200% పెరిగిన పేటీఎం బ్రాడ్బాండ్ బిల్స్, నిమిషాల్లో ఈ బిల్స్ చెల్లించవచ్చు
లాక్ డౌన్ సమయంలో డిజిటల్ పేమెంట్ ఫర్మ్ పేటీఎం ద్వారా బ్రాడ్బాండ్ బిల్ పేమెంట్స్ 200 శాతం పెరిగాయి. మొబైల్ రీఛార్జ్ 42 శాతం, డీటీహెచ్ రీఛార్జ్ 58 శాతం పెరిగాయి. మార్చి 22 నుండి ఏప్రిల్ 15 మధ్య ఈ డేటా నమోదయింది. లాక్ డౌన్ కారణంగా వ్యాపారాలు, కంపెనీలు అన్నీ మూతబడిన విషయం తెలిసిందే. డీటీహెచ్, బ్రాడ్బాండ్, మొబైల్ రీఛార్జ్ బయటకు వెళ్లి చేసుకోలేని పరిస్థితి. దీంతో అందరూ డిజిటల్ పేమెంట్ యాప్స్ను ఆశ్రయిస్తున్నారు.
బిల్లులు చెల్లించవచ్చు
లాక్ డౌన్ సమయంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇంటి దగ్గర నుంచి విద్యుత్, వాటర్, ఇతర బిల్లులు పేటీఎం ద్వారా సులభంగా చెల్లించవచ్చని ఆ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ వీర్ తెలిపారు. స్టే ఎట్ హోమ్ ఎసెన్షియల్ పేమెంట్స్ ద్వారా వన్ స్టాప్ సొల్యూషన్ను పేటీఎం యాప్ అందిస్తున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇప్పుడు ఏపీ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్, తెలంగాణ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ సీవరేజ్ బోర్డ్ వంటి ఎమర్జెన్సీ బిల్స్ను పేటీఎం ద్వారా చెల్లించవచ్చునని తెలిపారు.
వివిధ సేవలు
బిల్స్ను చెల్లించేందుకు సంబంధింత వెబ్సైట్లకు మారాల్సిన అవసరం లేకుండానే వివిధ సర్వీస్ ప్రొవైడర్స్ ద్వారా ఐకాన్ల నుంచి ఎంపిక చేసుకునే విధంగా రూపొందించినట్లు తెలిపారు. కస్టమర్లు తమ మొబైల్, డీటీహెచ్ రీచార్జ్లు, ఎలక్ట్రిసిటీ, క్రెడిట్ కార్డ్ వంటి చెల్లింపులు చేసేందుకు ఈ కొత్త యాప్ ఉపయోగపడుతుందన్నారు. గ్యాస్ సిలిండర్లు బుక్ చేసుకునేందుకు ఆప్షన్స్ ఉన్నాయని, బీమా సేవలను కొనుగోలు చేసేందుకు ప్రత్యేక బై ఇన్సూరెన్స్ ట్యాబ్ ఉంటుందన్నారు.
కరోనాపై సమాచారం
అపార్టుమెంట్ మెయింటెనెన్స్ బిల్స్నూ కొద్ది నిమిషాల్లోనే చెల్లించవచ్చునని తెలిపారు. సొసైటీ/అపార్టుమెంట్ పేటీఎం యాప్లో నమోదు కాకపోయినా కొన్ని సరళమైన స్టెప్స్ ద్వారా చెల్లింపులు ప్రారంభించవచ్చన్నారు. పేటీఎం యాప్ ఇంటర్ఫేస్ను పునరుద్ధరించామన్నారు. సులభంగా ఎసెన్సియల్ పేమెంట్ ఐకాన్ను చూడగలరని తెలిపారు. కరోనాపై సమాచారం, అలాగే సహాయ కేంద్రం కూడా ఏర్పాటు చేశారు.