ఈ దెబ్బకు పేటీఎం షేర్లు భారీగా పెరిగే ఛాన్స్: ఇన్వెస్టర్లకు గుడ్న్యూస్
న్యూఢిల్లీ: ప్రముఖ డిజిటల్ పేమెంట్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ వన్97 కమ్యూనికేషన్స్ ప్రస్తుతం పెద్ద ఎత్తున నష్టాలను చవి చూస్తోంది. పీకల్లోతు నష్టాల్లో మునిగిన పోయిన ఫిన్టెక్ కంపెనీ ఇది. ఇప్పటికే షేర్ల ధరలు పాతాళానికి చేరుకున్నాయి. గత ఆర్థికసంవత్సరం నాలుగో త్రైమాసికం ఫలితాల్లోనూ పెద్ద ఎత్తున నష్టాలను చవి చూసింది.
Rakesh Jhunjhunwala: టైటాన్ షేర్..టైటానిక్ షిప్: ఒక్కరోజులో రూ.వందల కోట్లు నష్టం
నష్టాల్లో ఫిన్టెక్..
జనవరి-ఫిబ్రవరి-మార్చి కాలానికి పేటీఎం మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్.. 763 కోట్ల రూపాయల నష్టాలను చూపించింది. అంతకుముందు- మూడో త్రైమాసికంలో 778.5 కోట్ల రూపాయల నష్టాన్ని చవి చూసింది. నాలుగో త్రైమాసికంలోనూ అవే నష్టాలను కొనసాగించింది. అటు పేటీఎం షేర్ ధర 645 రూపాయల వద్ద స్టాక్ ఎక్స్ఛేంజీల్లో ట్రేడింగ్ అయింది.
కొంతమేర కదలిక..
కటాఫ్ ధరతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ. పేటీఎం షేర్ కటాఫ్ ప్రైస్ 2,150 రూపాయలు. స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు 70 శాతానికి పైగా నష్టాన్ని పంచింది. వాటి ధరల్లో ఏదైనా పాజిటివ్ ఉందంటే.. అది ఈ మధ్యకాలంలోనే కొంతకాలంగా కాస్త అప్ సర్కుట్లో ట్రేడింగ్ అవుతోంది. నెలరోజుల వ్యవధిలో ఒక్కో షేర్ మీద 92 రూపాయల మేర పెరుగుదల కనిపించింది.
పేటీఎం షేర్లు కొన్న విజయ్..
ఈ పరిణామాల మధ్య వన్ 97 కమ్యూనికేషన్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా విజయ్ శేఖర్ శర్మ కీలక నిర్ణయం తీసుకున్నారు. పేటీఎం షేర్లను పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు. ఏకంగా 1.7 లక్షల షేర్లను ఆయన కొన్నారు. దీని విలువ 11 కోట్ల రూపాయలు. కిందటి నెల 30, 31 తేదీల్లో నేరుగా ఆయన స్టాక్ ఎక్స్ఛేంజీల నుంచి పేటీఎం షేర్లను కొనుగోలు చేశారు.
గడువు ముగియడంతో..
లిస్టింగ్ అయిన తేదీ నుంచి ఆరు నెలల వరకు పేటీఎం స్టాక్స్ను కొనుగోలు చేయకూడదనే నిబంధన ఉంది. దీనివల్ల ఆయన ప్రారంభంలో పేటీఎం షేర్లను కొనలేదు. ఈ ఆరు నెలల గడువు ముగియడంతో 1.7 లక్షల షేర్లల్లో ఇన్వెస్ట్ చేశారు. దీని ప్రభావం పేటీఎం షేర్ల మీద కొంతమేర పాజిటివ్గా పడింది.
రూ.646 వద్ద ట్రేడింగ్..
విజయ్ శేఖర్ శర్మ- 11 కోట్ల రూపాయలతో పేటీఎం షేర్లను కొనుగోలు చేసినట్లు శుక్రవారం మధ్యాహ్నం సమాచారం అందిన వెంటనే- స్టాక్ ఎక్స్ఛేంజీల్లో వాటి ధరలు పెరిగాయి. 610 నుంచి 620 రూపాయల మధ్య ట్రేడ్ అవుతూ కనిపించిన పేటీఎం షేర్ల ధరలు ఒక్కసారిగా 640 రూపాయలను దాటుకుంది. ట్రేడింగ్ ముగిసే సమయానికి రూ.646.30 పైసల వద్ద నిలిచింది.
ఒక్కరోజులో రూ.32
ఒక్కరోజులోనే ఒక్కో షేర్ మీద రూ.32.35 పైసల లాభాన్ని ఇచ్చింది పేటీఎం. ఇదే ట్రెండ్ కొనసాగొచ్చనే అభిప్రాయాలు మార్కెట్ వర్గాల్లో వ్యక్తమౌతున్నాయి. విజయ్ శేఖర్ శర్మ ఏకంగా 11 కోట్ల రూపాయలతో షేర్లను కొనడం కొంత సానుకూల ప్రభావాన్ని చూపిందని స్పష్టం చేస్తోన్నాయి. మున్ముందు మరింత పెరుగుతాయని అంచనా వేస్తోన్నాయి.