డెబిట్, క్రెడిట్ కార్డు వినియోగదారులకు షాక్: అమ్మకానికి 10 లక్షల కార్డుల వివరాలు!
సైబర్ క్రైమ్ నేరాలు నానాటికి పెచ్చు మీరుతున్నాయి. ప్రభుత్వాలు ఏమో నగదు నుంచి డిజిటల్ వైపు మళ్లాలని ప్రజలను ముప్పు తిప్పలు పెడుతున్నాయి. పోనీలే దేశానికి మంచి జరుగుతుందంటే కష్టమైనా మారుదాం అని పెద్ద ఎత్తున భారత పౌరులు డెబిట్, క్రెడిట్ కార్డులను వినియోగిస్తున్నారు. చిన్నా, చితకా నుంచి భారీ ఆర్థిక లావాదేవీలు అన్నిటికీ ప్లాస్టిక్ కార్డులనే వాడుతున్నారు. ఆన్లైన్ షాపింగ్ కు కూడా అధికంగా కార్డులను వినియోగిస్తున్నారు. దీంతో రెండు, మూడేళ్ళ లోనే దేశంలో జరిగే మొత్తం ఆర్థిక లావాదేవీల్లో కార్డుల వాటా భారీగా పెరిగిపోయింది.
కానీ అదే ఇప్పుడు వినియోగదారులకు కొత్త తలనొప్పిని తెచ్చి పెడుతోంది. ఆన్లైన్ లో కార్డులను వాడుతున్నప్పుడు, ఎటిఎం లలో నగదు ఉపసంహరణ సమయంలో,మర్చంట్ల దగ్గరస్వైప్ చేసేప్పుడు డెబిట్, క్రెడిట్ కార్డులు స్కిమ్మింగ్ (కాపీ) కు గురవుతున్నాయి. వినియోగదారులకు తెలియకుండానే... వారి సమస్త సమాచారం, కార్డు వివరాలు సైబర్ నేరగాళ్లకు చేతికి చిక్కుతున్నాయి. ఇంకేముంది, ఈ వివరాలను ఆగంతకులు వారికి నచ్చిన విధంగా ఉపయోగించుకొంటున్నారు. దీంతో కార్డు దారుల ప్రయోజనాలు పూర్తిగా గాలిలో దీపంలా మారిపోతున్నాయి. ఘనతికెక్కిన మన ప్రభుత్వాలు మాత్రం సైబర్ నేరగాళ్ళను పట్టుకొని శిక్షించటంలో ఎనలేని నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నాయి.
గుడ్ న్యూస్: మ్యూచువల్ ఫండ్స్ లో జోరుగా ఉద్యోగాలు !
అమ్మకానికి 10లక్షల కార్డులు వివరాలు...
తాజాగా ఇలాంటి సైబర్ కుంభకోణం ఒకటి వెలుగు చూసింది. డార్క్ నెట్ మార్కెట్ ప్లేస్ గా పరిగణించే జోకేర్స్ స్టాష్ అనే ఆన్లైన్ సైట్ లో సుమారు 13 లక్షల మందిక్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలను అమ్మకానికి ఉంచారు. ఇందులో సుమారు 98% కార్డులు భారత దేశానికి చెందిన వినియోగదులవేనని తెలుస్తోంది. దీంతో మన దేశంలో కార్డుల భద్రత ఎంత అధ్వాన్నంగా ఉందొ స్పష్టమవుతోంది. సింగపూర్ కు చెందిన గ్రూప్ ఐబి అనే సంస్థ ప్రస్తుత ఫ్రాడ్ ను వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ సంస్థ సైబర్ నేరాలను పసిగట్టడం, నిరోధించటం లో ఎక్స్పర్ట్. ఈ మేరకు ది టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక కథనాన్ని ప్రచురించింది. దీని ప్రకారం... అమ్మకానికి ఉంచిన కార్డులోని వివరాలు రెండు విభాగాలుగా లభించనున్నాయి. వాటితో మరో కొత్త నకిలీ కార్డును సృష్టించ వచ్చు (క్లోనింగ్), అలాగే ఆన్లైన్ ట్రాన్సక్షన్స్ కు వినియోగించ వచ్చు.
స్కిమ్మింగ్ ద్వారా ..
ఇంత భారీ మొత్తంలో కార్డుల సమాచారాన్ని సేకరించిన సైబర్ నేరగాళ్లు... స్కిమ్మింగ్ ప్రక్రియ ద్వారానే వాటిని సేకరించారని తెలుస్తోంది. ఎటిఎం లలో ఎవరికీ తెలియ కుండా ఏర్పాటు చేసే స్కిమ్మింగ్ యంత్రాలతో నేరగాళ్లు వారి పనిని సులువు చేసుకొంటున్నారు. అంతే కాకుండా సురక్షితం కానీ ఆన్లైన్ వెబ్సైట్ల లో లావాదేవీలు నిర్వహించేప్పుడు హాకింగ్ ప్రక్రియ ద్వారా పెద్ద ఎత్తున కార్డుల వివరాలు తెలుసుకొంటున్నట్లు తేలింది. అదే సమయంలో రిటైల్ మర్చంట్ లు ఉపయోగించే స్వీపింగ్ యంత్రాల ద్వారా కూడా కార్డుల క్లోనింగ్ జరుగుతోందని గుర్తించారు. ఈ విషయం సదరు మర్చంట్ కు తెలియకుండానే జరుగుతుండటం గమనార్హం.
100 డాలర్లకు ఒక కార్డు...
సైబర్ నేరగాళ్లు అనేక పద్ధతుల్లో సేకరించిన కార్డు వివరాలను ఆన్లైన్ లో బేరానికి పెడుతున్నారు. ఒక్కో కార్డు ను సుమారు 100 డాలర్లు (దాదాపు రూ 7,000) కు విక్రయిస్తున్నారు. దీంతో ప్రస్తుతం వారు ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ లో ఉంచిన మొత్తం కార్డుల విలువ సుమారు 130 మిలియన్ డాలర్లు (దాదాపు రూ 910 కోట్లు ) ఉంటుందని భావిస్తున్నారు. గ్రూప్ ఐబి ఫౌండర్ అండ్ సీఈఓ ఇయిల్య సాఛ్నోవ్ ఒక ప్రకటనలో వెల్లడించినట్లు ది టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది.
ఒకే బ్యాంకు కార్డులు 18%...
ప్రస్తుతం లీకైన కార్డుల వివరాల్లో భారత్ కు చెందిన ఒకే బ్యాంకునవి 18% ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే, అది ఏ బ్యాంకు అన్నది మాత్రం వెల్లడించలేదు. కేవలం ఒక బ్యాంకు కార్డుల వివరాలు అధికంగా ఉన్నంత మాత్రాన .. ఆ బ్యాంకు కార్డులన్నీ ఇలా సైబర్ ఫ్రాడ్ కు గురి అవుతున్నట్లు కాదని నిపుణులు పేర్కొంటున్నారు. అభివృద్ధి చెందిన అమెరికా, యూరోప్ దేశాల్లో వినియోగదారుల సమాచారం లీక్ అయితే, ఆ విషయాన్నీ సదరు ఆర్థిక సంస్థలు 24 గంటల్లోగా వారికి తెలుస్తాయి. కానీ మన దేశంలో అలాంటి చట్టాలు లేకపోవటంతో ఆ విషయం ముందు బ్యాంకులకు కూడా తెలియటం లేదని నిపుణులు చెబుతున్నారు.
2016 లో కూడా 32 లక్షల కార్డులు లీక్...
ఇదిలా ఉండగా... భారత దేశానికి చెందిన కార్డుల వివరాలు లీక్ అవటం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా 2016 సెప్టెంబర్ లో సుమారు 32 లక్షల డెబిట్ కార్డుల వివరాలు లీక్ అయ్యాయి. అయితే, అది ఒక సంస్థ పేమెంట్ సిస్టమ్ లోపం వల్ల బహిర్గతం అయ్యాయి. ఇందులో ఎస్ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా తదితర ప్రధాన బ్యాంకులకు చెందిన కార్డులు కూడా ఉన్నాయి.