10 ఏళ్లలో మొదటిసారి.. భారీగా పెరిగిన ల్యాప్టాప్, పీసీ సేల్స్
కరోనా మహమ్మారి నేపథ్యంలో దాదాపు అన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. పాఠశాలలు పూర్తిగా తెరుచుకోలేదు. ఈ-లెర్నింగ్ పెరిగింది. స్కూల్స్ ఆన్లైన్ క్లాస్లు నిర్వహిస్తున్నాయి. దీంతో ల్యాప్టాప్లతో పాటు పీసీలకు డిమాండ్ పుంజుకుంది. దేశీయంగా, అంతర్జాతీయంగా సేల్స్ పెరిగాయి. కరోనా సమయంలో భారీగా పుంజుకున్న సేల్స్లో ల్యాప్డాప్, పిసీలు ఉన్నాయి. 2020 క్యాలెండర్ ఏడాది మూడో క్వార్టర్లో రికార్డ్ స్థాయిలో పీసీల విక్రయం జరిగింది.
భారీగా పెరిగిన సేల్స్
కంపెనీల పరంగా 2019 సెప్టెంబర్ క్వార్టర్తో పోలిస్తే 2020 ఇదే క్వార్టర్లో పీసీ సేల్స్ భారీగా పెరిగాయి. లెనోవో 11.4 శాతం, హెచ్పీ 11.9 శాతం, ఆపిల్ 13.2 శాతం, ఏసర్ 15 శాతం పెరిగాయి. కేవలం డెల్ సేల్స్ మాత్రం 0.5 శాతం క్షీణించాయి. టాప్ 5 కంపెనీలు ఇవే. ఇందులో 4 కంపెనీల సేల్స్ 11 శాతం నుండి 15 శాతం పెరిగాయి. ఈ ఏడాది మూడో క్వార్టర్లో 79.2 మిలియన్ల పీసీలు, ల్యాప్టాప్ సేల్స్ జరిగాయని కెనాలిస్ డేటా వెల్లడిస్తోంది.
10 ఏళ్లలో మొదటిసారి..
అమ్మకాలు సగటున 13 శాతం పెరిగాయి. కరోనా కారణంగా వర్క్ ఫ్రమ్ హోమ్, ఆన్ లైన్ క్లాస్ల వల్ల పీసీలకు డిమాండ్ పెరిగినట్లు తెలిపింది. వీటిలో 64 మిలియన్లతో ల్యాప్టాప్స్ మొదటి స్థానంలో ఉండగా, పీసీలు, నోట్ బుక్స్, ట్యాబ్స్ ఆ తర్వాత స్థానంలో ఉన్నాయి. డెల్ కంపెనీ సేల్స్ తగ్గినప్పటికీ మూడో స్థానాన్ని నిలబెట్టుకుంది. గడిచిన పదేళ్లలో పీసీల సేల్స్ ఈ స్థాయిలో జరగడం ఇదే మొదటిసారి.
మరికొంతకాలం..
లెనోవో పీసీల షిప్మెంట్ 19 మిలియన్లు కాగా, హెచ్పీ పీసీల షిప్మెంట్ 18.7 మిలియన్ల యూనిట్లుగా ఉంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ పొడిగించడంతో పాటు, ఆన్ లైన్ క్లాస్లు కూడా క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో రాబోయే రోజుల్లోను పీసీ, ల్యాప్టాప్ సేల్స్ పెరుగుతాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.