దివాలాలో ఉన్న రుచి సోయా సంస్థను కొనుగోలు చేసే విషయంలో బాబా రామ్దేవ్, ఆచార్య బాలకృష్ణన్ నేతృత్వంలోని పతంజలి ఆయుర్వేద్ సంస్థకు మార్గం సుగమమైంది. ఈ కొనుగోలుకు సంబంధించి ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం నుంచి పతంజలి సంస్థ రూ.3,200 కోట్ల రుణాలు పొందింది. ఈ మేరకు ఇప్పటికే పతంజలి ఆయుర్వేద్ కంపెనీ సమర్పించిన రిజల్యూషన్ ప్లాన్ను నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్(ఎన్సీఎల్టీ) కూడా ఆమోదించింది.
దివాలా ప్రణాళిక ప్రకారం.. పతంజలి ఆయుర్వేద్ గ్రూప్ రూ.204.75 కోట్లను రుచి సోయాలో పెట్టుబడిగా పెడుతుంది. అలాగే ఈ సంస్థపై ఉన్న రుణాల చెల్లింపునకు కూడా రూ.3,233.36 కోట్లు వెచ్చించనుంది. పతంజలి కన్సార్టియం అయిన అధిగ్రహణ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా ఈ నిధులను పెట్టుబడిగా పెట్టి, ఆ తరువాత దానిని రుచి సోయా సంస్థలో కలిపేయనున్నారు.

రుచి సోయా కొనుగోలు కోసం అవసరమైన నిధులను పతంజలి ఇప్పటికే వివిధ బ్యాంకుల నుంచి రుణాల ద్వారా సమకూర్చుకుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.1,200 కోట్ల రుణాన్ని, అలాగే పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి రూ.700 కోట్లు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.600 కోట్లు, సిండికేట్ బ్యాక్ నుంచి రూ.400 కోట్లు, అలహాబాద్ బ్యాంక్ నుంచి రూ.300 కోట్ల రుణాలు పొందింది.
రుచి సోయా సంస్థ కొనుగోలు విషయమై పతంజలి ఆయుర్వేద్ మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణన్ మాట్లాడుతూ.. తాము ఇప్పటికే రుచి సోయా సంస్థ కొనుగోలుకు అవసరమైన నిధులను సమకూర్చుకున్నామని, వీటిని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్టియం నుంచి పొందామని వెల్లడించారు.


Click it and Unblock the Notifications