4 ఏళ్లలో 1600కు పైగా కంపెనీల్లోకి చైనా నుండి భారీ పెట్టుబడులు, ఎన్ని వచ్చాయంటే?
2016 ఏప్రిల్ నుండి 2020 మార్చి మధ్య... నాలుగేళ్లలో చైనా నుండి 1600కు పైగా భారత కంపెనీలకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) 1 బిలియన్ డాలర్లు (రూ.7500 కోట్లు) వచ్చాయి. భారత కంపెనీల్లో చైనా సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత కంపెనీల్లో చైనా సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టిన విషయం వాస్తవమేనా అని రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పింది.
వేగంగా కోలుకుంటున్న చైనా, అమెరికా సహా ఇతర దేశాలకు రికార్డ్ ఎగుమతులు
46 రంగాల్లోకి పెట్టుబడులు.. ఆటో టాప్
పదహారు వందలకు పైగా భారతీయ కంపెనీల్లోకి 1.02 బిలియన్ డాలర్ల (1,020.25 మిలియన్లు) ఫారన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ చైనా నుండి వచ్చాయని, ఈ మొత్తం గత నాలుగు ఆర్థిక సంవత్సరాలలో వచ్చాయని ప్రభతుత్వ డేటా వెల్లడిస్తోంది. 46 రంగాల్లోని వివిధ కంపెనీల్లోకి ఈ పెట్టుబడులు వచ్చాయని వెల్లడిస్తోంది. ఆటోమొబైల్ ఇండస్ట్రీ, ప్రింటింగ్ బుక్స్(లితో ప్రింటింగ్ఇండస్ట్రీ సహా), ఎలక్ట్రానిక్స్, సేవలు, ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ వంటి రంగాల్లోకి ఈ పెట్టుబడులు చైనా నుండి వచ్చాయి. వీటిలో ఆటోమొబైల్ రంగానికి ఎక్కువగా FDI రూపంలో పెట్టుబడుల వచ్చాయి. 172 మిలియన్ డాలర్ల పెట్టుబడులు ఆటోమొబైల్ ఇండస్ట్రీలోకి, సర్వీస్ రంగంలోకి 139.65 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి.
చైనీస్ పెట్టుబడులు.. రాతపూర్వక సమాధానం
ఈ మేరకు రాజ్యసభలో కార్పోరేట్ అఫైర్స్ మినిస్టర్ అనురాగ్ సింగ్ ఠాకూర్ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు. చైనీస్ ఏజెన్సీల పెట్టుబడులకు సంబంధించి కార్పోరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమాచారాన్ని నిర్వహించదని తెలిపారు. దేశంలో ఈక్విటీ ఇన్ఫ్లో ద్వారా నివేదించబడిన ఎఫ్డీఐ డేటాను ఎఫ్డీఐ డేటా సెల్ సంకలనం చేసి నిర్వహిస్తుందని తెలిపారు. ప్రస్తుతం, భారత్-చైనా మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు చోటు చేసుకుంటోన్న విషయం తెలిసిందే.
చైనా పెట్టుబడులు..
కాగా, గత మూడేళ్లుగా చైనా నుండి పెట్టుబడులు తగ్గినట్లుగా ఇటీవల డేటా ద్వారా వెల్లడైన విషయం తెలిసిందే. చైనా నుండి ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) గత మూడేళ్లుగా తగ్గుతున్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 163.77 మిలియన్ డాలర్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయి. ఈ మేరకు ఆర్థిక శాఖ సహాయమంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ రెండు రోజుల క్రితం లోకసభకు తెలిపారు.
కేంద్రమంత్రి లెక్కల ప్రకారం గత మూడేళ్లుగా చైనీస్ పెట్టుబడులు తగ్గుతూ వస్తున్నాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంలోకి FDIల రూపంలో దేశంలోకి రూ.163.77 కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చినట్లు అనురాగ్ ఠాకూర్ తెలిపారు. 2017-18లో రూ.350.22 మిలియన్ డాలర్లు రాగా, 2018-19లో 229 మిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు వచ్చాయని కేంద్రమంత్రి వెల్లడించారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే గత ఏడాది 28.5 శాతం మేర పెట్టుబడులు తగ్గాయి. గత ఆర్థిక సంవత్సరం భారీగా తగ్గాయన్నారు. అంతకుముందు రెండేళ్ల క్రితంతో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో సగం కంటే ఎక్కువగా పడిపోయాయి. 2020 క్యాలెండర్ ఇయర్లో భారత్లోకి 20.63 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని, గత ఏడాది ఇదే కాలంలో 27.57 మిలియన్ డాలర్లు వచ్చాయని అనురాగ్ తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో FDI పాలసీను కేంద్రం కఠినతరం చేసిన విషయం తెలిసిందే. చైనా కంపెనీలు భారత కంపెనీలను చేజిక్కించుకునే ప్రయత్నాలను అడ్డుకునే క్రమంగా FDI పాలసీని కఠినతరం చేసింది.