కరోనా ఎఫెక్ట్: అద్దెలు తగ్గించమంటున్న ఓయో, జొమాటో సహా బడా కంపెనీలు
దేశంలోని విజయవంతమైన స్టార్టుప్ కంపెనీల నుంచి సాధారణ బిజినెస్ ల వరకు కరోనా ప్రభావం విపరీతంగా పడింది. ఇండియాలో దాదాపు రెండు నెలల పాటు లాక్ డౌన్ కొనసాగించడంతో వ్యాపారాలు బాగా దెబ్బతిన్నాయి. కొన్ని వ్యాపారాలు పూర్తిగా దెబ్బతినగా... మరికొన్ని పాక్షికంగా ఇబ్బందులకు గురైనాయి. ఆర్థిక వ్యవస్థ దివాళా తీస్తుందన్న అంచనాల నేపథ్యంలో దేశంలో కరోనా పోసిటివ్ కేసులు పెరుగుతున్నప్పటికీ... లాక్ డౌన్ ను సడలించారు. దీంతో జూన్ 1 నుంచి దాదాపు అన్ని వ్యాపారాలు మళ్ళీ కార్యకలాపాలు మొదలు పెట్టాయి.
అయితే, ఇక్కడే ఒక కొత్త చిక్కొచ్చి పడింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అందరూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తుండటం... మాస్కులు ధరించి బయటకు వస్తుండటం, మెజార్టీ ఉద్యోగులకు ఇప్పటికీ వర్క్ ఫ్రొం హోమ్ ఆప్షన్ ఇస్తుండటంతో చాలా బిజినెస్ లకు మునుపటి స్థాయిలో ఆఫీస్ ల అవసరం ఉండటం లేదు. పైగా ఖర్చులు తగ్గించుకునేందుకు ఉన్న అవకాశాలను కంపెనీలు అన్వేషిస్తున్నాయి. ఇందులో భాగంగా ఆఫీస్ ల ఖర్చులు కూడా తగ్గించుకునేందుకు బిల్డర్లతో చర్చలు మొదలు పెట్టాయి. తమ అద్దెలను తగ్గించాలని, దీర్ఘకాలిక లీజు అగ్రిమెంట్లను తిరగరాయాలని కోరుతున్నాయి.
విదేశీ రుణ మార్కెట్ల వైపు టాటా సన్స్ చూపు- రెండేళ్ల వ్యవధిలోనే మరోసారి ?
30% వరకు తగ్గింపునకు చర్చలు...
ప్రముఖ హోటల్ గదుల రెంటల్స్ స్టార్టుప్ ఓయో, క్యాబ్ సంస్థ ఓలా, డిజిటల్ పేమెంట్స్ సంస్థ పేటీఎం, ఫుడ్ డెలివరీ స్టార్టుప్ కంపెనీలు స్విగ్గి, జొమాటో, రైడ్ హైలింగ్ సంస్థ ఉబెర్ వంటి బడా కంపెనీలు ప్రస్తుతం తమ ఆఫీస్ రెంటల్స్ తగ్గించాలని బిల్డర్లతో చర్చలు మొదలు పెట్టాయి. కరోనా ముందు పరిస్థితులతో పోల్చితే కనీసం మూడో వంతు అద్దె తగ్గించాలని కోరుతున్నాయి. ఈ మేరకు ది ఎకనామిక్ టైమ్స్ ఒక ప్రత్యేక కథనం ప్రచురించింది. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఉన్న తమ కార్యాలయాలకు సంబంధించి చర్చలు పురోగతిలో ఉన్నట్లు సమాచారం. ఖర్చులు తగ్గించుకునేందుకు ఇప్పటి వరకు ఉన్న కార్యాలయ స్థలాన్ని తగ్గించుకునేందుకు కూడా వెనుకాడటం లేదు. రీజినల్ ఆఫీస్ లను పూర్తిగా మూసివేసేందుకు కూడా సంసిద్ధమవున్నాయి.
భారీ వ్యయం...
సాధారణంగా ప్రతి కంపెనీకి ఫిక్స్డ్ కాస్ట్స్ ఉంటాయి. అందులో ఉద్యోగుల జీత భత్యాలు ప్రధానమైనవి కాగా... రెండో అతిపెద్ద వాటా రియల్ ఎస్టేట్ డే ఉంటుందని చెప్పొచ్చు. అంటే కార్యాలయాలకు చెల్లించే అద్దెలు, లీజు రెంటల్స్. కాబట్టి, ఇప్పుడు అన్ని కంపెనీలు దీనిపైనే దృష్టిసారించాయి. ఉదాహరణకు స్విగ్గి ఇటీవలే 1,100 మంది ఉద్యోగులను తొలగించింది. అంటే ఆ మేరకు కంపెనీకి కార్యాలయ స్థలం కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు ఉద్యోగులను తగ్గించని కంపెనీ అంటూ లేదంటే అతిశయోక్తి కాదు. కాబట్టి, ఆ మేరకు ప్రభావం కమర్షియల్ రియల్ ఎస్టేట్ పై పడుతోంది. అయితే ప్రస్తుతం కంపెనీల ముందు రెండు మూడు ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటివరకు వినియోగించని కార్యాలయ స్థలాన్ని తిరిగి యజమానికి అప్పగించటం, లేదా రెంటల్స్ ను వాయిదా వేసుకోవటం వంటి లిమిటెడ్ ఆప్షన్స్ ఉపయోగించుకోవాల్సి ఉంటుంది.
అందుకే అలా...
నిజానికి ఒక కంపెనీకి ఉన్న కార్యాలయ స్థలం, దాని రూపురేఖలతో వినియోగదారులకు ఎలాంటి ప్రత్యక్ష సంబంధం ఉండదు. అది నేరుగా కంపెనీ అందించే సేవలపై కూడా ఎలాంటి ప్రభావాన్ని చూపలేదు. అందుకే, రియల్ ఎస్టేట్ కాస్ట్ తగ్గించుకోవటం ఇప్పుడు తప్పనిసరి అయిందని స్విగ్గి సీఈఓ శ్రీహర్ష మాజేటి పేర్కొన్నట్లు ఈటీ తన కథనంలో వెల్లడించింది. ఉడాన్, జొమాటో, బౌన్స్ వంటి అనేక ఇతర సంస్థలు కూడా దాదాపు ఇదే అభిప్రాయంతో ఉన్నాయి. జొమాటో కు ప్రపంచవ్యాప్తంగా సుమారు 150 ఆఫీస్ లు ఉండగా.. వాటిని సగానికి కుదించే ప్రయత్నాల్లో ఉంది. వీలైతే ఇంకా తగ్గించే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది. మెజారిటీ ఉద్యోగులు వర్క్ ఫ్రొం హోమ్ చేస్తుండటంతో కార్యాలయాల అవసరం తగ్గుతుందన్న మాట మాత్రం వాస్తవం.