- లాక్ డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా ఉన్న హోటల్స్, ట్రాన్సుపోర్ట్ సంబంధించిన అన్ని కార్యాలయాలు క్లోజ్ అయ్యాయి. ముఖ్యంగా ఈ వేసవిలో ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించి లాభపడాలనుకున్న వారికి నిరాశను మిగిల్చింది. కరోనా కారణంగా ఆతిథ్య రంగం రూ.5 లక్షల కోట్లకు పైగా నష్టపోయి ఉంటుందని ఈ రంగంలోని సంస్థల అంచనా. ఇందులో సంఘటిత రంగానికి చెందిన సంస్థలు మూడో వంతు ఆదాయాన్ని కోల్పోయాయని ఓ నివేదికలో వెల్లడైంది. ఆదాయ నష్టం, ఉద్యోగా, ఉపాధి అవకాశాలు పోయాయి. ఈ ఒక్క రంగంలోనే దాదాపు రెండు కోట్ల మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోతారని అంచనా.