డిజిటల్ పేమెంట్ సేవలు అందించే ప్రముఖ కంపెనీ పేటీఎం కు కొత్త చిక్కొచ్చి పడింది. కంపెనీ ఫౌండర్ విజయ్ శేఖర్ శర్మ, వైస్ ప్రెసిడెంట్ అజయ్ శేఖర్ శర్మ లపై చీటింగ్ కేసు నమోదయింది. ఒక వినియోగదారుని బ్యాంకు ఖాతా నుంచి రూ 1.47 లక్షల రూపాయలు మాయం కావటంతో సదరు కస్టమర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఘజియాబాద్ పోలీసులు వీరిపై కేసు నమోదు చేశారు. ఈ వివరాలతో కూడిన ఒక ప్రత్యేక కథనం ది టైమ్స్ ఆఫ్ ఇండియాలో ప్రచురితమైంది. జీవనోపాధి కోసం ఆయుర్వేద మందులు విక్రయించే రాజ్ కుమార్ సింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సెక్షన్ 420, ఐటీ చట్టం లోని సెక్షన్ 66డీ ప్రకారం పేటీఎం ఉన్నతాధికారులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. తన నగదు గల్లంతు అవటానికి పేటీఎం బ్యాంకు కారణమని రాజ్ కుమార్ ఫిర్యాదు చేశారు. తన పేటీఎం ఖాతా వివాదాలతోనే తనను మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నాడు.

జరిగిందిలా..
వివరాల్లోకి వెళితే... గతేడాది డిసెంబర్ 28న పేటీఎం వైస్ ప్రెసిడెంట్ అజయ్ శేఖర్ శర్మ అంటూ రాజ్ కుమార్ సింగ్ కు ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. రాజ్ కుమార్ సింగ్ కాష్ బ్యాక్ గెలుచుకున్నాడని, దానికి సంబంధించిన ఒక లింక్ ను పేటీఎం బ్యాంకు నుంచి పంపిస్తామని చెప్పాడు. ఆ లింక్ ను ఓపెన్ చేయాలనీ సూచించాడు. పేటీఎం ఇలా అడగటం ఏమిటి అని సందేహంలో ఉన్న రాజ్ కుమార్ కు సదరు వ్యక్తి రాజ్ కుమార్ గతంలో పీటీఎం లో చేసిన కొన్ని లావాదేవీలు, బ్యాంకు అకౌంట్ నెంబర్ తదితర వివరాలు అన్నీ కరెక్ట్ గా చెప్పాడు. దీంతో విశ్వాసం కలిగిన రాజ్ కుమార్.. ఆ లింక్ పై క్లిక్ చేయగానే రూ 1.47 లక్షలు అకౌంట్ నుంచి మాయం అయ్యాయి. అంతే అవాక్కవటం రాజ్ కుమార్ వంతు అయ్యింది.

వారిని ప్రశ్నిస్తాం...
పేటీఎం తరఫున వినియోగదారుల డేటా ఎంత వరకు సురక్షితం అనే అంశాలతో పాటు, పేటీఎం బ్యాంకు ఆప్ లో ఏమైనా లోపాలు ఉన్నాయా అనే విషయాలపై పేటీఎం అధికారులను ప్రశ్నిస్తామని ఘజియాబాద్ పోలీస్ చీఫ్ కళానిధి నైతని వెల్లడించారు. ఆన్లైన్ పేమెంట్ సిస్టం వినియోగిస్తున్న వినియోగదారుల రక్షణ దృష్ట్యా ఇది చాలా సీరియస్ అంశం. వినియోగదారులకు సంబంధించిన సమాచారాన్ని సురక్షితంగా ఉంచాల్సిన బాధ్యత ఇలాంటి కంపెనీలపై ఉంది అని పేర్కొన్నారు. అయితే ఈ అంశంపై స్పందించిన పేటీఎం వైస్ ప్రెసిడెంట్ తమపై వచ్చిన ఫిర్యాదులు ఆధార రహితమని కొట్టిపడేశారు. వినియోగదారుని వివరాలు ఎలా వెల్లడయ్యాయి అనే అంశాలు పోలిసుల విచారణలో తేలుతుందని చెప్పారు. అన్ని విషయాలు విచారణలో బహిర్గతం అవుతాయని పేర్కొన్నారు.

పేటీఎం వివరణ...
పేటీఎం సంస్థ ఒక ప్రకటనలో వినియోగదారులకు వివరణ ఇచ్చింది. వినియోగదారుల కేవైసీ వివరాలు తెలపాలని పేటీఎం నుంచి ఎవరు కూడా ఫోన్లు చేయరని స్పష్టం చేసింది. ఇదిలా ఉంచితే.. ఒక్క పేటీఎం అని కాదు కానీ ఇటీవల ఈ ఆన్లైన్ లింకుల గోల కస్టమర్లకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఏదో ఒక నమ్మకమైన బ్రాండ్ పేరుతో వినియోగదారులను నమ్మించి లింక్ ను క్లిక్ చేసేలా చేస్తున్నారు. అమాయక కస్టమర్లు వాటిని క్లిక్ చేయగానే .. వారి అకౌంట్లలో ఎంత నగదు ఉంటే అంతా మాయం అయిపోతోంది. కాబట్టి, పేటీఎం తో సహా ఏ ఇతర కంపెనీలు, బ్యాంకుల పేర్లు చెప్పి ఏవో లింకులు ఓపెన్ చేయమంటే ఎట్టిపరిస్థితి లోనూ చేయకూడదు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి... మీ డబ్బును కాపాడుకోండి.


Click it and Unblock the Notifications