Paytm: తగ్గేదె లే అంటున్న పేటిఎం.. బ్యాంకులకు పోటీగా బిజినెస్.. చాపకింద నీరులా విస్తరణ..
Paytm: డిజిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ పేటిఎం తన వ్యాపారాన్ని శరవేగంగా విస్తరిస్తోంది. దేశంలో డిజిటల్ చెల్లింపు సేవా ప్లాట్ఫారమ్కు మార్గదర్శకంగా ఉన్న పేటిఎం ప్రస్తుతం బ్యాంకులతో సమానంగా అభివృద్ధి చెందుతోంది.
బ్యాంకులతో కలిసి..
One97 కమ్యూనికేషన్స్ మాతృసంస్థగా పనిచేస్తున్న పేటిఎం కంపెనీ దేశంలోని ఇతర బ్యాంకింగ్ సంస్థలతో కలిసి కొన్ని త్రైమాసికాల క్రితం లోన్స్ వ్యాపారాన్ని ప్రారంభించింది. కొన్ని అవాంతరాలతో ప్రారంభమైన రుణ వ్యాపారం ఇప్పుడు భారీ వృద్ధిని నమోదు చేస్తోంది. కంపెనీ తక్కువ కాలంలోనే తన లోన్ బుక్ ను అనేక రెట్లు పెంచుకుంది.
వేల కోట్ల వ్యాపారం..
కంపెనీ రుణ వితరణ వార్షిక ప్రాతిపదికన సెప్టెంబరులో రూ.34,000 కోట్లకు చేరుకుంది. ఈ విషయాలను కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్స్ లో వెల్లడించింది. గత సంవత్సరం ఇదే సమయంతో పోల్చుకుంటే కంపెనీ రుణాల సంఖ్య మూడు రెట్లు పెరిగి 92 లక్షలకు చేరుకుంది. ఈ క్రమంలో సెప్టెంబర్ ఒక్క నెలలోనే పేటిఎం ఏకంగా రూ.7,313 కోట్ల రుణాలను కస్టమర్లకు అందించింది.
నెలవారీ వృద్ధి..
కంపెనీ నెలవారీ లోన్స్ వితరణ సమాచారాన్ని చూసినట్లైతే.. అది ఈ ఏడాది సగటున రూ.7.97 కోట్లకు చేరుకుంది. సెప్టెంబర్ క్వార్టర్లో ఇది 39 శాతం పెరిగింది. అయితే రిజర్వు బ్యాంక్ లోన్ యాప్స్ మోసాల గురించి ప్రజలను అప్రమత్తం చేయటం కూడా కంపెనీ వ్యాపారం పెరగటానికి ఎక్కువగా తోడ్పడిందని అనేక మంది చెబుతున్నారు. చిన్నచిన్న అవసరాల కోసం వెతికేవారికి కంపెనీ సహాయం చేస్తుంది.
వాటికి లోన్స్ ఇవ్వదు..
పేటిఎం ఇప్పటికే తన డిజిటల్ చెల్లింపుల యాప్ వాడుతున్న కస్టమర్లకు చిన్న మెుత్తంలో రుణాలను అందిస్తోంది. ఇదే సమయంలో హోమ్ లోన్స్, కార్ లోన్స్ వంటి పెద్ద రుణాలను ఇవ్వదని గుర్తించాలి. ఈ విధంగా లోన్ అమౌంట్ తక్కువగానే ఉన్నప్పటికీ వీరివద్ద నుంచి లోన్ తీసుకునేవారి సంఖ్య భారీగా పెరుగుతోంది.