భారీగా పడిపోయిన PV సేల్స్, ఏ వాహనాలు ఎంత తగ్గాయంటే: దసరాకు పెరిగినా.. కాపాడలేదు
అక్టోబర్ నెలలో పాసింజర్ వాహనాల (PV) విక్రయాలు ఏడాది ప్రాతిపదికన దాదాపు 9 శాతం మేర క్షీణించి, 2,49,860 యూనిట్లకు పరిమితమైనట్లు ఆటోమొబైల్ డీలర్స్ బాడీ ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (FADA) తెలిపింది. 1464 రీజినల్ ట్రాన్సుపోర్ట్ కార్యాలయాలు (RTO) ఉండగా 1257 కార్యాలయాల నుండి వచ్చిన వెహికిల్ రిజిస్ట్రేషన్ డేటా ప్రకారం పాసింజర్ వెహికిల్ సేల్స్ 2019లో 2,73,980 యూనిట్లు ఉండగా, ఇప్పుడు 2.50 లక్షల దిగువకు పడిపోయాయి.
రూ.30 లక్షలకు సైబర్ దాడి, బిగ్ బాస్కెట్లో 2 కోట్ల మంది డేటా లీక్: క్రెడిట్ కార్డు వివరాల్లేవ్!
ఏ వాహనాల సేల్స్ ఎంత తగ్గాయంటే
అక్టోబర్ నెలలో టూవీలర్ సేల్స్ 26.82 శాతం క్షీణించి 10,41,682 యూనిట్లు విక్రయించారు. గత ఏడాది ఇదే అక్టోబర్ నెలలో ఇది 14,23,394 యూనిట్లుగా ఉంది.
కమర్షియల్ వెహికిల్ సేల్స్ 30.32 శాతం క్షీణించి 2019లో 63,837 యూనిట్లు ఉండగా, ఈసారి 44,480 యూనిట్లకు పడిపోయింది.
త్రీవీలర్ సేల్స్ ఏకంగా 64.5 శాతం క్షీణించి గత ఏడాది ఉన్న 63,042 యూనిట్ల నుండి ఈ అక్టోబర్ నెలలో 22,381 యూనిట్లకు పడిపోయాయి.
అయితే ట్రాక్టర్ సేల్స్ మాత్రం 55 శాతం పెరిగి గత ఏడాది 35,456 యూనిట్ల నుండి ఇప్పుడు 55,146 యూనిట్లకు పెరిగాయి.
మొత్తం వాహనాల సేల్స్ 23.99 శాతం క్షీణించి గత ఏడాది 18,59,709 నుండి ఇప్పుడు 14,13,549 యూనిట్లకు తగ్గాయి.
కొత్తగా లాంచ్ అయిన వాహనాల సేల్స్ బాగున్నాయి
FADA ప్రెసిడెంట్ వింకేష్ గులాటీ మాట్లాడుతూ.. దసరా, నవరాత్రి నేపథ్యంలో ఆటో సేల్స్ భారీగా పెరిగినట్లు రిజిస్ట్రేషన్లు వెల్లడిస్తున్నాయని, కానీ అక్టోబర్ నెలను మాత్రం ఇది ఆదుకోలేకపోయిందన్నారు. గత ఏడాది నవంబర్, దీపావళి సమయంతో పోలిస్తే ఈసారి సేల్స్ తగ్గాయన్నారు. అయితే సెప్టెంబర్ నెలతో పోలిస్తే మాత్రం ఆటో విక్రయాలు పెరిగాయి.
కాగా, కొత్తగా లాంచ్ అయిన పాసింజర్ వెహికిల్ సేల్స్కు డిమాండ్ కనిపిస్తోందని, టూ, త్రీవీలర్ సెగ్మెంట్లో ఎంట్రీ లెవల్ వాహనాల విక్రయాలు పెరిగాయన్నారు.
ప్రధానంగా భారీగా సేల్ అయ్యే వాహనాల స్టాక్ పరిమితంగా ఉండటం, అంతగా ఆకట్టుకోని వాహనాలు ఉండటం వంటి పలు కారణాలతో సేల్స్ తగ్గినట్లు వెల్లడించారు. డిస్కౌంట్లు కూడా ప్రభావం చూపాయని చెప్పారు.
వరుసగా దెబ్బ
గత ఏడాది ఆర్థిక మందగమనం కారణంగా సేల్స్ క్షీణించాయి. ఈ ఏడాది కరోనా ప్రభావం మరింత దెబ్బతీసింది. ప్రధానంగా ఆటో డీలర్లు పండుగపై ఆశలు పెట్టుకున్నారు. పండుగ సమయంలో సేల్స్ పెరిగినప్పటికీ, మొత్తంగా నెలలో మాత్రం గత ఏడాదితో పోలిస్తే పెరగలేదు. మార్చి చివరి వారం నుండి 80 రోజులకు పైగా లాక్ డౌన్ విధించారు. దీంతో ఆర్థిక కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. మే, జూన్ నెలల నుండి క్రమంగా కోలుకుంటున్నాయి.