కరోనా వల్ల భారత కుటుంబాలు కోల్పోయిన ఆదాయం రూ.13 లక్షల కోట్లు
కరోనా మహమ్మారి కారణంగా భారత్లోని హౌస్ హోల్డ్ ఆదాయం రూ.13 లక్షల కోట్లు తుడిచిపెట్టుకుపోయి ఉంటుందని ఓ నివేదిక వెల్లడించింది. ప్రధానంగా ఉద్యోగాల కోత వల్ల ఎక్కువ ప్రభావం పడినట్లు వెల్లడించింది. 2020 మిడిల్ నాటికి ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంటుందని అంచనా వేసింది. ఇటీవల కొద్ది నెలల పాటు వినియోగ డిమాండ్ తగ్గిపోవడం వల్ల ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడిందని తెలిపింది. ఈ మేరకు యూబీఎస్ సెక్యూరిటీస్ అంచనా వేసింది. FY21 మూడు, నాలుగో త్రైమాసికాల్లో వృద్ధి రేటు కాస్త సానుకూలంగా ఉంటుందని వెల్లడించింది. ఇంత వేగంగా వృద్ధి పునరుద్ధరణ ఆశ్యర్యకరమని తెలిపింది.
GST పరిధిలోకి వస్తే పెట్రోల్ రూ.75, డీజిల్ రూ.68! కానీ నేతలు సిద్ధంగా లేరు
డిమాండ్ మళ్లీ మందగించేఅవకాశం
మార్కెట్లో కన్సంప్షన్ డిమాండ్ మళ్లీ మందగించే అవకాశాలు ఉన్నాయని, దీంతో ఈ ఏడాది జూన్ నాటికి ఆర్థిక వ్యవస్థ జోరు తగ్గవచ్చునని కూడా యూబీఎస్ సెక్యూరిటీస్ హెచ్చరించింది. కరోనా కట్టడికి విధించిన దేశవ్యాప్త లాక్డౌన్ కారణంగా 2020 జూన్ నెలతో ముగిసిన మొదటి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు మైనస్ 23.9 శాతానికి పతనం కాగా, సెప్టెంబర్ త్రైమాసికంలో మైనస్ 7.5 శాతానికి పరిమితమైంది. డిసెంబర్ త్రైమాసికంలో 0.4 శాతం వృద్ధిని నమోదు చేసింది.
పెట్టుబడుల ప్రభావం
రెండో త్రైమాసికం, మూడో త్రైమాసికాల్లో వృద్ధి రికవరీ నిలకడగా కొనసాగడంతో పాటు భవిష్యత్తు వృద్ధి పూర్తిగా కొత్త పెట్టుబడుల పునరుద్ధరణ, ఆర్థిక సేవల రంగాలపై ఒత్తిడి తగ్గుదలపై ఆధారపడి ఉందని తెలిపింది. లాక్డౌన్ సడలింపుల అనంతరం మార్కెట్లో వినియోగం, పెట్టుబడులు అనూహ్యంగా పెరిగాయని, దీంతో వృద్ధి పునరుద్ధరణ కనిపించిందని వెల్లడించింది. ఇందులో చాలావరకు లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన పెట్టుబడులేనని తెలిపింది.
రియాల్టీ జూమ్
మరోవైపు, తక్కువ వడ్డీకి హోం లోన్ లభించడం, ప్రోత్సాహకాలు, లాక్ డౌన్ అనంతరం ఒక్కసారిగా రియాల్టీ వంటి రంగాలు పుంజుకోవడం ప్రగతికి చోదకాలుగా మారాయని తెలిపింది. గత ఏడాది ఇళ్ల విక్రయాలు 2019తో పోలిస్తే 31 శాతం క్షీణించాయని తెలిపింది. కరోనాకు ముందు 72 శాతంగా ఉన్న దేశ రుణ జీడీపీ నిష్పత్తి 2021-22లో 90 శాతానికి పెరగనుంది.