50% కంటే ఎక్కువ భారతీయులు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీకి సిద్ధం కాలేదు
కరోనా వైరస్, లాక్ డౌన్ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయి. దేశవ్యాప్తంగా 50 శాతం మందికి పైగా లైఫ్స్టైల్ సంబంధిత వ్యాధులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేరని ఎస్బీఐ లైఫ్ సమగ్ర ఆర్థిక నిరోధకశక్తి సర్వే వెల్లడించింది. ఈ సర్వే ప్రకారం... ప్రతి 10 మంది భారతీయుల్లో 8మంది (78 శాతం మంది) ఒత్తిడి, ఆందోళన, మానసిక, శారీరక రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తుందని భావిస్తున్నారు. అలాగే, సగం మందికి పైగా తాము లైఫ్ స్టైల్ వ్యాధులకు సంబంధించి ఆర్థిక అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధం కాలేదని చెబుతున్నారు.
భారత ఆర్థికవ్యవస్థ, ప్రభుత్వ ఉద్యోగాలపై అభిజిత్ బెనర్జీ కీలక వ్యాఖ్యలు
ఇవి ఆందోళనకరం..
- క్లిష్టమైన అనారోగ్యాలకు సంబంధించి ఆర్థిక భద్రత లేకపోవడం, కుటుంబ సభ్యులు కరోనా మహమ్మారి లేదా ఇతర సమయాల్లో ఇలాంటి వ్యాధుల బారిన పడటం, ఉద్యోగం కోల్పోవడం లేదా ఆదాయాన్ని కోల్పోవడం వంటి 3 అంశాలు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో చాలా ఆందోళనకరమైనవని ఈ సర్వే వెల్లడించింది.
- ప్రతి 10 మంది భారతీయుల్లో 8 మంది (80 శాతం) లైఫ్ ఇన్సురెన్స్ ద్వారా కుటుంబానికి భద్రతను ఇవ్వాలని భావిస్తున్నారు.
- ప్రతి 10 మంది భారతీయుల్లో 6గురి కంటే ఎక్కువ (61 శాతం) చికిత్స ఖర్చుల కోసం, కుటుంబంపై ఆర్థిక ఒత్తిడిని నివారించేందుకు క్రిటికల్ ఇల్నెస్ ప్లాన్ లేదా కవర్ను కోరుకుంటున్నారు.
- ప్రతి 10 మంది భారతీయుల్లో 7గురి కంటే ఎక్కువ (75 శాతం) క్రిటికల్ ఇల్నెస్ కవర్ను కలిగి లేరు. అయితే ఇలాంటి హెల్త్ ఇన్సురెన్స్ను రాబోయే మూడు నెలల్లో కొనుగోలు చేయాలని భావిస్తున్నారు.
13 నగరాలలో సర్వే..
ఎస్బీఐ లైఫ్ ఇన్సురెన్స్ సర్వేలో 13 ముఖ్య నగరాల నుండి 2400 మంది కంటే ఎక్కువ కన్స్యూమర్లు భాగస్వామ్యం అయ్యారు. కరోనా నేపథ్యంలో చాలామంది శారీరక రోగ నిరోధక శక్తి పైన ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. దాదాపు ప్రతి ఒక్కరు రోగ నిరోధక శక్తి వైపు చూస్తున్నారు. ఒత్తిడి మానసిక, శారీరక రోగ నిరోధక శక్తిపై ప్రభావం చూపుతుందని ప్రతి పదిమందిలో 8 మందికి తెలుసు. అయితే ఒత్తిడికి మూడు ప్రధాన కారణాలుగా చెబుతున్నారు. కరోనా వంటి అనారోగ్యానికి ఆర్థిక సన్నద్ధత, కుటుంబ సభ్యులకు వ్యాధి సోకడం, ఉద్యోగం లేదా ఆదాయ నష్టం ఇబ్బందికరమని వెల్లడించారు. మొత్తానికి యాభై శాతానికి పైగా భారతీయులు ఇలాంటి ఆర్థిక అత్యవసర పరిస్థితులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా లేరు.
ఆర్ధిక రోగ నిరోధక శక్తి
సర్వే ఫలితాలపై ఎస్బీఐ లైఫ్ జోన్ II ప్రెసిడెంట్ ఆనంద్ మాట్లాడుతూ... మన దేశంలో గత ఆరు నెలల కాలంలో మహమ్మారి ప్రభావం ఉందని, ఓ వైపు సవాళ్లు ఉన్నప్పటికీ ఫైనాన్షియల్ ఇమ్యూనిటీ (ఆర్థిక సామర్థ్యం)పై ఎస్బీఐ లైఫ్ కస్టమర్ అధ్యయనం దానిని పెంపొందించుకునే అవసరాన్ని తెలియజేస్తోందని అభిప్రాయపడ్డారు. తద్వారా బలమైన ఆర్థిక రోగ నిరోధక శక్తిని నిర్మించుకోవచ్చునని తెలిపారు.