ఇన్వెస్టర్లకు పేటీఎం షాక్, రూ.40వేల కోట్ల సంపద ఆవిరి: ఐపీవో ఫ్లాప్ తర్వాత మస్క్ పేరు..
స్టాక్ మార్కెట్ సోమవారం (నవంబర్ 22) కుప్పకూలింది. సెన్సెక్స్ నేడు 1170 పాయింట్లు నష్టపోయి 58,466 పాయింట్ల వద్ద, నిఫ్టీ 348 పాయింట్లు క్షీణించి 17,416 పాయింట్ల వద్ద ముగిసింది. అన్ని రంగాలు కూడా భారీగా నష్టపోయాయి. ఇటీవలే ఐపీవోకు వచ్చి, గత వారం లిస్టింగ్ అయిన పేటీఎం ఇప్పటికే ఫ్లాప్షో కనబరుస్తోంది. నేడు మరింతగా పతనమైంది. పేటీఎం షేర్ నేడు ఓ సమయంలో 17 శాతానికి పైగా నష్టపోయింది. నేడు రూ.1,509.00 వద్ద ప్రారంభమై, రూ.1,519.00 వద్ద గరిష్టాన్ని, రూ.1,271.00 కనిష్టాన్ని తాకింది. పేటీఎం స్టాక్ చివరకు రూ.198.80 (12.74%) నష్టపోయి రూ.1,362.00 వద్ద ముగిసింది.
రూ.2150 నుండి రూ.1350కి పతనం
గత గురువారం స్టాక్ ఎక్స్చేంజీలో లిస్ట్ అయిన మొదటిరోజే 26 శాతం పతమైన పేటీఎం షేర్ ఈ రోజు ట్రేడింగ్లో 12 శాతానికి పైగా క్షీణించింది. దీంతో ఇష్యూ ధర రూ.2150తో పోలిస్తే ఈ షేర్ ధర దాదాపు 41 శాతం క్షీణించి రూ.1271 వద్ద ట్రేడ్ అయింది. చివరకు 12 శాతం కంటే పైగా నష్టపోయి రూ.1362 వద్ద ముగిసింది. ఇష్యూ వద్ద కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1.39 లక్షల కోట్లు కాగా, ఇప్పుడు దాదాపు సగానికి చేరుకుంది. రూ.50వేల కోట్లకు పైగా ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. రూ.18,300 కోట్ల సమీకరణ లక్ష్యంతో పేటీఎం మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ ఐపీవోకు వచ్చిన విషయం తెలిసిందే.
రూ.12,900 నుండి రూ.8196కి డౌన్
ఐపీవోలో భాగంగా ఒక లాట్కు ఆరు షేర్లను నిర్ణయించారు. ఇష్యూ ధర రూ.2,150 ప్రకారం ఒక లాట్కు పెట్టుబడి రూ.12,900. బీఎస్ఈలో ప్రస్తుతమున్న రూ.1,366ని పరిగణలోకి తీసుకుంటే పెట్టుబడి వ్యాల్యూ రూ.2150 నుండి రూ.8,196కి తగ్గింది. అంటే ఇన్వెస్టర్ రూ.4,700 నష్టపోయాడు. అంటే 36 శాతం పెట్టుబడి ఆవిరైంది. ఐపీఓలో షేర్ ధర అధికంగా నిర్ణయించడం వల్లే ఈ ఫలితాలు వస్తున్నట్లు నిపుణుల మాట. కేవలం రెండు మార్కెట్ సెషన్లలోనే పేటీఎం ఇన్వెస్టర్ల సంపద రూ.40,000 కోట్లు ఆవిరైంది. ఉదయం ఓ సమయంలో రూ.50వేల కోట్లు నష్టపోయినప్పటికీ ఆ తర్వాత నష్టం కాస్త తగ్గింది.
విజయ శేఖర శర్మ ఏమన్నారంటే
పేటీఎం ఫౌండర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తన వన్ 97 కమ్యూనికేషన్స్ కంపెనీని టెస్లా ఇంక్తో పోల్చారు. తనకు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్కు పోలికలు ఉన్నాయన్నారు. పేటీఎం వరుసగా తొలి రెండు రోజులు అట్టర్ ఫ్లాప్ ప్రదర్శన నేపథ్యంలో ఆయన ఈ రకమైన పోలిక తీసుకు వచ్చారు. టెస్లా కంపెనీ షేర్ 2010లో ఐపీవోకు వచ్చినప్పుడు మొదటి రోజు 41 శాతం ఎగిసింది. ఆ తర్వాత రోజు 4 డాలర్ల చొప్పున క్షీణించింది.