PayMate IPO: పేటీఎం ఒక్కటే కాదు..పబ్లిక్ ఇష్యూకు బీ2బీ సర్వీస్ ప్రొవైడర్
ముంబై: ముంబైని ప్రధాన కేంద్రంగా చేసుకుని దేశవ్యాప్తంగా బిజినెస్ టు బిజినెస్ లావాదేవీలను నిర్వహిస్తోన్న పేమెట్ ఇండియా.. పబ్లిక్ ఇష్యూ (PayMate IPO)కు రానుంది. ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ను జారీ చేయడానికి అవసరమైన ప్రతిపాదనలను సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డ్కు సమర్పించింది. 1,500 కోట్ల రూపాయలను ఐపీఓ ద్వారా సమీకరించుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు సెబికి అందజేసిన తన డ్రాఫ్ట్ రెడ్ హర్రెంట్ ప్రాస్పెక్టస్లో పొందుపరిచింది.
ఆఫర్ ఫర్ సేల్ ద్వారా 375 కోట్ల రూపాయలు, పబ్లిక్ ఇష్యూను జారీ చేయడం ద్వారా మరో 1,125 కోట్ల రూపాయలను సమీకరించుకోవాలని పేమెట్ ఇండియా నిర్ణయించుకుంది. తాను జారీ చేయబోయే పబ్లిక్ ఇష్యూల్లో 75 శాతాన్ని క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ బయ్యర్స్ కోసం కేటాయించింది. మరో 15 శాతం పబ్లిక్ ఇష్యూలను నాన్ ఇన్స్టిట్యూటషన్ క్వాలిఫైడ్ బిడ్డర్స్ కోసం రిజర్వ్ చేసింది. మిగిలిన 10 శాతం రిటైల్ ఇన్వెసర్టకు లభిస్తుంది.
225 కోట్ల రూపాయల విలువ చేసే ఈక్విటీ షేర్లను ప్రైవేట్ ప్లేస్మెంట్స్ ద్వారా సేకరించాలని భావిస్తున్నట్లు పేర్కొంది. అదే జరిగితే- ఐపీఓ ద్వారా సేకరించదలిచిన మొత్తం కొంత తగ్గొచ్చు. ఇన్వెస్టర్ల నుంచి సమీకరించిన మొత్తంలో 77 కోట్ల రూపాయలను తన వ్యాపార కార్యకలాపాలను మరింత విస్తరింపజేసుకోవడానికి వినియోగిస్తామని పేమెట్ ఇండియా యాజమాన్యం తెలిపింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది.
ఆఫర్ ఫర్ సేల్కు ఉంచిన వాటిల్లో ప్రమోటర్ షేర్ హోల్డర్స్ అజయ్ ఆదిశేషన్ వాటా 134.73 కోట్ల రూపాయలు. మరో ప్రమోటర్ విశ్వనాథన్ సుబ్రమణియన్ వాటా 3.29 కోట్ల రూపాయలు. సంస్థలో ఇదివరకే పెట్టుబడులు పెట్టిన లైట్బాక్స్ వెంచర్స్కు చెందిన షేర్ల విలువ 127.38 కోట్లను కూడా ఆఫర్ ఫర్ సేల్కు ఉంచనుంది. మరో 15.66 కోట్ల రూపాయల విలువ చేసే ఈక్విటీలు మేఫీల్డ్ ఎఫ్వీసీఐ లిమిటెడ్కు చెందినవి.
కాగా- పబ్లిక్ ఇష్యూ కార్యకలాపాలను పర్యవేక్షించడం, బుక్ రన్నింగ్ మేనేజ్మెంట్స్ వ్యవహారాల కోసం ఏజెన్సీలను కూడా అపాయింట్ చేసినట్లు తెలిపింది. ఐసీఐసీఐ సెక్యూరిటీస్ లిమిటెడ్, హెచ్ఎస్బీసీ సెక్యూరిటీస్ అండ్ కేపిటల్ మార్కెట్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్, జేఎం ఫైనాన్షియల్ లిమిటెడ్, ఎస్బీఐ కేపిటల్ మార్కెట్స్ లిమిటెడ్ను నియమించుకుంది. షేర్ ప్రైస్ బ్యాండ్, ఇతర కీలక తేదీల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది. సెబి నుంచి అనుమతి లభించిన వెంటనే పూర్తి సమాచారాన్ని తెలియజేస్తామని పేర్కొంది.