Paytm Q2: కోట్ల రూపాయల్లో నష్టం: షేర్లలోనూ భారీ పతనం
ముంబై: ప్రముఖ మొబైల్ పేమెంట్ యాప్ పేటీఎంకు నష్టాలు వెంటాడుతోన్నాయి. అనుకూల పరిస్థితుల్లోనూ ఆ కంపెనీ ఏ మాత్రం ప్రభావాన్ని చూపలేకపోతోంది. బౌన్స్ బ్యాక్ కాలేపోతోంది. పబ్లిక్ ఇష్యూను జారీ చేసిన తరువాత పేటీఎం నష్టాలు రెట్టింపు అయ్యాయి. అటు వాటి షేర్ల ధరలు కూడా బెంచ్ మార్క్ ప్రైస్ను కాదు కదా.. కనీసం కటాఫ్ రేటును కూడా అందుకోలేకపోతోంది. ఈ కష్టాలు ఇప్పట్లో వీడేలా కనిపించట్లేదు. షేర్లు పుంజుకొంటే గానీ.. కంపెనీ పరిస్థితి మెరుగు పడేలా లేదు.
Omicron outbreak వేళ..అంతర్జాతీయ విమానాల కేంద్రం గ్రీన్సిగ్నల్: వద్దంటూ
482 కోట్ల నష్టం..
పేటీఎం మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ మరోసారి భారీగా నష్టపోయింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 481 కోట్ల 70 లక్షల రూపాయల నికర నష్టాన్ని చవి చూసింది. జులై-ఆగస్టు-సెప్టెంబర్ మధ్య కాలానికి నిర్వహించిన వ్యాపార లావాదేవీల్లో ఈ మేర నష్టం వాటిల్లినట్లు వన్ 97 కమ్యూనికేషన్స్ తెలిపింది. ఈ మేరకు స్టాక్ ఎక్స్ఛేంజ్లో రెండో త్రైమాసికానికి సంబంధించిన ప్రతిపాదనలను సమర్పించింది.
వరుసగా రెండో త్రైమాసికంలో..
వన్ 97 కమ్యూనికేషన్స్.. ఈ స్థాయిలో నష్టపోవడం వరుసగా ఇది రెండోసారి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనూ ఇవే తరహా నష్టాలను రికార్డు చేసింది. ఏప్రిల్-మే-జూన్ నెలల కాలానికి 376 కోట్ల 60 లక్షల రూపాయల మేర నష్టం సంభవించిందా కంపెనీకి. రెండో త్రైమాసికంలోనూ ఆ నష్టాలు వీడిపోలేదు. పైగా మరింత పెరిగాయి. 481.70 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. వన్ 97 కమ్యూనికేషన్స్కు కొంత ఊరట కలిగించే విషయం లేకపోలేదు. గత ఆర్థిక సంవత్సరం అంటే 2020-2021 రెండో త్రైమాసికంలో ఈ నష్టాల సంఖ్య 437 కోట్ల రూపాయలుగా నమోదైంది.
పెరిగిన రెవెన్యూ..
ఆ కంపెనీ ఆపరేషన్స్ రెట్టింపు అయ్యాయి. కార్యకలాపాలు విస్తృతం అయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల కాలానికి అంటే.. మొదటి, రెండో త్రైమాసికాల్లో వన్ 97 కమ్యూనికేషన్స్ మొత్తంగా 1,086 కోట్ల 40 లక్షల రూపాయల మేర కార్యకలాపాలను నమోదు చేసింది. రెవెన్యూ భారీగా పెరిగింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలానికి ఆ సంస్థ రికార్డు చేసిన ఆర్థిక కార్యకలాపాల విలువ 663 కోట్ల 90 లక్షల రూపాయలే. ఇందులో 64 శాతం మేర కంపెనీ కార్యకలాపాలు పెరిగాయి. ఫలితంగా నష్టాలు తగ్గాయి.
షేర్లు మరింత పతనం అవుతాయా?
సాధారణంగా- ఏదైనా కంపెనీకి సంబంధించిన త్రైమాసిక ఫలితాలు వెల్లడయిన తరువాత.. ఆ కంపెనీ షేర్లు కొద్దో, గొప్పో పతనమౌతుంటాయి. అదే పరిస్థితి పేటీఎం పేరెంట్ కంపెనీ వన్ 97 కమ్యూనికేషన్స్ విషయంలోనూ చోటు చేసుకోవడానికి అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే పేటీఎం షేర్లు మార్కెట్లో లోయర్ సర్కుట్లో ట్రేడ్ అవుతున్నాయి. ఒక్కో షేర్ ధర 2,150 రూపాయలతో పబ్లిక్ ఇష్యూను జారీ చేయగా.. లిస్టింగ్లోకి వచ్చిన తరువాత ఏ దశలోనూ ఆ ఫిగర్ను అందుకోలేకపోయిందా కంపెనీ.
లాస్లోనే షేర్లు..
లిస్టింగ్ సమయంలోనే 1,950 రూపాయలను నమోదు చేసింది. అప్పటి నుంచి డౌన్ గ్రాఫ్లోనే సాగుతోంది పేటీఎం షేర్ల ప్రయాణం. ఒకదశలో 1280 రూపాయల వరకు దిగజారింది. ఆ తరువాత కోలుకుంది. వరుసగా మూడు రోజుల పాటు అప్పర్ సర్కుట్లో ట్రేడ్ అవుతూ వచ్చింది. శుక్రవారం నాడు ముగిసిన ట్రేడింగ్ ప్రకారం.. పేటీఎం ఒక్కో షేర్ ప్రైస్ 1,765 రూపాయలుగా రికార్డయింది. కటాఫ్ ప్రైస్ను అందుకోవాలంటే ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది.