Pakistan Crisis: పరిశ్రమలపై కొత్త సూపర్ టాక్స్ తెచ్చిన పాక్ ప్రధాని.. భారీగా క్రాష్ అయిన స్టాక్ మార్కెట్లు..
Pakistan Crisis: పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ క్షీణిస్తోంది. అక్కడి గత పాలకుల తప్పులు ప్రజలకు మోయలేని భారాలను కలిగిస్తున్నాయి. దీంతో దిక్కుతోచని స్థితిలోకి వెళ్లిన దాయాది కొత్త పన్నులను ప్రవేశపెడుతోంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణం మధ్య పాకిస్తాన్ లోని పేదలను ఆదుకునేందుకు, ఆదాయాలను పెంచుకునేందుకు ఆ దేశం తీవ్రంగా శ్రమిస్తోంది. ఇందులో భాగంగా పాక్ కొత్త ప్రధాని షెహబాజ్ షరీఫ్ భారీ పరిశ్రమలపై 10% "సూపర్ టాక్స్" విధిస్తున్నట్లు ప్రకటించినట్లు జూన్ 24న డాన్ వార్తా సంస్థ నివేదించింది.
ఏఏ రంగాలు ప్రభావితమౌతాయంటే..
పాక్ ప్రధాని తీసుకున్న నిర్ణయం కారణంగా.. సిమెంట్, ఉక్కు, చక్కెర, చమురు, గ్యాస్, ఎరువులు, LNG టెర్మినల్స్, టెక్స్టైల్, బ్యాంకింగ్, ఆటోమొబైల్, సిగరెట్ల వ్యాపారంలో ఉన్న అనేక కంపెనీలు తీవ్రంగా ప్రభావితం కానున్నాయని తెలుస్తోంది. దేశాన్ని 'తీవ్ర ప్రమాదాల' నుంచి కాపాడేందుకు సంకీర్ణ ప్రభుత్వం 'ధైర్య' నిర్ణయాలు తీసుకుందని జాతిని ఉద్దేశించి షరీఫ్ ప్రసంగించారు.
ప్రధాని ప్రకటనతో మార్కెట్లు క్రాష్..
పాక్ ప్రధాని ప్రకటన తర్వాత పాకిస్తాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (PSX) ట్రేడింగ్ సమయంలో దాదాపు 2000 పాయింట్లకు పైగా క్రాష్ అయ్యింది. పాకిస్తాన్ అధికారులు ఇప్పటివరకు ఇంధన ధరలు, విద్యుత్ టారిఫ్లు, పన్నులు పెంచారు. రుణ అవసరాలను తీర్చడానికి పొదుపు చర్యలను కూడా ప్రారంభించింది. IMF నుంచి వచ్చే నిధులు రానున్న కాలంలో డిఫాల్ట్ను నివారించడంలో సహాయపడతాయి. ఇతర బహుపాక్షిక సంస్థలు, మిత్ర దేశాల నుంచి మరింత సహాయానికి మార్గం సుగమం కానున్నట్లు తెలుస్తోంది. రుణాన్ని తిరిగి చెల్లించడానికి, దిగుమతులకు నిధుల కోసం పాకిస్తాన్కు రాబోయే 12 నెలల్లో కనీసం 41 బిలియన్ డాలర్లు అవసరం ఉందని తెలుస్తోంది.
అడుగంటిన మారక నిల్వలు..
పాకిస్తాన్ విదేశీ మారక నిల్వలు 10 బిలియన్ డాలర్ల దిగువకు పడిపోయాయి. ఇవి రెండు నెలల కంటే తక్కువ దిగుమతులను కవర్ చేయడానికి సరిపోతాయి. పాక్ లో ద్రవ్యోల్బణం రెండేళ్ల కంటే ఎక్కువ గరిష్ఠాలకు చేరుకోవటంతో కరెన్సీ విలువ 17 శాతం మేర తగ్గింది. అయితే ఐఎమ్ఎఫ్ సహాయం కోసం పాక్ చేస్తున్న చర్యలు సరిపోకపోవచ్చని సిటీ గ్రూప్ అంటనాలు చెబుతున్నాయి.