Paytm: బిగ్ టార్గెట్: ఈక్విటీ ద్వారా వేల కోట్ల సేకరణ: ఐపీఓకు ముహూర్తం ఫిక్స్
ముంబై: డిజిటల్ చెల్లింపుల కంపెనీ పేటీఎం (Paytm) భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) ద్వారా వేల కోట్ల రూపాయలను సమీకరించాలని టార్గెట్గా పెట్టుకుంది. గత ఆర్థిక సంవత్సరంలో భారీ నష్టాన్ని చవి చూసిన పేటీఎం కంపెనీ యాజమాన్యం.. ఈ నవంబర్లో ఐపీఓను జారీ చేయాలని నిర్ణయించింది. పేటీఎం ఐపీఓ (Paytm IPO) ద్వారా 12,000 కోట్ల రూపాయలను షేర్ హోలర్డ నుంచి సేకరించడానికి అవసరమైన ప్రతిపాదనలపై బోర్డు డైరెక్టర్లు ఆమోద ముద్ర వేసినట్లు మార్కెట్ వర్గాలు భావిస్తోన్నాయి.
నవంబర్లో ఈక్వటీ షేర్లు జారీ..
అన్నీ సవ్యంగా సాగితే.. ఈ నవంబర్లో ఐపీఓను జారీ చేయడం దాదాపు ఖాయమేనని అభిప్రాయపడుతున్నాయి. ఈ ఏడాది మార్చి 31వ తేదీన ముగిసిన 2020-2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికను పేటీఎం యాజమాన్యం ఈ నెల 5వ తేదీన విడుదల చేసిన విషయం తెలిసిందే. బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్కు దీన్ని పంపించింది. ఈ నివేదిక ప్రకారం.. గత ఆర్థిక సంవత్సరంలో పేటీఎం సంస్థకు 1,704 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. 2019-2020 ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే.. 10 శాతం మేర తక్కువగా ప్రాఫిట్ను నమోదు చేసిందా డిజిటల్ పేమెంట్ ఫిర్మ్.
గత ఏడాది నష్టాలే
2019-2020 ఆర్థిక సంవత్సరంలో 3,540.77 కోట్ల రూపాయల రాబడి నమోదు కాగా.. ఈ ఏడాది మార్చి 31 నాటికి ఈ సంఖ్య 3,186 కోట్లకు క్షీణించింది. 2019-2020 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా 2,943.32 కోట్ల నష్టాన్ని చవి చూసింది. గత ఏడాదికి ఈ సంఖ్య 1,704 కోట్లకు పడిపోయింది. గత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో కేంద్ర ప్రభుత్వం విధించిన కఠిన లాక్డౌన్ వల్ల లావాదేవీలు, డిజిటల్ చెల్లింపులు ఆశించిన స్థాయిలో నమోదు కాలేదని పేటీఎం తన వార్షిక నివేదికలో పేర్కొంది. ద్వితీయార్థంలో అన్లాక్ చర్యల వల్ల తాము పుంజుకోగలిగామని, డిజిటల్ చెల్లింపులు అంచనాలకు అనుగుణంగా నమోదయ్యాయని తెలిపింది.
12,000 కోట్ల సమీకరణ
ఈ నష్టాన్ని భర్తీ చేసుకోవడంతో పాటు తన మార్కెట్ను మరింత విస్తృతం చేసుకోవడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంది. ఐపీఓను జారీ చేయడం ద్వారా 12,000 కోట్ల రూపాయలను షేర్ హోల్డర్ల నుంచి సమీకరించుకోవాలని నిర్ణయించింది. ఈ లక్ష్యాన్ని గనక పేటీఎం అందుకోగలిగితే.. ఇంత భారీ మొత్తాన్ని సమీకరించిన రెండో సంస్థగా ఆవిర్భవిస్తుంది. ఇదివరకు కోల్ ఇండియా గరిష్ఠంగా 15,475 కోట్ల రూపాయలను సేకరించింది. పేటీఎం కంపెనీ ఐపీఓను జారీ చేయడం ఇది రెండోసారి అవుతుంది.
టాప్ ఫర్మ్గా
సాఫ్ట్బ్యాంక్ గ్రూప్, అలీబాబాకు చెందిన యాంట్ గ్రూప్, సైఫ్ పార్ట్నర్స్ వంటి కంపెనీలకు ఇందులో వాటా ఉంది. జేపీ మోర్గాన్, మోర్గాన్ స్టాన్లీ, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ద్వారా ఐపీఓకు వెళ్లింది ఇదివరకు. ప్రస్తుతం ఈ కంపెనీ టాప్ డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్ హోదాలో కొనసాగుతోంది. 50 మిలియన్ యాక్టివ్ యూజర్లు ఉన్నారు. అలాగే 350 మిలియన్ల ఇన్స్టాల్డ్ బేస్డ్, 20 మిలియన్ మర్చంట్ బేస్ ఉంది. మార్కెట్లో ఉన్న డిమాండ్, విలువ ఆధారంగా 12,000 కోట్ల సమీకరణ సజావుగానే సాగుతుందని పేటీఎం యాజమాన్యం భావిస్తోంది. దీనికి అనుగుణంగా ఈక్విటీ షేర్లను చేయనుంది.