9 నెలల్లో 46% పెరిగిన పాసింజర్ వెహికిల్ ఎగుమతులు: మారుతీ అదుర్స్
20201-22 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-డిసెంబర్ కాలంలో భారత్ నుండి పాసింజర్ వెహికిల్ సేల్స్ 46 శాతం పెరిగి 4,24,037 యూనిట్లకు చేరాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే సమయంలో 2,91,170 వాహనాలు ఎగుమతి అయ్యాయి. ఈ మేరకు పరిశ్రమ సంఘం SIAM తెలిపింది. పాసింజర్ వెహికిల్ కార్లు 45 శాతం పెరిగి 2,75,728కి, వినియోగ వాహనాలు 47 శాతం వృద్ధి నమోదు చేసి 1,46,688 ఎగుమతి అయ్యాయి. వ్యాన్ల ఎగుమతులు 877 నుండి దాదాపు రెట్టింపయి 1621కి పెరిగాయి. కంపనీల వారీగా చూస్తే మారుతీ సుజుకీ ఇండియా 1.68 లక్షల వాహనాల ఎగుమతితో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత హ్యుండాయ్ మోటార్ ఇండియా, కియా నిలిచాయి.
మారుతీ ఎగుమతులు 58,821 నుండి మూడు రెట్లు పెరిగి 1,67,964కు, హ్యుండాయ్ ఎగుమతులు 35 శాతం పెరిగి 1,00,059గా నమోదయ్యాయి. కియా ఇండియా ఎగుమతులు 28,538 నుండి 25 శాతానికి పైగా పెరిగి 34,341గా నమోదయ్యాయి. వోక్స్ వాగన్ ఎగుమతులు ఏప్రిల్-డిసెంబర్ కాలంలో 29,769గా నిలిచాయి.
త్రైమాసికం ప్రాతిపదికన చూస్తే అక్టోబర్-డిసెంబర్ కాలంలో పాసింజర్ వెహికిల్ సేల్స్ 1,36,016 (2020-21 అక్టోబర్-డిసెంబర్ కాలం) నుండి గత త్రైమాసికంలో 1,39,363కు పెరిగాయి. డిసెంబర్ నెలలో మొత్తం పాసింజర్ వెహికిల్ షిప్మెంట్స్ మాత్రం ఏడాది ప్రాతిపదికన 57,050 నుండి 54,846కు తగ్గాయి.
మారుతీ సుజుకీ ఇండియా వీటితో పాటు 1958 సూపర్ క్యారీ (LCV) యూనిట్లను కూడా గత తొమ్మిది నెలల్లో ఎగుమతి చేసింది. మారుతీ సుజుకీ ఇండియా లాటిన్ అమెరికా, ఏషియన్, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ పరిసర దేశాలకు ఎగుమతి చేస్తోంది. టాప్ ఫైన్ ఎక్స్పోర్ట్ మోడల్స్లో బాలెనో, డిజైర్, స్విఫ్ట్, ఎస్ ప్రెస్సో, బ్రెజ్జా ఉన్నాయి.