Pakistan Crisis: కిలో టమాటా రూ.500, ఉల్లి రూ.400.. శ్రీలంక తర్వాత దారుణంగా పాక్ పరిస్థితి.. భారత సాయం..
Pakistan Crisis: పాకిస్తాన్ ను ఒకపక్క వరదలు వణికిస్తుండగా.. మరోపక్క ద్రవ్యోల్బణం కారణంగా ధరలు ఆకాశానికి చేరుకున్నాయి. అక్కడి ప్రజలకు ఉల్లిపాయలు కోయకుండానే కన్నీళ్లు వస్తున్నాయి. శ్రీలంక తరువాత అదే మార్గంలో దాయాది దేశ ఆర్థిక వ్యవస్థ ప్రయాణిస్తోంది. వరదల్లో అన్నీ పోగొట్టుకుని నిలువ నీడలేని వారిని ప్రస్తుతం ఆకలి కేకలు వెంటాడుతున్నాయి.
భారత్ నుంచి దిగుమతి ప్రయత్నాలు..
లాహోర్, ఇస్లామాబాద్తో సహా అనేక పెద్ద నగరాల్లో కూరగాయలు, పండ్ల ధరలు భారీగా పెరిగాయి. దీంతో ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం భారత్ నుంచి ఉల్లిపాయలు-టమోటాలను దిగుమతి చేసుకోవాలని యోచిస్తోంది. వరదల కారణంగా పంటలు నష్టపోవటం, డిమాండ్ కు తగినట్లుగా సరఫరా లేకపోవటం వల్ల రిటైల్ ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఆహార ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకింది.
దిమ్మతిరిగే రేట్లు..
లాహోర్ మార్కెట్లో ఆదివారం టమాటా కిలో రూ.500, ఉల్లి కిలో రూ.400కు అమ్ముడయ్యాయి. కొన్ని చోట్ల కిలో రూ.700 వరకు చేరుకుంది. హోల్ సేల్ మార్కెట్లో ధర రూ.100 వరకు ఉన్నప్పటికీ.. రిటైల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఏకంగా 5-6 రెట్లు అధికంగా ఉన్నాయి. బలూచిస్థాన్, సింధ్, దక్షిణ పంజాబ్ల్లో వరదల వల్ల రానున్న రోజుల్లో ధరలు మరింతగా పెరుగుతాయని తెలుస్తోంది. నిత్యావసరాల్లో ఒకటైన బంగాళదుంపల ధరలు కూడా కిలో రూ.40 నుంచి రూ.120కి పెరిగాయని వ్యాపారులు చెబుతున్నారు.
వాఘా సరిహద్దు నుంచి..
ప్రస్తుతం లాహోర్, పంజాబ్తో పాటు ఇతర నగరాల సరిహద్దు ద్వారా ఆఫ్ఘనిస్తాన్ నుంచి దిగుమతులు జరుగుతున్నాయి. అయితే తగినంత సరఫరా లేకపోవడంతో, పాకిస్తాన్ ప్రభుత్వం ఇప్పుడు భారతదేశం నుంచి దిగుమతి చేసుకోవడానికి సిద్ధమవుతోంది. టోర్ఖమ్ సరిహద్దు నుంచి రోజుకు 100 కంటైనర్లు టమోటాలు, 30 కంటెయినర్ల ఉల్లిపాయలు సేకరిస్తున్నట్లు లాహోర్ మార్కెట్ కమిటీ కార్యదర్శి షాజాద్ చీమా తెలిపారు. డిమాండ్ కు తగినంత సరఫరా లేదని ఆయన వెల్లడించారు.
భారత్ నుంచే దిగుమతులు ఎందుకు..?
పాకిస్తాన్ ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఉల్లి, టమోటాను దిగుమతి చేసుకుంటోంది. అయితే పాక్ అవసరాలకంటే సరఫరా తక్కువగా ఉన్నాయి. ఈ క్రమంలో ఇరాన్ నుంచి కూరగాయలను పాక్ దిగుమతి చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈ పని తఫ్తాన్ సరిహద్దు నుంచి జరగాల్సి ఉంటుంది. ఇరాన్ ప్రభుత్వం దిగుమతి-ఎగుమతిపై పన్నును భారీగా పెంచినందున వస్తువుల ఖరీదు పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ నుంచి వీటిని కొనుగోలు చేయటం పాకిస్తాన్ కు ప్రస్తుతం ఉన్న ఉత్తమమైన ఎంపిక.