Paytm's IPO: తండ్రి వద్దన్నా... ఇప్పుడు ఆ ఉద్యోగి కోటీశ్వరుడు
ప్రముఖ ఫిన్ టెక్ సంస్థ పేటీఎం ఐపీవో ఆ సంస్థలోని వందల మంది ఉద్యోగులను, మాజీ ఉద్యోగులను మిలియనీర్లుగా చేస్తోంది. దాదాపు 350 మంది ఉద్యోగుల ఆస్తి కనీసం రూ.1 కోటికి చేరుకుంటుందని తెలుస్తోంది. పేటీఎం ఐపీవోకు ఇటీవల మంచి స్పందన లభించింది. నవంబర్ 18వ తేదీన కంపెనీ మార్కెట్లో లిస్ట్ కానుంది. పేటీఎం రూ.18,300 కోట్లతో ఐపీవోకు వచ్చింది. ఇందులో ఆఫర్ ఫర్ సేల్ రూ.10వేల కోట్లు. ఒక్కో షేర్ ధరను రూ.2150గా కేటాయించారు. షేర్ అత్యధిక ధరను పరిగణలోకి తీసుకొని కంపెనీ వ్యాల్యూను రూ.1.39 లక్షల కోట్లుగా లెక్కించారు.
ఈ ఐపీవోకు 1.89 రెట్లు అధికంగా బిట్స్ దాఖలు అయ్యాయి. ఈ ఐపీవో కోసం పేటీఎం లీగల్ పార్టునర్స్, బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లకు, సలహాదారులకు ఫీజు మొత్తాల వివరాలను విడుదల చేసింది. బీఆర్ఎల్ఎంకు రూ.323.9 కోట్లను చెల్లిస్తుంది. ఇది ఐపీవో సైజులో 1.8 శాతానికి సమానం. మోర్గాన్ స్టాన్లీ, గోల్డ్మన్ శాక్స్, యాక్సిస్ క్యాపిటల్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, జేపీ మోర్గాన్, సిటీ, HDFC బ్యాంకులను బీఆర్ఎల్ఎంలుగా నియమించింది.
వీరి సంపద రూ.1 కోటి దాటవచ్చు
ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఇది అతిపెద్ద ఐపీవో. ప్రపంచంలోనే 2021 క్యాలెండర్ ఏడాదిలో వచ్చిన రెండో అతిపెద్ద ఐపీవో. అతిపెద్ద ఐపీవో స్పెయిన్ కు చెందిన ఆల్ ఫండ్స్ ది. అంతేకాదు, ప్రపంచంలోనే ఐపీవోకు వచ్చిన నాలుగో అతిపెద్ద ఫిన్ టెక్ కంపెనీ పేటీఎం. నవంబర్ 18వ తేదీన పేటీఎం స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవుతుంది. అప్పుడు భారత్లో కొత్తగా 350 మంది వరకు కోటీశ్వరులుగా మారనున్నారు. వీరంతా పేటీఎం ఉద్యోగులు, మాజీ ఉద్యోగులు. ఇందుకు ప్రధాన కారణం వీరికి పేటీఎంలో పెద్ద ఎత్తున షేర్లు ఉండటం. కంపెనీ కేటాయించిన రూ.2150 లెక్కన వీరి సంపద రూ.1 కోటి దాటవచ్చు.
ఉద్యోగి అనుభవం
ఈ కంపెనీ ఉద్యోగి, ఇండియన్ ఎలక్ట్రానిక్ ఇంజినీర్ సిద్ధార్థ పాండే ఇప్పుడు కోటీశ్వురుడు కానున్నారు. తొమ్మిదేళ్ల క్రితం తన తండ్రి ఈ కంపెనీలో తన చేరికపై అసంతృప్తి వ్యక్తం చేశారని తన అనుభవాన్ని పంచుకున్నారు. తండ్రి మాట కాదని ఆయన కంపెనీలో కొనసాగారు.
తాను పేటీఎంలో పని చేస్తున్నానని తెలిసి తన తండ్రి నిరాశపడ్డారని, ఈ పేటీఎం ఏంటి అని అడిగారని, కానీ ఇప్పుడు సంతోషంగా ఉన్నారని చెబుతున్నారు. అంతేకాదు ఇప్పుడు మాట్లాడుతూ అందులోనే ఉండిపో అని చెబుతున్నారన్నారు. అయితే ప్రస్తుతం సిద్ధార్థ పాండే పేటీఎంను వదిలి మరో స్టార్టప్ లో వర్క్ చేస్తున్నారు. అయితే అందులో షేర్లున్నాయి.
ఆస్తి మిలియన్ దాటుతుందని
ఈ 39 ఏళ్ల ఉద్యోగి పేటీఎంలో తన ఆర్థిక సంబంధ వివరాలు ఇవ్వడం లేదని తెలుస్తోంది. అయితే రానున్న రోజుల్లో తన ఆస్తి మిలియన్ దాటుతుందని మాత్రం చెబుతున్నారట. పేటీఎ ఉద్యోగులు, మాజీ ఉద్యోగులు ఆస్తి రూ.1 కోటి దాటనుండటం గమనార్హం. భారత్లో తలసరి ఆదాయం రూ.2000 డాలర్లు లేదా రూ.1,48,000. ఈ రివార్డ్ మాత్రం 134,401.38 డాలర్లు లేదా రూ.1 కోటి. ఇలాంటి తలసరిలో ఈ రివార్డ్ చాలా ఎక్కువ కావడం గమనార్హం.