పేటీఎం యాప్ ద్వారా మొబైల్ ఫోన్ రీఛార్జ్ చేస్తున్నారా?: బీ అలర్ట్..
ముంబై: యాప్ బేస్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ పేటీఎ.. ప్రస్తుతం ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. నష్టాల్లో కొనసాగుతోంది. గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఏకంగా 761 కోట్ల రూపాయల మేర నష్టాలను చూపించిందీ ఫిన్టెక్. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలోనూ ఇంతకంటే మంచి ఫలితాలను నమోదు చేయలేకపోవచ్చనే అభిప్రాయాలు అప్పుడే మార్కెట్ వర్గాల నుంచి వినిపిస్తోన్నాయి కూడా.
దేశీయ పెట్రోల్, డీజిల్ రేట్లల్లో పెరుగుదల లేదు.. కానీ?: పదేళ్ల గరిష్ఠానికి క్రూడ్
అన్నీ నష్టాలే..
అటు బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో పేటీఎం షేర్ల ధరల ప్రయాణం సాఫీగా సాగట్లేదు. అక్కడా ఏ మాత్రం ఆశాజనకంగా ఉండట్లేదు పేటీఎం షేర్ల ధరలు. ఇన్వెస్టర్లకు 70 శాతం నష్టాలను పంచింది. పబ్లిక్ ఇష్యూను జారీ చేసిన సమయంలో 2,150 రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన ఒక్కో షేర్ ధర ప్రస్తుతం 600 రూపాయల కంటే దిగువకు పడిపోయింది. శుక్రవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి పేటీఎం షేర్ ధర 597 రూపాయల వద్ద ట్రేడింగ్ అయింది.
కొత్త ఎత్తులు..
ఇలాంటి గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోన్న పేటీఎం టాప్ మేనేజ్మెంట్.. తన యూజర్లకు కొత్త షాకులను ఇస్తోంది. నష్టాలను భర్తీ చేయడానికా అన్నట్లు అదనపు భారాన్ని మోపుతోంది. పేటీఎం యాప్ ద్వారా మొబైల్ ఫోన్ రీఛార్జ్ చేసుకున్న యూజర్ల నుంచి ఎక్స్ట్రా ఛార్జీలను వసూలు చేస్తోంది. యూపీఐ లేదా క్రెడిట్/డెబిట్ కార్డుల ద్వారా మొబైల్ రీఛార్జ్ చేసుకున్నా వడ్డింపులు తప్పట్లేదు.
లెవి పేరుతో..
ప్రత్యేకంగా లెవి పేరుతో అదనపు మొత్తాన్ని పిండుకుంటోంది. ప్రస్తుతతానికి కొంతమంది యూజర్ల నుంచి అంటే.. 100 రూపాయలు, అంత కంటే ఎక్కువ మొత్తంతో మొబైల్ రీఛార్జ్ చేసుకున్న వారి నుంచే ఎక్స్ట్రా ఛార్జ్ను వసూలు చేస్తోన్నట్లు గ్యాడ్జెట్స్ 360 వెబ్సైట్ వెల్లడించింది. భవిష్యత్లో ఇది మరింత విస్తరింపజేసే అవకాశం ఉందని అంచనా వేసింది.
2019లో హామీ ఇచ్చినా..
ఈ పరిస్థితుల మధ్య.. పేటీఎం యాజమాన్యం తన అధికారిక మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్పై పోస్ట్ చేసిన పాత ట్వీట్ ఒకటి ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది. 2019 జులై 1వ తేదీన చేసిన పోస్ట్ అది. ఎలాంటి లావాదేవీలకూ తాము ఎక్స్ట్రా ఛార్జీలను వసూలు చేయబోమంటూ అప్పట్లో హామీ ఇచ్చింది. క్రెడిట్/డెబిట్ కార్డ్, యూపీఐ, పేటీఎం వాలెట్.. ఇలా ఏ మెథడ్లో ట్రాన్సాక్షన్ చేసిన లెవీ ఉండదని తెలిపింది.
|
పేటీఎం వాలెట్లో..
ఇప్పుడు దీనికి భిన్నంగా అదనపు మొత్తాన్ని వసూలు చేస్తోన్నట్లు వినియోగదారులు చెబుతున్నారు. క్రెడిట్ కార్డ్ ద్వారా వాలెట్లోకి డబ్బులను బదలాయించినా.. అదనపు ఛార్జ్ను తీసుకుంటోంది పేటీఎం యాజమాన్యం. సంబంధిత క్రెడిట్ కార్డును జారీ చేసిన బ్యాంక్తో పాటు పేటీఎం కూడా రెండుశాతం మేర ఎక్స్ట్రా ఛార్జ్ను రాబట్టుకుంటోందనేది యూజర్ల వాదన. డెబిట్ కార్డ్ నుంచి వాలెట్కు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తే మాత్రం ఈ అదనపు ఛార్జీలు ఉండట్లేదు.