'పన్ను తగ్గింపు'కు ఇలా చెక్, జీఎస్టీ స్లాబ్స్ 2 చాలు: బంగారంపై మరింత పన్ను!
జీఎస్టీ స్లాబ్లను మార్చాలా? అంటే అవుననే అంటున్నారు నీతి అయోగ్ సభ్యులు రమేష్ చాంద్. ప్రస్తుతం ఉన్న జీఎస్టీ స్లాబ్స్ 5, 12, 18, 28 శాతం ఉన్నాయి. ఇవి కాకుండా కొన్నింటికి జీరో జీఎస్టీ వర్తిస్తుంది. ప్రస్తుతం ఉన్న వివిధ రకాల పన్ను రేట్లు కాకుండా కేవలం రెండు స్లాబ్స్ సరిపోతాయని ఆన అభిప్రాయపడ్డారు. తరుచూ పన్ను రేట్లను సవరించడం సరికాదని, అవసరమైతే సంవత్సరానికి ఓసారి మార్పులు చేయాలన్నారు.
SBI సహా ఈ ఐదింటిలో రూ.10,000 ఇన్వెస్ట్ చేస్తే రూ.48,000!!
జీఎస్టీ కుదురుకోవడానికి సమయం
జీఎస్టీ లాంటి అతిపెద్ద పన్నుల సంస్కరణను తీసుకు వచ్చినప్పుడు బాలారిష్టాలు తప్పవని రమేష్ చాంద్ అన్నారు. త్వరలో ఈ సమస్యలు సర్దుకుంటాయని చెప్పారు. ఎన్నో దేశాల్లో జీఎస్టీ కుదురుకోవడానికి చాలా ఎక్కువ సమయం తీసుకుందనే విషయం అందరూ గుర్తించాలన్నారు.
మార్చడం కాదు.. సమస్యలపై దృష్టి సారించాలి
జీఎస్టీ రేట్లను తరుచూ మారిస్తే కొత్త సమస్యలు వస్తాయని రమేష్ చాంద్ అన్నారు. జీఎస్టీ రేట్లు తగ్గించాలని వివిధ రంగాలకు చెందిన వారు అడగడం ఓ ప్రహసనంగా మారిందన్నారు. జీఎస్టీ రేట్లను తగ్గించడం కంటే జీఎస్టీ వల్ల ఎదురవుతున్న సమస్యలపై ప్రస్తుతం దృష్టి సారించాలని అభిప్రాయపడ్డారు.
రెండు స్లాబ్స్ ఉంటే చెక్ పెట్టవచ్చు
తమ రంగంలో పన్నులు తగ్గించాలనే డిమాండ్లు ఎప్పుడూ వస్తుంటాయని, దీంతో రెండు స్లాబ్స్ ఉంటే పన్నులు తగ్గించాలనే డిమాండ్లకు చెక్ పెట్టవచ్చని ఆయన అన్నారు. రేట్లు సవరించాల్సి వస్తే ఏడాదికోసారి మార్చితే చాలని చెప్పారు. కాగా, 15వ ఆర్థిక సంఘంలో రమేష్ చాంద్ సభ్యుడిగా ఉన్నారు. ఈయన వ్యవసాయ ఆర్థికవేత్త. ఒక వ్యవసాయ రంగానికే రూ.1.2 లక్షల కోట్ల రాయితీని కేంద్రం ఇస్తోందని, రాష్ట్రాలన్నీ దాదాపు రూ.1 లక్ష కోట్లు ఖర్చు చేస్తున్నాయని చెప్పారు.
ఇప్పుడున్న స్లాబ్స్ స్థానంలో 10 శాతం, 20 శాతం పన్ను రేట్లతో రెండు చాలని కూడా జీఎస్టీ రాబడి పెంచేందుకు అవసరమైన సూచనలు చేసేందుకు ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ ఓటేసింది.
ఆహార ఉత్పత్తులపై 5 శాతం ఓకే
పాల ఉత్పత్తుల వంటి ఆహార ఉత్పత్తులపై జీఎస్టీ భారం తగ్గించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీనిపై రమేష్ స్పందించారు. వాటిపై 5 శాతం జీఎస్టీ ఆమోదయోగ్యమే అన్నారు.
బంగారంపై సహా వీటిపై పెంచాలి
బంగారంపై ప్రస్తుతం ఉన్న 3 శాతం జీఎస్టీని 5 శాతానికి పెంచాలని కూడా అధికారుల కమిటీ సూచించింది. మొబైల్ ఫోన్స్, ఔషధాలు, రెడీమేడ్ గార్మెంట్స్, కృత్రిమ దారాలు, వస్త్రాలపై జీఎస్టీ భారం పెంచాలని పేర్కొంది. ప్రస్తుతం వీటితో పోలిస్తే వీటి తయారీకి అవసరమైన ముడి పదార్థాలు, విడి భాగాలపై జీఎస్టీ భారం ఎక్కువగా ఉందని గుర్తు చేసింది. ఈ లోపాన్ని సరిదిద్దేందుకు తుది ఉత్పత్తులపై జీఎస్టీ పన్ను భారం పెంచాలని సిఫార్సు చేసింది.